గన్నవరం నియోజకవర్గంలో అధికార పార్టీ వైసీపీలోని సీనియర్ నేతల్లో ఒకరైన దుట్టా రామచంద్రరావు పార్టీలో ఇమడలేకపోతున్నారా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావుపై తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా వల్లభనేని వంశీ గెలిచారు. అయితే వైసీపీ అధికారంలోకి రావటంతో మారిన రాజకీయాల కారణంగా వంశీ టీడీపీకి దూరమయ్యారు.
డైరెక్టుగా వంశీ వైసీపీలో చేరకపోయినా అనధికారికంగా అధికార పార్టీ ఎంఎల్ఏగానే కంటిన్యూ అవుతున్నారు. ఎప్పుడైతే వంశీ వైసీపీలో చేరారో అప్పటి నుంచి యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు వర్గాలకు పడటం లేదు. అయితే యార్లగడ్డ-వంశీ-దుట్టా తో గతంలోనే జగన్మోహన్ రెడ్డి భేటీఅయి సర్దుబాటుకు ప్రయత్నించారు. జగన్ జోక్యం తర్వాత వంశీ-యార్లగడ్డ మధ్య గొడవలు తగ్గిపోయాయి. అయితే దుట్టాతో మాత్రం వంశీకి గొడవలు జరుగుతునే ఉన్నాయి.
వీళ్ళిద్దరి మధ్య సర్దుబాటుకు మంత్రులు, సజ్జల ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఇదే సమయంలో రెండువర్గాల మధ్య వివాదాలు బాగా పెరిగిపోతున్నాయి. దాంతో దుట్టా వర్గం మండిపోతోంది. ఈ నేపధ్యంలోనే దుట్టా అల్లుడు శివభరత్ రెడ్డి-వంశీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వంశీని అదుపులో పెట్టకపోతే తమదారి తాము చూసుకుంటామని శివ చేసిన వాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ మాటలు చెప్పింది అల్లుడే అయినా దుట్టా ఆమోదం లేకుండా సాధ్యం కాదనే విషయం అర్దమైపోయింది.
అయితే దుట్టాకు అర్ధమవ్వాల్సిందేమంటే వంశీని వదులుకునేందుకు జగన్ కూడా సిద్ధంగా లేరు. పైగా తమ దారి తాము చూసుకుంటామని బెదిరింపు ధోరణిలో మాట్లాడితే జగన్ అసలు పట్టించుకోరు. వెళ్ళిపో దలచుకుంటే పార్టీ నుంచి వెళ్ళిపోవటమే తప్ప బెదిరింపులతో సాధించేదేమీలేదు. ఇదే విషయాన్ని వంశీ వర్గం స్పష్టం చేస్తోంది. పార్టీలో తన పని తాను చేసుకుని పోతున్నానని, తనతో ఏదన్నా సమస్య వస్తే అది వాళ్ళ సమస్యే కానీ తన సమస్య ఎంతమాత్రం కాదని వంశీ బహిరంగంగానే చెప్పేశారు. వాళ్ళు ఏమి చేయదలచుకున్నారో వాళ్ళిష్టమని కూడా వంశీ చెప్పారు. కాబట్టి ఇక నిర్ణయం తీసుకోవాల్సింది దుట్టాయే.
Gulte Telugu Telugu Political and Movie News Updates