కేంద్రం ఎఫెక్ట్‌: జ‌గ‌న్ వైపే జ‌నం చూపులు

దేశంలో ఠారెత్తుతున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను తాజాగా కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు భారీగా త‌గ్గించింది. పెట్రోల్‌పై 8 రూపాయ‌లు, డీజిల్‌పై 6 రూపాయ‌లు త‌గ్గించింది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు రాష్ట్రంలోని వైసీపీ స‌ర్కారు వైపే ప్ర‌జ‌లు చూస్తున్నారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా ఏపీలో నే పెట్రోల్‌, డీజిల్‌పై సుంకాలు.. వ‌సూలు చేస్తున్నారు. ఈ విష‌యంపై కొన్నాళ్లుగా తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అయినా.. కూడా జ‌గ‌న్ స‌ర్కారు వెన‌క్కి త‌గ్గ‌లేదు. ఇక‌, ఇప్పుడు ఏం చేస్తుంద‌నేది ప్ర‌జ‌ల మాట‌. ఎందుకంటే.. కేంద్రం త‌గ్గించినా.. రాష్ట్రం త‌గ్గించ‌క‌పోతే.. ఈ వేడి నేరుగా సీఎం జ‌గ‌న్‌నే తాక‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు..

బీజేపీ మోడీ భ‌జ‌న‌!

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అందరితోకలసి, అందరి అభివృద్ధికోసం, అందరి విశ్వాసమూ పొంది సమర్ధపాలన అందిస్తోంద‌ని రాష్ట్ర బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అన్నారు. కరోనాతో కుదేలైన ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో అన్ని రేట్లూ పెరిగిపోయాయని తెలిపారు. మూలిగే నక్కపై తాటిపండులా రష్యా యుక్రేన్ యుద్ధం అగ్ర రాజ్యాల ఆర్ధిక వ్తవస్థనే ఛిన్నాభిన్నం చేసింద‌న్నారు. ఎన్నో కష్డనష్టాలు ఎదురవుతున్నా కేంద్ర ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తూ పరిపాలనా నౌకను భద్రంగా ఆర్ధికాభివృద్ధి తీరాలకు నడిపిస్తోంద‌ని కొనియాడారు.

ఈ క్రమంలో ప్రపంచ రేట్లను అనుసరించి పెట్రోలు డీజిలు తదితర ఉత్పత్తుల రేట్లు పెరిగాయన్నారు. ఇది భారంగా మారిందని ప్రజలు భావిస్తున్న తరుణంలో మోడీ స్వయంగా సమీక్ష జరిపి, కనీ వినీ ఎరుగని రీతిలో ఎక్సయిజు సుంకాలు భారీగా తగ్గించిందని సోము పేర్కొన్నారు. లీటరు పెట్రోలు మీద 8 రూపాయలు, డీజిలు మీద 6 రూపాయలూ తగ్గించిందని, దీనివల్ల పెట్రోలు ధర తొమ్మిదిన్నర రూపాయలు, డీజిలు ధర ఏడు రూపాయలూ త‌గ్గుతాయ‌న్నారు. తొమ్మిది కోట్లమంది పేదలకు లబ్ధి కలిగేలా వంట గ్యాస్ మీద రెండు వందల రూపాయల రాయితీ ప్రకటించారన్నారు.

జ‌గ‌న్ కు శాపం!

గతంలో ఎక్సయిజు సుంకాలు తగ్గించినపుడు వైసీపీ ప్రభుత్వం తనవంతు సాయం ప్రజలకు చేయలేదని సోము దుయ్య‌బ‌ట్టారు అనేక రాష్ట్రాలు, ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాలు అప్పట్లో సుంకాలు తగ్గించాయని, కర్నాటక వంటి పొరుగు రాష్ట్రాలనుంచి సరిహద్దు ప్రజలు పెట్రోలు డీజిలు పోయించుకోవటం సాధార‌ణంగా మారింద‌ని అన్నారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో కూడా ధ‌ర‌లు త‌గ్గించాల‌న్నారు. “జ‌గన్ గారూ! ఈసారైనా స్పందించండి. మీవంతుగా పన్నులు తగ్గించి పెట్రోలు, డీజిలు మరింత అందుబాటు ధరలో దొరికేలా ప్రజలకు సాయం చేయండి. లేదంటే రాష్ట్ర ప్రజలు‌ మిమ్మల్ని క్షమించరు.” అని సోము శాపం పెట్టారు.