రావెల ప్ర‌స్థానం బీజేపీలో ముగిసింది !

బీజేపీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభాగ ఉపాధ్య‌క్షులు, మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు తన ప‌ద‌వికి రాజీనామా చేశారు. కొన్ని వ్య‌క్తిగ‌త కార‌ణాల రీత్యా తాను ప‌ద‌వి నుంచి త‌ప్పుకుంటున్నాన‌ని పేర్కొంటూ రాజీనామా లేఖ‌ను విడుద‌ల చేశారు. నరేంద్ర మోడీ నాయ‌క‌త్వంపై త‌న‌కు న‌మ్మ‌కం ఉంద‌ని, ఆయ‌న దేశాన్ని శ‌క్తిమంతం అయిన భార‌త్ గా రూపొందింప‌జేస్తారు అన్న న‌మ్మ‌కంతోనే ఇటుగా వ‌చ్చాన‌ని పేర్కొంటూ, ఆర్థిక, రాజ‌కీయ అస‌మానత‌లు తొల‌గించే క్ర‌మంలో మోడీ కృషి చేస్తారు అని భావించే ఇటుగా వ‌చ్చేన‌ని ఆయన త‌న లేఖ‌లో కొన్ని విషయాలు ప్ర‌స్తావించారు. న‌రేంద్ర మోడీ అవినీతి ర‌హిత, సుస్థిర పాల‌న అందిస్తార‌న్న న‌మ్మకంతోనే తాను ఇటుగా అడుగులు వేశాన‌ని అన్నారు. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ రావెల ప్ర‌స్థానం బీజేపీలో ముగిసింది.

న‌వ్యాంధ్ర‌లో మంత్రిగా ఓ వెలుగు వెలిగారు. త‌రువాత కొన్ని ఆరోప‌ణ‌ల రీత్యా టీడీపీ నుంచి త‌ప్పుకుని జ‌న‌సేన తో బంధం పెంచుకున్నారు. అక్క‌డా నిల‌దొక్కుకోలేక‌పోయారు. త‌రువాత ప‌రిణామాల నేప‌థ్యంలో బీజేపీ లో స‌భ్య‌త్వం అందుకుని, కీల‌క ప‌ద‌వి ద‌క్కించుకున్నారు. సోము వీర్రాజు త‌రువాత స్థానం ఆయ‌నదే అవ్వ‌డం ఇక్క‌డ ప్ర‌స్తావ‌నార్హం. కానీ ప‌ద‌విలో ఉండ‌గా జ‌గ‌న్ ను పెద్ద‌గా టార్గెట్ చేయ‌లేదు. అలానే వీడిపోతున్న వేళ పార్టీ పై కూడా పెద్ద‌గా అసంతృప్తి ఏమీ వ్య‌క్తం చేయ‌లేదు. మ‌రి! ఆయ‌న ప్ర‌స్థానం ఎటు ?

బీజేపీకి రాజీనామా చేసిన త‌రువాత టీడీపీలోకి మ‌ళ్లీ ఆయ‌న వెళ్ల‌నున్నార‌ని తెలుస్తోంది. మ‌రోవైపు ఇవేవీ కాద‌ని వైసీపీ గూటికి చేరినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. గుంటూరు జిల్లా, తాడికొండ మండ‌లంకు చెందిన ఆయ‌న కొంత కాలం ఆర్థిక శాఖ అధ్యాప‌కుడిగా ప‌నిచేశారు. ప్ర‌కాశం జిల్లాలో ఆయ‌న త‌న అధ్యాపక వృత్తిని కొనసాగించారు. త‌రువాత ఆయ‌న గుజ‌రాత్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబెషిన‌రీ ఆఫీస‌ర్ గా ప‌నిచేశారు.

తరువాత దివంగ‌త స్పీక‌ర్ జీఎంసీ బాల‌యోగి ద‌గ్గ‌ర కూడా పీఎస్ గా ప‌నిచేశారు. 2014లో ఐఆర్ఎస్ ఆఫీస‌ర్ గా త‌న ఉద్యోగ జీవితానికి రాజీనామా చేసి, ఇటుగా వ‌చ్చారు. ప్ర‌త్తిపాడు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీచేసి మేక‌తోటి సుచరిత‌ను ఓడించారు. చంద్ర‌బాబు స‌ర్కారులో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ప‌నిచేశారు. అటు త‌రువాత కుమారుడిపై కొన్ని ఆరోప‌ణ‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో ప‌దవి నుంచి త‌ప్పుకున్నారు. అక్క‌డి నుంచి ఆయ‌న రాజ‌కీయ జీవితం ఒడిదొడుకుల నేప‌థ్యంలోనే ఉంది.