నారాయణపై కేసు నిలుస్తుందా?

దాదాపు ఐదు రోజులు వెతికి వెతికి, జల్లెడ పట్టి చివరకు ఫోన్ సిగ్నల్ ద్వారా నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణ ను పోలీసులు అరెస్టు చేశారు. ఉదయం అదుపులోకి తీసుకున్న నారాయణను పోలీసులు రాత్రికి చిత్తూరుకు తరలించారు. విచారణ కోసం నారాయణను తమకు అప్పగించాలని పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అయితే నారాయణను పోలీసు రిమాండ్ కు పంపకుండా మెజిస్ట్రేట్  వెంటనే బెయిల్ మంజూరు చేశారు.

నారాయణను పట్టుకునేందుకు, అదుపులోకి తీసుకుని హైదరాబాద్ నుండి చిత్తూరుకు తీసుకొచ్చేంత సమయం కూడా నారాయణను పోలీసులు తమ కస్టడీలో  ఉంచుకోలేకపోయారు.  కోర్టులో నారాయణను ప్రవేశపెట్టగానే మెజిస్ట్రేట్ ఇలా బెయిల్ మంజూరు చేసేశారు. దీనికి కారణం ఏమిటంటే నారాయణ విద్యాసంస్థలకు, నారాయణకు ఇపుడు ఎలాంటి సంబంధం లేదని తేలటమే. 2014లోనే విద్యాసంస్థల ఛైర్మన్ గా నారాయణ రాజీనామా చేసినట్లు ఆయన తరపు లాయర్లు మెజిస్ట్రేట్ కు ఆధారాలు చూపించారు.

దాంతో మెజిస్ట్రేట్ ముందు  పోలీసుల వాదన వీగిపోయింది. అందుకనే లాయర్ల వాదననే సమర్థిస్తు నారాయణకు బెయిల్ ఇచ్చారు. ఈ సందర్భంగా లక్ష రూపాయల చొప్పున ఇద్దరు పూచీకత్తు ఇవ్వాలని కూడా కోర్టు ఆదేశించింది. సరే బెయిల్, పూచీకత్తు, అంతకుముందు పోలీసుల కష్టాన్ని అంతా పరిశీలిస్తే అసలు నారాయణ మీద కేసు నిలుస్తుందా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. మామూలుగా అయితే నారాయణ విద్యాసంస్థల అధినేత ఎవరంటే చిన్నపిల్లలు కూడా చెప్పేస్తారు నారాయణే అని. కానీ టెక్నికల్ గా మాత్రం నారాయణ కాదట.

మరీ దశలో 10వ తరగతి పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీలో ప్రధాన భాగస్వామ్యముందని నారాయణపై పెట్టిన కేసు నిలుస్తుందా ? ప్రశ్నపత్రం బయటకు వచ్చింది నారాయణ స్కూల్ వైస్ ప్రిన్సిపల్ గిరిధర్ రెడ్డి మొబైల్ నుండే అన్నది ఆరోపణ. అయితే గిరిధర్ రెడ్డి ద్వారా జరిగిన లీకేజీకి నారాయణకు ఏమిటి సంబంధం ? నారాయణ చెబితేనే తాను లీక్ చేసినట్లు ఇప్పటికే వైస్ ప్రిన్సిపల్ అంగీకరించారట. రేపు కోర్టులో తాను అలా చెప్పలేదని కొట్టి అలా చెప్పించారని గిరిధర్ అడ్డం తిరిగితే పోలీసులు ఏమి చేయగలరు ? ఇలాంటి అనేక అనుమానాల నేపధ్యంలోనే నారాయణపై కేసు నిలుస్తుందా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి.