ఉమ్మ‌డి కృష్ణాలో వైసీపీ సీన్ రివ‌ర్సేనా…!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం త‌పిస్తున్న వైసీపీ ప‌రిస్థితి జిల్లాకో ర‌కంగా ఉంది. ఉమ్మ‌డి కృష్ణాజిల్లాను తీసుకుంటే.. ఈ జిల్లా ఇప్పుడు రెండు జిల్లాలుగా మారింది. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా. ఒక‌ప్పుడు ఉమ్మ‌డి జిల్లాలో ఫైర్ బ్రాండ్ నాయ‌కుడిగా చ‌క్రంతిప్పిన మాజీ మంత్రి కొడాలి నాని.. మంత్రి వ‌ర్గం నుంచి త‌ప్పించ‌డంతో మెత్త‌బ‌డ్డారు. దీంతో ఆయ‌న వాయిస్ ఎక్క‌డా వినిపించ‌డం లేదు. అదేవిధంగా పేర్ని నాని కూడా పూర్తిగా మౌనం పాటిస్తున్నారు. వీరిలో మంత్రి వ‌ర్గం నుంచి త‌ప్పించార‌నే బాధ ఇంకా పోలేదు.

ఇక‌, పెడ‌న ఎమ్మెల్యే జోగి ర‌మేష్‌కు మంత్రివ‌ర్గంలో చోటు ద‌క్కినా.. ఆయ‌న విప‌క్ష నేత‌ల‌పై ఫైర్ అవుతు న్నా.. అనుకున్న విధంగా మైలేజీ రావ‌డం లేదు. ఆయ‌న‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. పైగా.. ఆయ నను చాలా మంది వైసీపీ నాయ‌కులు మంత్రిగా కూడా గుర్తించ‌లేక పోతున్నార‌నే వాద‌న ఉంది. ఇదిలావుంటే.. ఎన్టీఆర్ జిల్లాలో అస‌లు ఎవ‌రూ మాట్లాడ‌డం లేదు. విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ఎమ్మెల్యే ఒక్క‌రే కొంత‌మేర‌కు మాట్లాడుతున్నా.. ఆయ‌న‌కూడా ఆశించిన విధంగా దూకుడు ప్ర‌ద‌ర్శించ‌లేక పోతున్నారు.

ఇక‌, మైల‌వ‌రం ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ గ్రాఫ్ అంతంత మాత్రంగానే ఉంది. అదే స‌మ‌యంలో నందిగామ ఎమ్మెల్యే బ‌య‌ట‌కు కూడా రావ‌డం లేదు. ఇక‌, జ‌గ్గ‌య్య పేట ఎమ్మెల్యే సామినేని త‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌లేద‌ని అలిగి హైద‌రాబాద్‌లోనే మ‌కాం వేశారు. ఇలా.. ఉమ్మ‌డి కృష్నాజిల్లాలో ఒక‌ప్పుడు వైసీపీని ప‌రుగులు పెట్టించిన నాయ‌కులు ఇప్పుడు స్త‌బ్దుగా మారిపోవ‌డంతో పార్టీఆ ప‌రిస్థితి ఏంట‌నే విష‌యంపై కీల‌క నేత‌లు మ‌థ‌న ప‌డుతున్నారు.

మ‌రో రెండేళ్ల‌లో ఎన్నిక‌లు ఉండడం.. టీడీపీకి బ‌ల‌మైన నాయ‌కులు.. క్షేత్ర‌స్థాయిలో బ‌ల‌మైన కార్య‌క‌ర్త‌లు ఉండ‌డం.. మాజీ మంత్రి దేవినేని ఉమా, ఎంపీ కేశినేని నాని, ఇత‌ర నాయ‌కులు కూడా క్షేత్ర‌స్థాయిలో దూకుడుగా ఉండ‌డం వంటివి చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. మ‌రి ప‌రిస్థితి ఇలానే ఉంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ గెలుపు క‌ష్ట‌మేన‌ని.. గ‌తంలో తెచ్చుకున్న‌న్ని సీట్లు వ‌చ్చే ప‌రిస్థితి కూడా ఉండ‌బోద‌ని అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.