రెండు పార్టీల్లోనూ.. ఒక్క‌టే చింత‌

ఏపీలో అధికార వైసీపీలోను, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలోనూ ఒకే విధమైన స‌మ‌స్య తెర‌మీదికి వ‌చ్చింది. వచ్చే ఎన్నిక‌ల్లో ఈ రెండు పార్టీలు అధికారంలోకి వ‌చ్చేయాల‌ని తీవ్ర‌స్థాయిలో ప్ర‌య‌త్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న వైసీపీ మ‌రోసారి అధికారం ద‌క్కించుకుని రికార్డు సృష్టించాల‌ని ప్ర‌య‌త్నిస్తుంటే.. టీడీపీ ఉనికిని కాపాడుకునేందుకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ అధికారంలోకి రావాల్సిన చారిత్ర‌క అవ‌స‌రం ఏర్ప‌డింద‌నేది ఆ పార్టీ నేత‌ల మాట‌.

దీంతో రెండు పార్టీల్లోనూ.. అధికారం చుట్టూతానే.. రాజ‌కీయాలు తిర‌గుతున్నాయి. అయితే.. ఇదే స‌మ‌యంలో ఈ రెండు పార్టీల్లోనూ ఒకే త‌ర‌హా స‌మ‌స్య క‌నిపిస్తోంది. అదే నాయ‌కుల స‌మ‌స్య‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకోవాలంటే.. కేవ‌లం మైకుల ముందు మాట్లాడితేనో.. ప్ర‌చారం చేస్తేనో.. స‌రిపోతుంద‌నే పాత వ్యూహాలు ఇప్పుడు ప‌నికిరావ‌ని.. ఈ రెండు పార్టీలూ నిర్ణ‌యించుకున్నాయి. ఎవ‌రి వ్యూహాలు వారికి ఉన్న‌ప్ప‌టికీ.. అంతిమంగా.. ఒకే దారికి వ‌చ్చాయి. అదే నేరుగా ప్ర‌జ‌ల‌ను క‌ల‌వ‌డం!.

ఇటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులు వంటివారు ప్ర‌జ‌ల‌ను క‌ల‌వాల‌ని జ‌గ‌న్ చెబుతున్నారు. వారి స‌మ‌స్య‌లు తెలుసుకోవాల‌ని అంటున్నారు. ప్ర‌బుత్వం అమ‌లు చేస్తున్న కార్య‌క్ర‌మాల ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని నిర్ణ‌యించారు. దీనికి సంబంధించి పార్టీని నడిపించేందుకు క్షేత్ర‌స్థాయిలో జిల్లాల‌కు అధ్య‌క్షుల‌ను, కో ఆర్డినేట‌ర్ల‌ను నియ‌మించారు. వీరంతా ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని.. వ‌చ్చే రెండేళ్లు ప్ర‌జ‌ల్లోనే ఉండాల‌ని జ‌గన్ నిర్దేశించారు.

ఇక‌, ఇదే సూత్రాన్ని పాటిస్తున్న టీడీపీ కూడా జిల్లాల‌కు ఇంచార్జ్‌ల‌ను, పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల వారీగా(ఇవే ఇప్పుడు జిల్లాలు అయ్యాయి) ఇంచార్జ్‌ల‌ను మండ‌ల స్థాయి నేత‌ల‌ను కూడా నియ‌మించింది.  వీరంతా కూడా త్వ‌ర‌లోనే ప్రారంభం కానున్న చంద్ర‌బాబు జిల్లాల యాత్ర‌,, లోకేష్ పాద‌యాత్ర‌ల్లో పాల్గొనాల‌ని ఆదేశాలు వెళ్లాయి. ఇంత వ‌ర‌కు హైక‌మాండ్ల విష‌యంలో క్లారిటీ ఉంది. అయితే.. క్షేత్ర‌స్థాయిలో మాత్రం నాయ‌కులు క‌ద‌ల‌డం లేదు.

ఈ ప్రాబ్లం రెండు పార్టీల్లోనూ క‌నిపిస్తోంది. ఎందుకంటే.. తాము ఊరూవాడా తిరిగి.. పార్టీ కోసం ప‌నిచేస్తే.. ప్ర‌జ‌ల‌ను క‌లిసి.. వారి నుంచి ఎదురయ్యే విమ‌ర్శ‌ల‌ను కూడా త‌ట్టుకుని.. పార్టీని బ‌లోపేతం చేస్తే.. ఇలా తిరిగేందుకు ఆర్థికంగా అప్పులు చేసి మ‌రీ ఖ‌ర్చు చేస్తే… వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కే టికెట్ ఇస్తార‌నే గ్యారెంటీ ఏంటి? మీ గ్రాఫ్ బాగోలేద‌ని.. ప‌క్క‌న పెడితే.. లేదు.. పొత్తు పెట్టుకున్నాం.. కాబ‌ట్టి త్యాగం చేయండ‌ని ఆదేశిస్తే..ఏం చేయాలి?  ఇదీ.. ఈ రెండు పార్టీల నేత‌ల‌కు తీవ్ర సంక‌టంగా మారింది. దీంతో వారు బ‌య‌ట‌కు కాలు పెట్టే ప‌రిస్థితి లేద‌ని.. ఇప్ప‌టికే విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ రెండు పార్టీల అధినేత‌లు.. ముందుగా ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌నే ఒత్తిడి కూడా వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం చేస్తారో చూడాలి.