కేసీయార్ కు రెండువైపులా పెరిగిపోతున్న వేడి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ కు రాజకీయ వేడి రెండువైపులా పెరిగిపోతోంది. ఈనెల 6వ తేదీన వరంగల్ కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వస్తున్నారు. వరంగల్ లో రైతులకు మద్దతుగా భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది కాంగ్రెస్ పార్టీ. ఇదే సమయంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను కూడా వేదిక మీదకే తీసుకొచ్చి మాట్లాడించబోతున్నారు. వారితో రాహుల్ ముఖాముఖి నిర్వహించబోతున్నారు.

అంటే రాహుల్ సభలో రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలే ఎక్కువగా హైలైట్ అయ్యే అవకావముంది. తర్వాత విద్యార్ధులు, నిరుద్యోగులతో రాహుల్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించాలని అనుకుంటే ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు అనుమతివ్వలేదు. కాబట్టి వాళ్ళతో ముఖాముఖి ఎక్కడ జరుగుతుందో తెలీదు. రెండు రోజులపాటు రాహుల్ తెలంగాణ లో పర్యటించబోతున్నారు. కాబట్టి కచ్చితంగా ఈ వేడి కేసీయార్ కు తగలుతుంది.

ఇదే సమయంలో ఒక్కరోజు ముందు అంటే ఈనెల 5వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మహబూబ్ నగర్ పర్యటించబోతున్నారు. మహబూబ్ నగర్లో బీజేపీ ఆధ్వర్యంలో బహిరంగ సభ జరగబోతోంది. ఇది కూడా రైతుల సమస్యలే ప్రధాన ఎజెండాగా జరగబోతోంది. కాబట్టి బీజేపీ కారణంగా మరింత వేడి రాజుకోబోతోంది. అంటే ఒకవైపు రాహుల్ రెండు రోజుల పర్యటన మరోవైపు జేపీ నడ్డా ఒక్కరోజు పర్యటన.

అంటే మూడు రోజులు వరుసగా కేసీయార్ కు రెండు పార్టీల నేతల నుండి సెగ తగలటం ఖాయమనే అనుకోవాలి. అసలే వాతావరణం కారణంగా ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండల్లోనే రెండు పార్టీల అగ్రనేతలు, వాళ్ళకు మద్దతుగా రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి అండ్ కో, బండి సంజయ్ అండ్ కో చేసే రచ్చ మామూలుగా ఉండదు. అందులోను రేవంత్ పీసీసీ చీఫ్ అయిన తర్వాత రాహుల్ మొదటిసారిగా తెలంగాణాలో అడుగుపెడుతున్నారు. కచ్చితంగా తన సామర్ధ్యాన్ని నిరూపించేందుకు రేవంత్ నూరుశాతం ప్రయత్నిస్తారు. ఇదే సమయంలో ఎన్నికల్లో తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు నడ్డా ముందు బండిసంజయ్ కూడా ప్రయత్నిస్తారు. ఎలా చూసుకున్నా రెండువైపుల నుండి కేసీయార్ కు వేడి తగలటం ఖాయమనే అనిపిస్తోంది.