లోకేష్‌పై రాళ్ల దాడి.. అడ్డంగా దొరికిన వైసీపీ ఎమ్మెల్యే

గుంటూరు జిల్లా తెనాలిలోని దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్‌పై రాళ్ల దాడి జ‌రిగింది. అయితే.. ఇదంతా కూడా.. మంగ‌ళ‌గిరి.. ఎమ్మెల్యే వైసీపీ నాయ‌కుడు ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి క‌నుస‌న్న‌ల్లోనే జ‌రిగింద‌ని..టీడీపీ నేత‌లు సాక్ష్యాల‌తో స‌హా చూపించారు.. అతేకాదు.. స్వ‌యం ఎమ్మెల్యే డ్రైవ‌ర్‌.. ఈ దాడిలో రాళ్లు విసురుతుండ‌గా.. టీడీపీ శ్రేణులు ప‌ట్టుకున్నారు. అయితే.. పోలీసులు రంగంలోకి దిగి.. డ్రైవ‌ర్‌ను అక్క‌డ నుంచి త‌ప్పించార‌ని.. టీడీపీ నాయ‌కులు ఆరోపించారు.

ఇక‌, లోకేష్ ప‌ర్య‌ట‌న ఆద్యంతం .. తీవ్ర ఉద్రిక్త‌త‌ల‌కు దారితీసింది. గ్రామానికి చేరుకున్న లోకేష్‌ను అడుగడుగునా.. నిలువ‌రించేందుకు అడ్డుకునేందుకు వైసీపీ నాయ‌కులు ప్ర‌య‌త్నాలు చేశారు. ఆ సమయం లో అక్కడకు చేరుకున్న వైసీపీ శ్రేణులు.. టీడీపీ శ్రేణులతో వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులు.., టీడీపీ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. లోకేష్‌తో పాటు టీడీపీ శ్రేణుల పైకి వైసీపీ శ్రేణులు రాళ్లు విసిరారు.

అడ్డుకున్న పోలీసులు వైసీపీ శ్రేణులను నిలువరించారు. దాడిలో ఎమ్మెల్యే ఆర్కే డ్రైవర్ ప్రత్యక్షంగా పాల్గొన్నారని టీడీపీ నేత‌లు చెప్పారు. ఆయ‌న‌ను ప‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేయ‌గా.. పోలీసులు విడిపించేశార‌ని అన్నారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో మాఫియా రాజ్యం విచ్చలవిడిగా నడుస్తోందని ప్రభుత్వంపై లోకేశ్‌ మండిపడ్డారు. న్యాయం కోసం వస్తే తమపై వైసీపీ శ్రేణులు రాళ్లు విసిరారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాళ్లు విసిరితే పారిపోతామని అనుకుంటున్నారా? అని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పది మంది మూకను నియంత్రించలేని స్థితిలో రాష్ట్ర పోలీసులు ఉన్నారన్నారు. టీడీపీ శ్రేణులపై రాళ్లు విసురుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. కొందరు పోలీసుల వల్ల పోలీసు వ్యవస్థకే చెడు పేరు వస్తోందన్నారు. బాధిత కుటుంబానికి అండగా నిలిస్తే నోటీసులు పంపుతున్నారని అన్నారు.

వైసీపీ నేతలకు చట్టాలపై గౌరవం, భయం లేని పరిస్థితి ఏర్పడిందని లోకేష్ ఆక్షేపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 800 మంది మహిళలపై దాడి జరిగిందన్నారు. దాడులు జరిగితే బుల్లెట్‌ కన్నా వేగంగా వస్తానన్న జగన్‌ ఎక్కడ? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పెద్దఎత్తున మహిళలపై దాడులు జరుగుతున్నా యని వాపోయారు.

నిన్న కొందరు మద్యం సేవించి మహిళపై దాడి చేసి హత్య చేశారన్నారు. మృతురాలి బంధువులు ఫిర్యాదు చేసినా కేసులు పెట్టట్లేదన్నారు. రాష్ట్రంలో జగన్‌ తాత రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందా? అని లోకేశ్‌ ప్రశ్నించారు. రాష్ట్రంలో లేని దిశా చట్టం ఉందని చిత్రీకరిస్తున్నారని ఆక్షేపించారు. బాధిత కుటుంబానికి న్యాయం కోసం ఇక్కడికి వచ్చానన్నారు.

21 రోజుల గ‌డువు!

“ప్రభుత్వానికి 21 రోజులు గడువు ఇస్తున్నా. దిశా చట్టం కింద ముగ్గురు నిందితులపై చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ముగ్గురు నిందితులకు ఉరిశిక్ష విధించాలి. శవపరీక్ష కాకముందే అత్యాచారం జరగలేదని ఎస్పీ ఎలా చెప్పారు. ఎస్పీతో ఎవరెవరు మాట్లాడారో కాల్‌డేటా రికార్డులు బయటపెట్టాలి. తనపై ఎవరి ఒత్తిడి ఉందో ఎస్పీ సమాధానం చెప్పాలి. రహస్య ఒప్పందాలపై వివరాలు బయటపెట్టాలి. మహిళలను కించపరిచేలా రోజా మాట్లాడటం సరికాదు“ అని లోకేష్ వ్యాఖ్యానించారు.

చీర పంపు.. మా అమ్మ‌కిస్తా!

త‌న‌కు చీర పంపుతానని రోజా చెబుతున్నారన‌ని, రోజా పంపిన చీరను నా తల్లి, ఆడపడుచులకు ఇస్తాన‌ని లోకేష్ అన్నారు. కించపరిచేలా మాట్లాడిన రోజా మహిళలకు క్షమాపణ చెప్పాలన్నారు. మహిళలను కించపరిచేలా మాట్లాడినవారిపై కేసులు పెట్టాలన్నారు. మహిళా కమిషన్‌కు చిత్తశుద్ధి ఉంటే కేసులు పెట్టాలన్నారు. ఘటన వెనక వైసీపీ నేతలు ఉన్నట్లు అనిపిస్తోంద‌న్నారు.