పీకేను త‌ప్పించ‌డం వెనుక‌.. `పెద్ద‌` కార‌ణ‌మే ఉందా?!

ఊర‌కరారు మ‌హాను భావులు అన్న‌ట్టుగా… సీఎం జ‌గ‌న్ అంత‌టివాడు.. రాజ‌కీయంగా ఒక అడుగు వేస్తే.. దానికి వంద కార‌ణాలు ఉంటాయి. త‌న‌కు ఏమీ లాభం లేకుంటే.. రాజ‌కీయ నేత‌.. చెయ్యి కూడా విద‌ల్చ‌డన్న‌ట్టుగా.. జ‌గ‌న్ కూడా అంతే… త‌న‌కు ఏమీ ప్ర‌యోజ‌నం లేక‌పోతే.. ఏ చిన్న మార్పు, చేర్పు కూడా చేయరనేది వాస్త‌వం అంటారు పార్టీ నాయ‌కులు. తాజాగా.. త‌న‌కు ఎంతో ఇష్ట‌మైన‌.. రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ ను జ‌గ‌న్ ప‌క్క‌న పెట్టారు. `మాకు ఆయ‌న సేవ‌లు అవ‌స‌రం లేదు` అని తేల్చి చెప్పేశారు.

అయితే.. 2017 నుంచి స‌యామీ క‌వ‌ల‌లు మాదిరిగా.. ఒక‌రి సూచ‌న‌ల‌ను మ‌రొక‌రు పాటించిన వారు.. ఒక్క సారిగా విడిపోవ‌డ‌మా? అనేది రాజ‌కీయంగా తీవ్ర చ‌ర్చ‌కు దారితీసింది. ప్ర‌శాంత్ కిషోర్‌.. లేక‌పోతే.. వ్యూహాలులేవు.. వ్యూహాలు లేక‌పోతే..పార్టీనే లేదు.. అని చెప్పుకొనే వైసీపీ నేత‌లు.. ఈ నిర్ణ‌యంతో ఒక్క‌సారిగా నిర్ఘాంత పోయారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము సొంత‌గానే ఎన్నిక‌ల‌కు వెళ్తామ‌ని వైసీపీ అధిష్టానం తేల్చేసిన అంశంపై మ‌రింత‌గా విస్తుపోయారు. అయితే.. పీకేను తీసేయ‌డం వెనుక‌.. ఒక‌ప‌టిష్ట‌మైన కార‌ణమే ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

పీకే విష‌యంలో సీఎం జ‌గ‌న్‌పై ఢిల్లీ స్థాయిలో ఒత్తిడి పెరిగిపోయింద‌నేది.. మేధావుల మాట‌. గ‌త కొన్నాళ్లుగా జాతీయ స్థాయి రాజ‌కీయాల‌ను గ‌మ‌నిస్తే.. కాంగ్రెస్‌కు వ్య‌తిరేకంగా ఉన్న శ‌క్తుల‌ను బీజేపీ కూడ‌దీస్తోంది. అదేస‌మ‌యంలో బీజేపీకి వ్య‌తిరేకంగాఉన్న శ‌క్తుల‌ను కాంగ్రెస్ అక్కున చేర్చుకునేందుకు ప్ర‌యత్నిస్తోంది. ఈ క్ర‌మంలో కాంగ్రెస్‌కు వ్య‌తిరేకంగా ఉన్న వైసీపీతో ఎప్పుడైనా త‌మ‌కు అవ‌స‌రం ఉంటుంద‌ని భావిస్తున్న బీజేపీ పెద్ద‌లు.. వైసీపీ అధినేత‌ను త‌మకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.

ఈ క్ర‌మంలోనే బీజేపీకి వ్య‌తిరేకంగా చ‌క్రం తిప్పుతున్న పీకేతో.. వైసీపీ చెలిమి చేయ‌డాన్ని.. బీజేపీ పెద్ద‌లు స‌హించ‌లేక‌పోతున్నార‌నేది ఢిల్లీ వ‌ర్గాల్లో ఎప్ప‌టి నుంచో ఉన్న చ‌ర్చ‌. పైగా… ఇటీవ‌ల కాంగ్రెస్‌లో ఆయ‌న చేరేందుకు రెడీ కావ‌డం.. పైగా.. వైసీపీతో పోత్తు పెట్టుకోవాల‌ని.. ఆయ‌న సూచించ‌డం వంటి ప‌రిణామాలు.. స‌హ‌జంగానే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీని త‌మ‌కు అడ్డు పెట్టుకోవాల‌ని(ఏదైనా తేడా వ‌స్తే) భావిస్తున్న బీజేపీకి ప్రాణ‌సంక‌టంగా మారింది. ఈ నేప‌థ్యంలోనే పీకే వ్యూహం కాంగ్రెస్ ఎక్క‌డ అమ‌లు చేస్తుందోన‌ని భావించి.. కేంద్రంలోని నెంబ‌ర్ 2, 3 స్థాయి పెద్ద‌లు రంగంలోకి దిగిపోయార‌ని అంటున్నారు..

మంగ‌ళ‌వారం ఉద‌యం ఢిల్లీ నుంచి జ‌గ‌న్‌కు ఫోన్ రావ‌డం.. ఆ వెంట‌నే పీకేపై నిర్ణ‌యం తీసుకుని ప్ర‌క‌టించ‌డం.. జ‌రిగిపోయాయ‌ని ఢిల్లీలో పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది.  వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌తో పొత్తుకు రెడీ అవుతున్నారనే సంకేతాలు.. క‌నుక బ‌య‌ట‌కు వెళ్తే.. వైసీపీకి పునాదులు క‌దిలిపోవ‌డం ఖాయ‌మ‌న‌ని జ‌గ‌న్ సైతం అనుమానించిన‌ట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలోనే త‌న‌కు ఎంతో ఇష్ట‌మే అయిన‌ప్ప‌టికీ…అటు ఢిల్లీ పెద్ద‌ల ఆదేశాలు.. క‌న్నెర్ర‌లు.. ఇటు.. రాష్ట్రంలో క‌ద‌ల‌బారే పునాదుల‌ను దృష్టిలో పెట్టుకుని.. జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం దిశ‌గా.. క్ష‌ణం కూడా ఆలోచించ‌కుండా.. అడుగు వేశార‌ని.. అంటున్నారు.  మొత్తానికి పీకే ను ప‌క్క‌న పెట్ట‌డంలో.. చాలా `పెద్ద` వ్యూహ‌మే ఉంద‌ని అంటున్నారు.