కాంగ్రెస్‌లో చేర‌ను: పీకే షాకింగ్ నిర్ణ‌యం

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. కాంగ్రెస్లో చేరడం ఖాయం అనుకున్న తరుణంలో పార్టీకి షాక్ తగిలింది. సాధికారిత బృందంలో చేరాలని, ఎన్నికల బాధ్యత తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రతిపాదనను తిరస్కరించినట్లు ఆయన ట్వీట్ చేశారు. తాను పార్టీలో చేరట్లేదని, తనకన్నా కాంగ్రెస్ కు ‘నాయకత్వం’ అవసరమని పేర్కొన్నారు. అయితే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అధికార టీఆర్ ఎస్‌ ఐప్యాక్‌ మధ్య ఇటీవల ఒప్పందం జరగటమే.. పీకే కాంగ్రెస్‌లో చేరకపోవటానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. దీనిని కాంగ్రెస్ అధినాయకత్వం.. పరస్పర విరుద్ధ ప్రయోజనాల కింద భావించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

“సాధికారిత బృందంలో భాగం కావడం సహా ఎన్నికల బాధ్యత తీసుకునేందుకు కాంగ్రెస్లో చేరాలన్న ప్రతిపాదనను తిరస్కరించా. నేను పార్టీలో చేరడం కన్నా.. కాంగ్రెస్ కు నాయకత్వం అవసరం. ఎన్నో నిర్మాణాత్మక సమస్యల్లో కూరుకుపోయిన పార్టీలో ఉమ్మడి సంకల్పం, సంస్కరణలు అవసరం.“ అని పీకే ట్వీట్ చేశారు.

2024 లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ సన్నద్ధత కోసం ఇటీవల పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సహా సీనియర్ నేతలకు పీకే పవర్ పాయింట్ ప్రజెెంటేషన్ ఇచ్చారు. ప్రశాంత్.. ఎన్నికల వ్యూహాలు, నివేదికపై అధ్యయనం చేసేందుకు సోనియా గాంధీ.. కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం నేతృత్వంలో ఓ కమిటీ వేశారు. ఈ కమిటీ తమ నివేదికను సోనియాకు అందజేసింది. అనంతరం ‘ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ -2024’ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన సోనియా.. రాబోయే ఎన్నికల్లో పార్టీ వ్యూహాల బాధ్యతను తీసుకోవాలని, అందుకోసం పార్టీలో చేరాలని ప్రశాంత్ కిశోర్ను కోరారు.

అందుకు ఆయన తిరస్కరించినట్లు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌సింగ్ సుర్జేవాలా తాజాగా ధ్రువీకరించారు. కాంగ్రెస్‌లో చేరాలన్న అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆహ్వానాన్ని పీకే తిరస్కరించినట్లు పేర్కొన్నారు. పార్టీకి సలహాలు, సూచనలు ఇచ్చినందుకు.. ప్రశాంత్ కిశోర్కు ధన్యవాదాలు తెలిపారు. అని తెలిపారు.

“ప్రశాంత్ కిశోర్ ప్రజెంటేషన్, చర్చల అనంతరం.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ‘సాధికారిత బృందం-2024’ను ఏర్పాటు చేశారు. అందులో భాగమయ్యేందుకు పీకేను కాంగ్రెస్ లో చేరాలని ఆహ్వానించారు. కానీ ఆయన దానికి ఒప్పుకోలేదు. కాంగ్రెస్ కు సలహాలు, సూచనలు ఇచ్చినందుకు ప్రశాంత్ కిశోర్ కు ధన్యవాదాలు.“ అని సుర్జేవాలా ట్వీట్ చేశారు.

వరుస ఓటములతో సతమతమవుతున్న కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేందుకు ఇటీవల పీకే ముందుకొచ్చారు. పార్టీలో చేరేందుకు ఆయన సుముఖంగా ఉండటం సహా ఎలాంటి పదవులు ఆశించకుండా కాంగ్రెస్ కోసం పనిచేసేందుకు సిద్ధమైనట్లు ప్రచారం సాగింది. ఈ క్రమంలోనే సోనియా సహా పార్టీ అధిష్ఠానంతో పలుమార్లు భేటీ అయ్యారు. 2024 సార్వత్రిక ఎన్నికలు, ఈ ఏడాది జరగబోయే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కొన్ని కీలక ప్రతిపాదనలు చేశారు. అయితే.. ప్రశాంత్ కిశోర్ ను కాంగ్రెస్లో చేర్చుకోవాలంటే ఆయనకు ఓ షరతు విధించాలని ఆ పార్టీ నేతలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

పీకే పార్టీలో చేరాక మరే ఇతర రాజకీయ పార్టీలకు ఆయన ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయవద్దని, ఇత‌ర పార్ట‌లైన వైసీపీ, టీఆర్ ఎస్‌ల‌కు సేవలు అందించవద్దని చెప్పినట్లు సమాచారం. ప్రశాంత్ కిశోర్ బెంగాల్ లో టీఎంసీ, తమిళనాడులో డీఎంకే పార్టీలకు వ్యూహకర్తగా పనిచేసి అధికారంలోకి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లోనూ వైసీపీ కోసం పని చేశారు. ప్రస్తుతం తెలంగాణలో కేసీఆర్‌కు రాజకీయ వ్యూహకర్త సేవలందిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు విధించిన షరతుతో ఇప్పుడు ఆయన ఈ పార్టీలన్నింటికీ దూరం కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే.. కాంగ్రెస్ కు ప్రశాంత్ కిశోర్ తేల్చి చెప్పిన‌ట్టు తెలిసింది.