రేవంత్ ఓ వైపు.. పార్టీ ముఖ్య‌లు ఇంకోవైపు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జ‌రిగే రాజ‌కీయాలు ఎలా ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప్ర‌త్య‌ర్థిని ఉక్కిరిబిక్కిరి చేసే నిర్ణ‌యాల కంటే కూడా సొంత పార్టీలోనే ఓ ప్ర‌త్య‌ర్థిని ఎంచుకొని వారిని టార్గెట్ చేయ‌డంపైనే నేత‌లు దృష్టిసారిస్తుంటార‌నే ఓ టాక్‌ ఉంది. దీనికి త‌గిన‌ట్లుగా అనేక సంఘ‌ట‌న‌లు జ‌రిగాయి కూడా!. ఇక ప్ర‌స్తుత పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి పార్టీలోని సీనియ‌ర్ల‌కు మ‌ధ్య స‌ఖ్య‌త లేద‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే, కొద్దికొద్దిగా స‌ద్దుమ‌ణుగుతుంద‌న్న ఈ వివాదం మ‌ళ్లీ తాజాగా తెర‌మీద‌కు వ‌చ్చిందంటున్నారు. ఇప్పుడు పార్టీలో రేవంత్ ఒక్క‌డు ఓ వైపు మిగ‌తా నేత‌లంతా ఓ వైపు అన్న‌ట్లుగా ప‌రిస్థితి మారిపోయింది. దీనికి కార‌ణం ప్ర‌శాంత్ కిషోర్ అంటున్నారు.

పీకే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాతో భేటీ కావడంతో కాంగ్రెస్‌లో చేరుతున్నారని ప్రచారం జరిగింది. దీనిపై ఏఐసీసీ కూడా 8 మందితో ప్రత్యేక కమిటీని నియమించి పీకే ఇచ్చిన నివేదికను అధ్యయనం చేయాలని ఆదేశించింది. ఇదే స‌మ‌యంలో 17 రాష్ట్రాల్లో పొత్తు పెట్టుకోవాలని పీకే సూచించినట్లు బయటకు వచ్చింది. కానీ, తెలంగాణ సంగ‌తి ఏంట‌నే స్పష్టత రాలేదు. టీఆర్‌ఎస్ పార్టీ ఐప్యాక్‌తో ఒప్పందం చేసుకుంది. ఐప్యాక్ తమకే పని చేస్తుందని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. కానీ, ప్రశాంత్ కిషోర్ మాత్రం కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు.  

జాతీయ స్థాయిలో ఒక పార్టీకి, రాష్ట్ర స్థాయిలో మరో పార్టీకి ఐప్యాక్ ఎలా పని చేస్తుందనేది పార్టీల నేతలను వేధిస్తున్న ప్రశ్న‌. ఈ నేప‌థ్యంలో పీకేపై స్పందించేందుకు కాంగ్రెస్ నేత‌లు త‌ట‌ప‌టాయిస్తున్నారు. ప్ర‌శాంత్ కిషోర్ హైద‌రాబాద్ రావ‌డం, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో స‌మావేశం అయిన నేప‌థ్యంలో మూడు రోజులుగా నెలకొంటున్న పరిణామాలతో ఎలాంటి వ్యాఖ్యలు చేయాలో తెలియక తికమక పడుతున్నారు. టీఆర్ఎస్‌ను వ్యతిరేకించడమా, తమ ఆరోపణలను కొనసాగించడమా అనే అంశంపై తేల్చుకోలేకపోతున్నారు.

ఒకవేళ ఏఐసీసీ నుంచి పొత్తుపై ఏవైనా ఆదేశాలు వస్తే.. పరిస్థితి ఎలా ఉంటుందో అనే సందిగ్థంలో పడ్డారు. అందుకే అధిష్టానం నిర్ణ‌య‌మే ఫైన‌ల్ అంటున్నారు. అయితే, టీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటాయనే ప్రచారం నేపథ్యంలో టీపీసీసీ చీఫ్రేవంత్ రెడ్డి ఫైర్ ఆగలేదు. టీఆర్‌ఎస్‌తో పొత్తు ఉండదని, రాహుల్ చెప్పారని, తమ పోరాటం టీఆర్‌ఎస్ పైనే అంటూ ప్రకటించారు. అంతేకాకుండా ఐప్యాక్ అధినేత ప్రశాంత్ కిషోర్.. టీఆర్ఎస్‌తో తెగదెంపులు చేసుకుంటుందని, త్వరలోనే దాన్ని ప్రకటిస్తారంటూ చెప్పుకొచ్చారు. ప్ర‌శాంత్ కిషోర్ త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌గానే ఉంటార‌ని, వ్యూహ‌క‌ర్త‌గా కాద‌ని చెప్పుకొస్తున్నారు.