ప్రశాంత్ కిషోర్‌కు కాంగ్రెస్ షరతులు

ాంగ్రెస్ లో చేరాలంటే ప్రశాంత్ కిశోర్ ఉర‌ఫ్ పీకేకు ఆ పార్టీ రెండు షరతులు పెట్టినట్లు తెలుస్తోంది. ఆయన మరే ఇతర రాజకీయ పార్టీల(వైసీపీ, టీఆర్ ఎస్‌)కు వ్యూహకర్తగా ఉండొద్దని చెప్పినట్లు సమాచారం. సోనియా గాంధీ నివాసంలో దాదాపు 3 గంటలకు పైగా సాగిన భేటీలో కాంగ్రెస్ సీనియర్లు ఈ మేరకు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ పార్టీలో చేరే విషయం, ఇప్పటికే ఆయన ఇచ్చిన నివేదికపై భేటీలో సీరియస్ గా చర్చించినట్లు స‌మాచారం. ఈ సమావేశానికి 12 మందికి పైగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు హాజరయ్యారు. పీకే పార్టీలో చేరితే.. అప్పగించాల్సిన బాధ్యతలపై ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం.

అయితే ప్రశాంత్ కిశోర్ ను కాంగ్రెస్లో చేర్చుకోవాలంటే ఆయనకు షరతులు విధించాలని ఆ పార్టీ నేతలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పీకే పార్టీలో చేరాక మరే ఇతర రాజకీయ పార్టీలకు ఆయన ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయవద్దని, ఎలాంటి సేవలు అందించవద్దని చెప్పినట్లు సమాచారం. ప్రశాంత్ కిశోర్ బెంగాల్ లో టీఎంసీ, తమిళనాడులో డీఎంకే పార్టీలకు వ్యూహకర్తగా పని చేసి అధికారంలోకి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లోనూ వైసీపీ కోసం పని చేశారు. ప్రస్తుతం తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ ఎస్‌కు రాజకీయ వ్యూహకర్త సేవలందిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు విధించిన షరతుతో ఇప్పుడు ఆయన ఈ పార్టీలన్నింటికీ దూరం కావాల్సిన పరిస్థితి వచ్చింది.

మరి కాంగ్రెస్ కండీషన్ కు పీకే అంగీకరిస్తారా? ఇతర రాజకీయ పార్టీలకు ఇకపై దూరంగా ఉంటారా? అనే విషయాలపై అతి త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలపై పీకే ఇప్పటికే సోనియా గాంధీకి నివేదిక ఇచ్చారు. దీని అధ్యయనానికి ఆమె కమిటీ వేశారు. ఇందులో కేసీ వేణుగోపాల్, దిగ్విజయ సింగ్, అంబికా సోని, రణదీప్ సూర్జేవాలా, జైరాం రమేష్, ప్రియాంక గాంధీ వాద్రా ఉన్నారు. వీరంతా సోమవారం తమ అభిప్రాయాల్ని సోనియాతో భేటీలో తెలియజేశారు. నివేదికను సమీక్షించిన అనంతరం సోనియా సభ్యులతో దీనిపై చర్చించారు.

భవిష్యత్తులో ఎదురయ్యే రాజకీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు ‘సాధికారత చర్య బృదం-2024’ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సోనియా నివాసంలో జరిగిన ఈ భేటీ దాదాపు మూడు గంటలకుపైగా సాగింది. మరోవైపు కాంగ్రెస్ చింతన్ శిబిర్కు రాజస్థాన్లోని ఉదయ్ పూర్ వేదిక కానుంది. వచ్చేనెల 13, 14,15 తేదీల్లో ఈ కార్యక్రమం జరగనుంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, ఏఐసీసీ సభ్యులు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, ఆహ్వానితులు మొత్తం 400మందికిపైగా చింతన్ శిబిర్లో ఉండవచ్చు అని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి.

ఈ కార్యక్రమంలో దేశంలో ప్రస్తుత రాజకీయ, ఆర్థిక పరిస్థితులు, వాటి వల్ల సమాజానికి ఎదురవుతున్న సవాళ్లు, రైతుల సమస్యలు సహా ఇతర కీలక విషయాలపై కాంగ్రెస్ చర్చించనుంది. అంతేగాకుండా రైతులు, రైతు కూలీలు, ఎస్‌సీ, ఎస్టీ, ఓబీసీ, మత, భాషా మైనారిటీలు, మహిళా సామాజిక న్యాయం, సాధికారత, యువత సంక్షేమం, శ్రేయస్సుకు సంబంధించిన సమస్యలపై సవివరంగా చర్చించనున్నట్లు  పేర్కొంది.