సంచలనం.. కరోనా టెస్టు చేస్తే గర్భం బయటపడింది

ఉత్తరప్రదేశ్‌లో సంచలనం చోటు చేసుకుంది. ఓ ప్రభుత్వ బాలబాలికల సంరక్షణ గృహంలో కరోనా పరీక్షలు చేయగా.. అందులో 57 మందికి వైరస్ ఉన్నట్లు తేలింది. ఈ 57 మందిలో ఏడుగురు గర్భవతులని తేలడం సంచలనం రేపుతోంది. అంతే కాదు.. ఒక అమ్మాయికి హెచ్‌ఐవీ ఉన్నట్లు కూడా వెల్లడైంది. ఈ ఉదంతం ఆ రాష్ట్రంలో సంచలనం రేపుతోంది.

రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సైతం దీనిపై దృష్టిసారించి విచారణ జరపాలని ఆదేశించే వరకు పరిస్థితి వెళ్లింది. కాన్పూర్ జిల్లాలోని ఈ స్టేట్ హోంలో ఒక అమ్మాయికి జ్వరంతో పాటు కొన్ని కరోనా లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రికి వెళ్లింది. తర్వాత ఆమెను కరోనా పరీక్షలకు పంపారు. ఆ అమ్మాయికి కరోనా ఉన్నట్లు తేలింది. దీంతో స్టేట్ హోంలో అందరికీ కరోనా టెస్టులు చేయాలని నిర్ణయించారు.

ఈ సందర్భంగా ఏకంగా 57 మందికి కరోనా ఉన్నట్లు తేలింది. వీరిలో చాలామందికి కరోనా లక్షణాలే కనిపించలేదు. స్టేట్ హోం సిబ్బందిలో కూడా ఒకరికి కరోనా ఉన్నట్లు తేలింది. ఐతే కరోనా పరీక్షలు నిర్వహించే క్రమంలో అనుమానాలు తలెత్తి కొందరు అమ్మాయిలను పరీక్షించగా ఏడుగురు గర్భంతో ఉన్నట్లు తేలింది. ఒక అమ్మాయికి హెచ్‌ఐవీ కూడా ఉన్నట్లు తేలడం విస్మయానికి గురి చేసింది. ఈ విషయాన్ని కాన్పూర్ జిల్లా కలెక్టర్ బ్రహ్మదేవరాయ్ తివారి కూడా ధ్రువీకరించారు.

ఐతే స్టేట్ హోంకు రావడానికి ముందే ఈ అమ్మాయిలు గర్భవతులైనట్లు తేలిందని ఆయన వెల్లడించారు. ‘‘సంరక్షణ గృహంలో 57 మంది బాలికలను కరోనావైరస్ పాజిటివ్ కేసులుగా గుర్తించాం. ఏడుగురు బాలికలు గర్భంతో ఉన్నట్లు తేలింది. వారిలో ఐదుగురు కరోనా వైరస్‌తో ఉన్నారు. వీరు ఆగ్రా, ఎటా, కన్నోజ్, ఫిరోజాబాద్, కాన్పూర్ నగర్ బాలల సంక్షేమ కమిటీ సిఫార్సుపై ఇక్కడికి వచ్చారు. ఆ బాలికలంతా ఇక్కడికి రాకముందే గర్భవతులు. దీని గురించి పూర్తి సమాచారం జిల్లా అధికారుల దగ్గర ఉంది’’ అని అన్నారు.