కాంగ్రెస్‌లోకి పీకే.. తెర వెనుక తెలుగోడు!

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ త‌న ప్ర‌స్తుత ప‌నుల‌కు బైబై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేర‌నుండ‌టం దాదాపుగా ఖ‌రారు అయిపోయిన సంగ‌తి తెలిసిందే. 2024 సార్వత్రిక ఎన్నికల వ్యూహాలపై కాంగ్రెస్ అధినేత‌ సోనియా గాంధీకి ప్రజెంటేషన్ ఇవ్వ‌నుండ‌టం అనే ఎపిసోడ్‌తో మొద‌లైన చ‌ర్చ‌… `ఎలాంటి ష‌ర‌తులు లేకుండా పీకే కాంగ్రెస్ పార్టీలో చేర‌నున్నారు` అని కాంగ్రెస్ ఢిల్లీ పెద్ద‌లు బహిరంగంగా మీడియా ముందు ప్ర‌క‌టించే వ‌ర‌కు చేరింది.

ఇక మిగిలింది అధికారికంగా పీకే మూడు రంగుల కండువా క‌ప్పుకోవ‌డ‌మే. అయితే, పీకే కాంగ్రెస్ పార్టీలో చేర‌డం వెనుక ఓ తెలుగోడు ఉన్నార‌ట‌. ఆయ‌నే రాజ‌కీయ వ్యూహ‌క‌ర్తను రాజ‌కీయ నాయ‌కుడిగా మార్చే ప్లాన్ చెప్పార‌ని తెలుస్తోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో ప్ర‌శాంత్ కిషోర్ భేటీ అవ‌డం, అనంత‌రం ఆయ‌న కాంగ్రెస్ పార్టీలో చేర‌డం వెనుక ఉన్న‌ది తెలుగు రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త అయిన సునీల్ క‌నుగోలు. ఈ విష‌యం చెప్పింది పీసీసీ ర‌థ‌సార‌థి రేవంత్ రెడ్డి. గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్కు స్ట్రాటజిస్టుల అవసరం లేదని, తమ పార్టీలో నాయకులు తప్ప స్ట్రాటజిస్టులు ఉండరని అన్నారు.

ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ లో చేరుతార‌ని, ఆయనకు ఏ బాధ్యతలు అప్పగించేది హైకమాండ్ నిర్ణయిస్తుందని చెప్పారు. పార్టీలో చేరిన తర్వాత ఇతర పార్టీలకు పని చేస్తానంటే కుదరదని రేవంత్ అన్నారు. పీకేను కాంగ్రెస్ లోకి తీసుకొచ్చేదే స్ట్రాటజిస్టు సునీల్ అనుకోవచ్చని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

హాట్ టాపిక్‌గా మారిన టీఆర్ఎస్ – కాంగ్రెస్ పొత్తుపైనా రేవంత్ రెడ్డి స్పందిచారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయే టీఆర్ఎస్ తో తమకు పొత్తు ఉండదని రేవంత్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ విషయంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇప్పటికే స్పష్టత ఇచ్చారని, మే 6న రాష్ట్ర ప్రజలకు మరింత స్పష్టత వస్తుందని రేవంత్ అన్నారు. రేవంత్ అధ్యక్షతను పీసీసీ విసృత స్థాయి సమావేశం జరగ‌డం, అందులో పీకే గురించి ఇలాంటి కామెంట్లు చేయ‌డంతో… టీఆర్ఎస్‌ కాంగ్రెస్ రాజ‌కీయం గురించి హాట్ చ‌ర్చ జ‌రుగుతోంది.