కేఏ పాల్‌.. మ‌ళ్లీ ఏసేశాడుగా!!

క్యామెడీ రాజ‌కీయాల‌కు కేరాఫ్‌గా మారిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌.. మ‌ళ్లీ న‌వ్వులు పూయించారు. త‌న‌కు దేశంలో ఉప ప్ర‌ధాని ప‌ద‌విని ఆఫ‌ర్ చేశార‌ని.. కానీ, త‌నే ఆ ప‌ద‌విని వ‌ద్ద‌న్నాన‌ని.. ఆయ‌న తాజాగా చెప్పుకొచ్చారు. రాజకీయ నాయకులంతా.. పోటీ పడి మరీ దోచుకుంటున్నారని  పాల్ మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో పరిపాలన మొత్తం గాడి తప్పిందని విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లోపు దేశమంతా పర్యటిస్తానని ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీకి తెలంగాణలో 72, ఆంధ్రప్రదేశ్‌లో 102 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో పాలన గాడి తప్పిందని  పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన కేఏ పాల్.. దేశం దివాలా తీసిందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బడుగు బలహీనవర్గాల ప్రజలు ఇప్పుడున్న అధికార పార్టీలకు ఓటు వేయొద్దని సూచించారు.  బీజేపీ తప్పులను ఎత్తి చూపుతున్న మంత్రి కేటీఆర్.. టీఆర్ ఎస్ తప్పులను ఎందుకు కప్పిపుచ్చుకుంటున్నారని ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి దిగజారి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితి వచ్చిందని కేఏ పాల్ ఆక్షేపించారు.

“అభివృద్ధి కోసమే అప్పట్లో తెలంగాణకు మద్దతిచ్చాను. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి. రాష్ట్రం అప్పుల పాలైంది. కేటీఆర్ బీజేపీ తప్పులను ఎత్తి చూపుతున్నారు. టీఆర్ ఎస్‌ తప్పులను ఎందుకు కప్పి చూపుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పాలన గాడి తప్పింది. పోటీ పడి మరీ ప్రజల సొమ్ము దోచుకుంటున్నారు. లక్షల కోట్ల రూపాయలను ఛారిటీల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో పంచి పెట్టాను. తెలుగు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి దిగజారి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితి ఏర్పడింది. బీజేపీ వాళ్లు రాజ్యసభ ఎంపీగా ఇచ్చి.. ఉప ప్రధాని ఇస్తా అన్నారు. కానీ.. నేను ఒప్పుకోలేదు“ అని కేఏ పాల్ చెప్పుకొచ్చారు.

డబ్బులతో సొంత మీడియాలు పెట్టుకొని సొంత డబ్బా కొట్టుకుంటున్నారని ప‌రోక్షంగా ఏపీ సీఎం జ‌గ‌న్‌పై విరుచుకుప‌డ్డారు. బడుగు బలహీనవర్గాల ప్రజలు ఇప్పుడున్న అధికార పార్టీలకు ఓటు వేయొద్దని అన్నారు. తెలంగాణలో గ్రామ గ్రామాన పర్యటిస్తాన‌ని చెప్పారు. ప్రపంచంలో నాలాంటి వ్యక్తి ఒక్కరూ కూడా లేరని అన్నారు. నా ప్రతిభ గురించి తెలిసే మోడీ, కేసీఆర్, జగన్ భయపడతారని చెప్పారు. కేఏ పాల్ తమ ప్రత్యర్థి అని కేటీఆర్ గుర్తించాల‌న్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీకి తెలంగాణలో 72, ఆంధ్రప్రదేశ్‌లో 102 సీట్లు వస్తాయని నొక్కి చెప్పారు.

ప్రజల సమస్యలు ఏంటి? వాటిని ఎలా పరిష్కరించాలన్న దానిపై చర్చ జరగాల్సింది పోయి ఒకరినొకరు తిట్టుకోవడంతోనే రాజకీయ నాయకులు సమయం గడిపేస్తున్నారని కేఏ పాల్‌ మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లోపు దేశమంతా పర్యటిస్తానని ప్రకటించారు. ఇప్పటివరకూ 18 పార్టీల నాయకులను కలిపేశానని.. ప్రతి ఒక్కరినీ కలుపుకొంటూ పోవాలన్నదే తన అభిమతమని కేఏ పాల్‌ అన్నారు. కాగా, కేఏ పాల్ క్యామెడీ రాజ‌కీయాలు బాగున్నాయ‌ని.. టైం పాస్ అయింద‌ని.. నెటిజ‌న్లు వ్యాఖ్యానించ‌డం కొస‌మెరుపు.