సీనియర్లకు చంద్రబాబు ఝలక్?

వచ్చే ఎన్నికలకు సంబంధించి చంద్రబాబునాయుడు సీనియర్లకు షాకిచ్చారా ? సభ్యత్వ నమోదు సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అలాగే అనిపిస్తోంది. సీనియర్లకు గౌరవమిస్తాం… సమర్ధులను ప్రోత్సహిస్తాం అని అన్నారు. పైగా పార్టీకి పది ఓట్లు కూడా తేలేని సీనియర్ల వల్ల ఉపయోగం ఏమిటని కూడా ప్రశ్నించారు. సీనియారిటి ప్రాతిపదికన తమకే టికెట్లు ఇవ్వాలంటే పార్టీ ఎప్పటికీ ప్రతిపక్షంలోనే కూర్చుంటుందని గట్టిగానే చురకలంటించారు.

చంద్రబాబు మాట్లాడిన విధానాన్ని చూస్తే వచ్చే ఎన్నికల్లో చాలామంది సీనియర్లకు టికెట్లు ఇచ్చేది అనుమానంగానే ఉంది. యనమల రామకృష్ణుడు, కళావెంకటరావు లాంటి ఎంతోమంది నేతలు తాము సీనియర్లమన్న ఒకే ఒక్క అర్హతతో ప్రతి ఎన్నికలోను టికెట్లు తెచ్చుకుంటున్నారు. యనమల అయితే వరుసగా రెండు సార్లు ఓడిపోయి చివరకు తన తమ్ముడికి టికెట్ ఇప్పించుకున్నారు. తమ్ముడు కూడా వరుసగా రెండు సార్లు ఓడిపోయారు. దాంతో తుని నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో యనమల ఫ్యామిలీకి టికెట్ అనుమానంగా మారింది.

ఇక కళా వెంకట్రావు పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఇలాంటి సీనియర్లు ఇంకా చాలా మందున్నారు. వీళ్ళంతా పార్టీ గాలుంటే గెలుస్తారు లేకపోతే ఓడిపోతారంతే. వయసు మీదపడినా మరొకరికి పోటీ చేసే అవకాశం కూడా ఇవ్వటం లేదు. చేస్తే తాము పోటీచేయాలి లేకపోతే తమ వారసులు పోటీచేయాలంతే అన్నట్లుగా ఉంది వీళ్ళ రాజకీయం. ఇలాంటి సీనియర్లకు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు షాకిచ్చేట్లే ఉన్నారు.

అందుకనే వచ్చే ఎన్నికల్లో 40 శాతం యువతకు టికెట్లిస్తాననే మాటకు కట్టుబడనున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు మాట తప్పకూడదంటే ఇప్పటినుండే యువతను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ యువతంటే సీనియర్ల వారసులకు టికెట్లివ్వటం కాదు. వారసులతో సంబంధం లేకుండానే కొత్త తరాన్ని ప్రోత్సహిస్తే వాళ్ళు మంచి ఉత్సాహంతో పనిచేస్తారు. దాంతో పార్టీలో కొత్త నాయకత్వం వచ్చినట్లుంటుంది. జనాలకు కూడా కొత్త నాయకులను చూసినట్లుంటంది. మొత్తానికి చంద్రబాబు సీనియర్ల విషయంలో గట్టిగానే డిసైడ్ అయినట్లే ఉన్నారు. చూద్దాం చివరకు ఏమిచేస్తారో.