కేసీయార్ కు షాకిచ్చిన పీకే

మిత్రుడనుకున్న వ్యక్తే ఒక్కసారిగా శతృవైపోతే పరిస్ధితి ఎలాగుంటుంది ? ఇప్పుడు కేసీయార్ పరిస్దితి అలాగే ఉండుంటుంది. ఇంతకాలం వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గెలిపించేందుకు కేసీయార్ రెగ్యులర్ గా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే)తో చాలాసార్లు భేటీ అయ్యారు. పార్టీని తిరిగి గెలిపించుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై పీకేతో చర్చించిన కేసీయార్ తన మనసులోని ఆలోచనలన్నింటినీ పంచుకున్నారు. పీకే కూడా కేసీయార్ కు చాలా ప్లాన్లే ఇచ్చుంటారు.

సీన్ కట్ చేస్తే హఠాత్తుగా పీకే కాంగ్రెస్ లో చేరబోతున్నారనే విషయం బయటపడింది. ఇప్పటికే కొంతకాలంగా ఇలాంటి ప్రచారం జరుగుతున్నా అధికారికంగా మాత్రం ఎలాంటి డెవలప్మెంట్ లేదు. కానీ ఇపుడు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి తారిక్ అన్వర్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. తొందరలోనే పీకే కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు అన్వర్ ప్రకటించటాన్ని  చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఇందులో కేసీయార్ ముఖ్యమైన వ్యక్తి.

తెలంగాణాలో ఒకవైపు బీజేపీని మరోవైపు కాంగ్రెస్ ను ఎలాగైనా తొక్కేయాలని కేసీయార్ చేస్తున్న ప్రయత్నాలన్నీ తెలిసిందే. ఇందులో భాగంగానే కేసీయార్-పీకే మధ్య అనేక భేటీలు కూడా జరిగాయి. అలాంటిది ఇపుడు పీకే హఠాత్తుగా కాంగ్రెస్ లో చేరిపోతే కేసీయార్ పరిస్ధితి ఏమిటి ? ఇంతకాలం తన మనసులోని ఆలోచనలను పీకేతో షేర్ చేసుకున్న కేసీయార్ తన ఆలోచనలను, వ్యూహాలన్నింటినీ మార్చుకోవాల్సిందే. తనకు పీకే ఇలాంటి షాక్ ఇస్తారని కేసీయార్ ఏమాత్రం ఊహించుండరు.

కేసీయార్ ఆలోచనలు, వ్యూహాలను బాగా తెలిసిన పీకే ఇపుడు వాటికి కాంగ్రెస్ తరపున విరుగుడుగా ప్రయోగిస్తారు. దాంతో మొత్తం కంపు కంపవుతుంది. అందుకనే ఇప్పటికప్పుడు అర్జంటుగా కేసీయార్ తన వ్యూహాలను మార్చుకోవాల్సిన అనివార్యత వచ్చేసింది. రాజకీయ వ్యాహాల్లో పీకే తెలివైన వాడనటంలో సందేహంలేదు. అందుకనే ఇపుడు కేసీయార్ కు హఠాత్తుగా సమస్యొచ్చిపడింది. సరే ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది కాబట్టి కేసీయార్ కు ఇప్పటికప్పుడు వచ్చిన ఇబ్బంది ఏమీలేదు. కానీ ఇకముందు మాత్రం కేసీయార్ జాగ్రత్తగా ఉండక తప్పదు.