కొత్త మంత్రులు- పదవిస్తే పార్టీకే తలనొప్పిగా మారారే

ఏపీలో కొత్త మంత్రుల దూకుడు ప్ర‌భుత్వానికి త‌ల‌నొప్పిగా మారిందని అధికార పార్టీ నేత‌లే వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవ‌ల జ‌గ‌న్ 2.0 కేబినెట్‌లో బాధ్య‌త‌లు తీసుకున్న మంత్రులు త‌ల‌కోర‌కంగా.. వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సీనియ‌ర్ నాయ‌కుడు.. శ్రీకాకుళం ఎమ్మెల్యే మాజీ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు.. బాధ్య‌త‌లు తీసుకున్న వెంట‌నే.. అవినీతి వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. రెవెన్యూ శాఖ‌లో అవినీతి పెరిగిపోయింద‌ని.. అవినీతి లేని పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు అందిద్దామ‌ని.. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు.. అటు పార్టీని.. ఇటు ప్ర‌భుత్వాన్ని కూడా తీవ్ర‌స్థాయిలో ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడు దీనికి కొన‌సాగింపుగా.. అన్న‌ట్టు.. మరో మంత్రి కూడా అవినీతి వ్యాఖ్య‌లు చేశారు.

తాజాగా మంత్రి అయిన.. డిప్యూటీ సీఎం, మంత్రి కొట్టు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ దేవాదాయ శాఖలో అవినీతిపై స్పందించారు. దేవాదాయ శాఖలో అవినీతి జరుగుతోందనడం వాస్తవమేనని, గ‌తంలోనూ త‌న దృష్టికి అనేక పిర్యాదు లు వ‌చ్చాయ‌ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై అవినీతి జరగకుండా కట్టడి చేస్తామని స్పష్టం చేశారు. ఎక్క‌డెక్క‌డ అవినీతి జ‌రిగింద‌నే విష‌యాన్ని వ‌దిలేసి.. ఇక‌పై అవినీతి జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని అధికారుల‌ను ఆదేశిస్తాన‌ని చెప్పారు. ఆలయాల్లో సామాన్య భక్తులకే ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఒకేసారి వీఐపీలను పక్కనపెట్టడం సాధ్యం కాదన్నారు. ఏళ్లుగా పాతుకు పోయిన ఉద్యోగులను మార్చే ప్రయత్నం చేస్తామని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.

రాష్ట్రంలో సంక్షేమ రాజ్య స్థాపనకు, రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి చేస్తున్న కృషి ఫలించాలని, రాష్ట్రాభివృద్దికి చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్ని సకాలంలో పూర్తి అవ్వాలని, ప్రకృతి అన్ని రకాలుగా సహకరించాలని, అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ది పథంలో నడిచేలా ఆ భగవంతుడు దీవించాలని మంత్రి కొట్టు ఆకాంక్షించారు. తనకు అప్పగించిన దేవాదాయ, ధర్మాదాయ శాఖను సమర్థవంతంగా నడిపే శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని ఆయన ఆకాంక్షించారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖకు ఎందరో భక్తులు బూరి విరాళాలను భూములు, ఇతర రూపంలో ఇచ్చారని, వాటి పరిరక్షణకు శక్తివంచన లేకుండా తాను కృషి చేస్తానన్నారు.

భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్న దేవాలయాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత రెండేళ్ల నుండి కరోనా కారణంగా దైవ దర్శనానికి వచ్చే భక్తులను పెద్దఎత్తున నియంత్రించడం జరిగిందని, అయితే ఈ ఏడాది కరోనా వ్యాప్తి కొంత మేరకు తగ్గిన నేపథ్యంలో పలు ప్రముఖ దేవాలయాలకు భక్తులు పెద్ద ఎత్తున దైవదర్శనానికి వస్తున్నారన్నారు. వారికి సత్వరమే దైవదర్శనం అయ్యే విధంగా, అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం అని, ఆ దేవస్థానంలో అన్ని రకాల సేవలను డిజిటలైజ్ చేయడం జరిగిందని ఉపముఖ్యమంత్రి తెలిపారు.