వివాదాలతో మొదలుపెట్టిన మంత్రులు

జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్-2లో కొందరు మంత్రులు వివాదాలతో తమ బాధ్యతలను మొదలుపెట్టారు. వివిధ కారణాలపై ఐదుగురు మంత్రులపై వివాదాలు ముసురుకున్నా నెల్లూరు జిల్లా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, అనంతపురం జిల్లా మంత్రి ఉషశ్రీ చరణ్ పై వస్తున్న వివాదాలు తీవ్రమైనవే. కాకాణిపై గతంలోనే ఒక కేసుకు సంబంధించిన ఆధారాలు నెల్లూరు కోర్టులో ఉన్నాయి.

ఎప్పుడైతే కాకాణి మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారో వెంటనే కోర్టులో దొంగలు పడి ఆధారాలని చెబుతున్న మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్ లాంటి వాటిని ఎత్తుకెళ్ళారు. కోర్టులోనే దొంగలు పడటం, అందులోను కాకాణి ఎదుర్కొంటున్న కేసులోని ఆధారాలు మాయమయ్యాయనే ప్రచారం సంచలనంగా మారింది. సహజంగానే అందరి చూపులు ఇపుడు మంత్రి మీదే నిలిచాయి. కాకాణే ఆధారాలను దొంగతనం చేయించినట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

అయితే ఇదంతా కాకాణి ప్రత్యర్ధులపనే అంటు మంత్రి మద్దతుదారులు గట్టిగా వాదిస్తున్నారు. ప్రత్యర్ధులంటే ఎవరనే విషయం మెల్లిగా తెలుస్తుంది. ఏదేమైనా దర్యాప్తులో అన్నీ విషయాలు బయటపడతాయి. ఇక ఉషశ్రీ చరణ్ కు స్వాగతం చెప్పే నేపథ్యంలో ట్రాఫిక్ నిలిపేసిన కారణంగా ఒక చిన్నారి చనిపోయిన విషయం తెలిసిందే. చంద్రబాబునాయుడు ఈ ఘటనపై సీరియస్ గా స్పందించారు. అయితే జిల్లా ఎస్పీ ఫకీరప్ప మాత్రం అదంతా తప్పుడు ఆరోపణలుగా కొట్టేశారు. బాధితుడు తన కూతురుని తీసుకుని ఆసుపత్రికి వెళ్ళిన సీసీ కెమెరాల ఫుటేజీని మీడియాకు చూపించారు. అయితే, జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అనేక సార్లు కోర్టులో డీజీపీ నిలబడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో మంత్రి తప్పు చేయలేదని పోలీసులు చెబుతున్నా జనం నమ్మడం లేదు.

ఇక దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణకు నిజంగా వివాదంతో సంబంధంలేదు. కానీ వివాదానికి సమాధానం చెప్పాల్సింది మాత్రం మంత్రే. ఇక బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అత్యుత్సాహంతో జగన్ ను ఆరాధించండని చేసిన వ్యాఖ్యలు కాస్త వివాదాస్పదమయ్యాయి. చివరగా మంత్రి ధర్మాన ప్రసాదరావుకు షేక్ హ్యాండిచ్చిన ఓ కార్యకర్త మంత్రి చేతిని గట్టిగా పిసికేశాడు. దాంతో మంత్రికి మండిపోయి సదరు కార్యకర్తపై చేయిచేసుకున్నారు.