ఉద్యోగులను రెచ్చగొట్టడమేనా ?

గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగులను రెచ్చగొట్టే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. అదేమిటంటే రోజుకు మూడుసార్లు హాజరువేసుకోవాలట. ఉదయం 10 గంటల్లోపు మొదటిసారి, మధ్యాహ్నం 3 గంటలకు రెండోసారి, సాయంత్రం 5 గంటలకు మూడోసారి హాజరు వేసుకోవాలని ఆదేశాలు జారీచేసింది. రోజుకు మూడుసార్లు హాజరువేసుకోవటం అన్నది ఏ ఇతర శాఖల్లో కూడా లేదు. ఈ బంపరాఫర్ కేవలం గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగులకు మాత్రమే ప్రభుత్వం అందించింది.

శనివారం నుండి అమల్లోకి వచ్చిన కొత్త హాజరు నిబందనతో ఉద్యోగులంతా మండిపోతున్నారు. మూడుసార్లు హాజరువేసుకోవటం ఏమిటంటు వాళ్ళంతా ఆశ్చర్యపోతున్నారు. మామూలుగా ఏ శాఖలో ఉద్యోగులైనా ఉదయం 10 గంటలకు తమ ఆఫీసుల్లోకి వచ్చినపుడు అటెండెన్స్ రిజస్టర్లో సంతకాలు పెడతారు. తిరిగి సాయంత్రం 5 గంటలకో తర్వాతో వెళ్ళేటపుడు రిజిస్టర్ లో సంతకాలు చేస్తారంతే. మధ్య మధ్యలో సంతకాలు చేసే అవసరం ఉండదు. ఈ విధానం ఆపీసుల్లో కూర్చుని పనిచేసే ఉద్యోగులతో పాటు ఫీల్డులో తిరిగే వాళ్ళకూ వర్తిస్తుంది.

మరి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో కూడా చాలమంది ఫీల్డులో పనిచేస్తుంటారు. కాబట్టి ఉదయం వచ్చి అటెండన్స్ రిజిస్టర్లో సంతకం చేసి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళేటపుడు సచివాలయంకు వచ్చి సంతకం చేసి వెళిపోతారు. అలాంటిది ఇపుడు కొత్త రూల్ ఎందుకు తెచ్చారంటు ఉద్యోగులు మండిపోతున్నారు. ఇప్పటికే తమ ప్రొబేషన్ కన్ఫర్మ్ కాకపోవటంతో ప్రభుత్వంపై అంతా మండుతున్నారు. మొన్నటి పీఆర్సీ వివాదంలోనే వీళ్ళంతా ప్రభుత్వ ఉద్యోగులతో కలిసి సమ్మెచేసిన విషయం తెలిసిందే.

రేపు జూన్ నాటికి ప్రొబేషన్ డిక్లేర్ చేస్తానని జగన్మోహన్ రెడ్డి హామీఇవ్వటంతో వీళ్ళు సమ్మె విరమించారు. అలాంటిది ఇపుడు హఠాత్తుగా మూడుసార్లు హాజరు వేసుకోవాలనే కొత్త నిబంధనపై ఎలా స్పందిస్తారో చూడాలి. అయితే సచివాలయాల్లో ప్రతిరోజు మధ్యాహ్నం 3-5 గంటల మధ్యలో స్పందన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఉద్యోగులంతా తప్పకుండా హాజరుకావాలి. కానీ ఫీల్డ్ వర్క్ పేరుతో చాలామంది హాజరుకావటంలేదట. అందుకనే మూడుసార్ల హాజరు అనే విధానాన్ని తెచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. మరి కొత్త నిబంధన ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సిందే.