ఒక్కొక్క‌రు ఒక్కొక్క రేంజ్‌లో.. రెచ్చిపోయిన త‌మ్ముళ్లు..

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కులు, మాజీ మంత్రులు, యువ నాయ‌కులు.. ఏపీలోని వైసీపీ స‌ర్కారుపై ఓ రేంజ్‌లో విరుచుకుప‌డ్డారు. ముఖ్యంగా సీఎం జ‌గ‌న్‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. వీరి కామెంట్ల‌ను చూసి.. రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇటీవ‌ల కాలంలో ఈ రేంజ్‌లో ఎప్పుడూ.. ఇలా కామెంట్లు చేయ‌క‌పోవ‌డాన్ని వారు గుర్తు చేస్తున్నారు.

య‌న‌మ‌ల ఏమ‌న్నారంటే..

రాష్ట్రాన్ని ఖాళీ చేసి జగన్‌ ప్యాలస్‌లు నిర్మించుకుంటున్నారని శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. కాకినాడలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో మాట్లాడారు. ప్రభుత్వం దగ్గర డబ్బు లేదంటున్నారని, కానీ వారి వద్ద, వారి నాయకులవద్ద డబ్బు ఉందన్నారు. జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నామని ప్రభుత్వం చెబుతోందన్నారు. జీతాలు ఇవ్వలేని వారు పేదలను ఎలా ఆదుకుంటారని ప్రశ్నించారు. జగన్మోహన్‌రెడ్డి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని, ఈ పాలకులకు అడ్డుకట్ట వేయగలిగేది పేదోడి ఓటు మాత్రమేనన్నారు. ఏ విధమైన ప్రలోభాలకు లొంగకుండా ఓటును సద్వినియోగం చేసుకోవాలని యనమల విజ్ఞప్తి చేశారు.

కిమిడి.. కామెంట్లు

‘‘రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోంది. ముఖ్యమంత్రి జగన్‌ తుగ్లక్‌ పాలనతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది’’ అని మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో మాట్లాడారు. వైసీపీ తీరుతో రాష్ట్రంలో మహిళలు, యువతకు రాబోయే రోజుల్లో తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. ప్రజల నుంచి అన్ని రకాలుగా దోచుకుంటున్న ప్రభుత్వం వారి సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. రెండు కోట్ల 50 లక్షల మంది జనాభా ఉన్న బీసీ సామాజిక వర్గానికి ప్రభుత్వం ఆదుకున్న పాపాన పోలేదన్నారు.

కొల్లు..కుమ్మేశారుగా!

తన బినామి కంపెనీలకు సూట్‌కేసులు ముట్టజెప్పినవారికే జగన్‌రెడ్డి మంత్రి పదవులు కట్టబెట్టారని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర విమర్శించారు. పెరిగిన ఆర్టీసీ ఛార్జీలకు నిరసనగా మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి నిరసన ప్రదర్శన చేశారు. నూతన మంత్రివర్గం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్‌ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు గణనీయంగా పెంచేశాయ న్నారు. ఏలూరులో విద్యుత్‌ సరఫరా లేక ఒక పరిశ్రమ దగ్ధమైందన్నారు. దేశానికే తలమానికమైన మచిలీపట్నం రోల్డుగోల్డు పరిశ్రమకు పవర్‌ హాలిడే ప్రకటించడం వల్ల కార్మికులు ఉపాధి అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని కొల్లు అన్నారు.

యువ ఎంపీ.. ఫైర్‌

సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మూడేళ్ల పాలనలో రూ.5 లక్షల కోట్లు దోపిడీకి పాల్పడ్డారని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం తొగరాం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ముందు టీడీపీ నేతలు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. అనంతరం విద్యుత్‌ కోతలపై ప్రభుత్వ తీరుకు నిరసనగా కలివరం గ్రామంలో ర్యాలీ చేశారు. మొత్తంగా ఈ ఊపు చూస్తే.. టీడీపీలో మ‌ళ్లీ పాత ప‌రిణామాలు గుర్తుకు వ‌స్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.