వెంట్రుక పీక‌లేద‌న్న‌ది.. వాళ్ల నేత‌ల‌నే.. జ‌గ‌న్‌పై జేసీ కామెంట్స్‌

త‌న వెంట్రుక కూడా పీకలేరన్న ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలు.. ప్ర‌తిప‌క్షాలను ఉద్దేశించి చేసిన‌వి కావ‌ని.. అవి వైసీపీ ఎమ్మెల్యే లను ఉద్దేశించి చేసినట్లు ఉందని తెలుగుదేశం పార్టీ నేత తాడిప‌త్రి మునిసిపాలిటీ చైర్మ‌న్ జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఇష్టం వచ్చినట్లు మంత్రివర్గ కూర్పు చేసినా.. ఎవరూ ఏమీ చేయలేరన్నదే జగన్ ఉద్దేశం కావచ్చన్నారు. అయితే విద్యాదీవెన పేరిట విద్యార్థులతో సభ ఏర్పాటు చేసిన సీఎం అక్కడ అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని జేసీ ప్రభాకర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.

అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో పవన్‌ పర్యటనపై జేసీ ప్రభాకర్రెడ్డి స్పందిచారు. కౌలురైతులకు పవన్‌ కల్యాణ్‌ ఆర్థికసాయం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రజలను మేలుకొలిపే కార్యక్రమాలు ఇంకా చేపట్టాలని కోరారు. అందరం కలిసి ప్రజల కోసం పని చేయాలన్నారు. ఇక‌, వైసీపీ ప్రభుత్వ ఉచితాలకు మోసపోవద్దని ప్రభాకర్‌రెడ్డి సూచించారు.

గత ఎన్నికలకు ముందు అన్నీ ఉచితమని వైసీపీ చెప్పిన మాటలను నమ్మి గెలిపించిన ప్రజలు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మూడేళ్ల వైసీపీ పాలనలో అన్నింటి ధరలు ఆకాశాన్ని అంటాయని విమర్శించారు. సామాన్య ప్రజలను బతకలేని స్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు. ఇష్టారాజ్యంగా కొత్త రూల్స్‌ అమలు చేసి తీవ్ర అవస్థలకు గురిచేయడం సరికాదని అన్నారు. కౌలు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు.

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రూ.లక్ష ఆర్థికసాయం అందించేందుకు జిల్లాకు పర్యటనకు వస్తే, బాధిత రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం కొంత డబ్బు జమ చేసిందని తెలిపారు. పవన్‌ ప్రశ్నిస్తేనే మీరు బాధిత రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వైఖరిని మార్చుకొని, బాధితరైతు కుటుంబాలకు ఆర్థికం సాయం చేయాలని జేసీ ప్రభాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.