రోజా 2.0 చూస్తామా

అనూహ్యంగా మంత్రివర్గంలో ఆర్కే రోజా చోటు దక్కించుకున్నారు. మంత్రివర్గం ఆశావహుల జాబితాలో రోజా పేరు కొన్నిసార్లు కనబడి మరికొన్నిసార్లు మాయమైపోయింది. దాంతో తనకు ఇక మంత్రిపదవి యోగం లేదని నిర్ధారించుకున్న నగిరి ఎంఎల్ఏ వెళ్ళి హైదరాబాద్ లో కూర్చున్నారు. అయితే తెరవెనుక ఏమి మార్పులు జరిగిందో ఏమోకానీ చివరి నిముషంలో మంత్రివర్గంలోకి రోజా కూడా చేరిపోయారు. దాంతో రోజా అభిమానులు, రాజకీయాలకు సంబంధం లేని కొంతమంది కూడా హ్యాపీగా ఉన్నారు.

అయితే ఇక్కడే రోజాకు ఒక సమస్య వచ్చింది. అదేమిటంటే మంత్రి తన దూకుడును తగ్గించుకోవాలి. దూకుడుకు మారుపేరు రోజా అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రత్యర్ధులపైకి ప్రధానంగా చంద్రబాబు నాయుడు, లోకేష్+తమ్ముళ్ళంటే రోజా ఒంటికాలిపై లేస్తారు. మంత్రి బూతులు మాట్లాడరు కానీ పంచులు విపరీతంగా వేస్తారు. ఈ పంచులే ఒక్కోసారి హద్దులు కూడా దాటిపోతుంది. ఎంఎల్ఏగా మాట్లాడటం వేరు మంత్రిపదవిలో ఉండి మాట్లాడటం వేరని రోజా తెలుసుకోవాలి.

రాక రాక వచ్చిన అవకాశాన్ని నియోజకవర్గం, జిల్లా అభివృద్ధికి ఉపయోగించాలి. పర్యాటక మంత్రిగా జిల్లా అభివృద్ధికి చేయాల్సింది చాలానే ఉంటుంది. పైగా పుత్తూరులో ఉన్న ఎన్నో పురాతన ఆలయాలను డెవలప్ చేయటంపై వెంటనే దృష్టిపెట్టాలి. ఎలాగూ ఇది ఎన్నికల క్యాబినెట్టే కాబట్టి మంత్రిత్వ శాఖతో పాటు పార్టీని కూడా సమన్వయం చేసుకోవాలి. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో రోజాకు ఏమాత్రం పడదన్న విషయం అందరికీ తెలుసు. కాబట్టి వ్యక్తిగత మనస్పర్ధలను పక్కనపెట్టి, నియోజకవర్గంలోని తన ప్రత్యర్ధి వర్గాలను కలుపుకుని వెళితేనే రోజాకు భవిష్యత్తుంటుంది.

లేకపోతే మంత్రిపదవే రోజాకు దక్కే చివరి పదవి అవుతుంది. రాజకీయంగా కూడా బాగా యాక్టివ్ గా ఉండే రోజా ముందు నియోజకవర్గాన్ని చక్కదిద్దుకోవాలి. తన ప్రత్యర్ధులందరిని సమన్వయం చేసుకుని విభేదాలను పరిష్కరించుకోవాలి. అలా కాకుండా మంత్రిపదవి వచ్చింది కదాని మరింత దూకుడుగా వెళితే ప్రత్యర్ధుల్లో మరింతగా కసి పెరిగిపోయి అందరు కలిసి దెబ్బతీయటం ఖాయం. మంత్రిపదవి వచ్చింది కాబట్టి రెండు మెట్లు తానే దిగొచ్చి ప్రత్యర్ధులందరినీ కలుపుకుని వెళ్ళాలి. లేకపోతే రోజాకు భవిష్యత్తు కష్టమే.