మంత్రి వ‌ర్గంలో ఆ ముగ్గురే కీల‌క‌మా?

ఆంధ్రావ‌నిలో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌కు సంబంధించి లేదా పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ గురించి ఇప్ప‌టిదాకా నెల‌కొన్న అయోమ‌య లేదా సంకట స్థితి అన్న‌ది మ‌రికొద్ది సేప‌ట్లో తొల‌గి పోనుంది. ఈ రోజు సాయంత్రానికి సాధార‌ణ ప‌రిపాల‌న విభాగం ఇందుకు సంబంధించి ఓ స్ప‌ష్ట‌త ఇవ్వ‌నుంది అని తెలుస్తోంది. క్యాబినెట్ లోకి వచ్చే ఆశావ‌హులు ఎవ‌రు అన్న‌ది ఇప్ప‌టికే తేలిపోయింద‌ని, తుది రూపు అన్న‌ది సంబంధిత జాబితాకు ఇచ్చాక, కొత్త మంత్రులకు స‌మాచారం వెళ్తుంద‌ని సీఎంఓ అంటోంది.

స‌న్నిహితుల ద‌గ్గ‌ర ఈ విష‌యాలేవీ చెప్ప‌కుండా జ‌గ‌న్ అత్యంత ర‌హ‌స్యంగానే ఉంచుతున్నారు. ఎందుకంటే అసంతృప్తులు ఎవ్వ‌రైనా తిరుగుబాటు చేసే అవ‌కాశాలు ఉంటే, అందుకు తాను వెల్ల‌డి చేసే ముంద‌స్తు స‌మాచారం ఓ కార‌ణం కాకూడ‌ద‌ని భావిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి ని కూడా చాలా మంది సంప్ర‌దిస్తున్నారు. రోజాలాంటి వారికి స్థానం ఫిక్స్ చేస్తే పెద్దిరెడ్డికి కోపం వ‌స్తుంది మ‌రి! అలాంట‌ప్పుడు జ‌గ‌న్ ఏ విధంగా స‌మాధానం చెప్పి పెద్దిరెడ్డిని సముదాయిస్తారో అన్న‌ది పెద్ద స‌మ‌స్య‌గా ఉంది. బొత్స‌కు ప‌ద‌వీ గండం లేద‌ని కొంత మంది అంటున్నారు. ఒక‌వేళ త‌ప్పిస్తే త‌న త‌మ్ముడిని సీన్లోకి తీసుకుని తీరాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు.

ఆయ‌న త‌మ్ముడు  బొత్స అప్ప‌ల న‌ర్స‌య్య విజ‌య‌న‌గ‌రం జిల్లా, గ‌జ‌ప‌తి న‌గ‌రం ఎమ్మెల్యేగా సుప‌రిచితులు. ఆ విధంగా కాకుండా విజ‌య‌న‌గ‌రం ఎమ్మెల్యే కోలగ‌ట్ల వీర‌భ‌ద్ర స్వామి (కోమ‌టి సామాజిక వ‌ర్గం)కి ప‌ద‌వి ఇస్తే మాత్రం బొత్సకు కోపం ఎక్క‌డికో చేరిపోవ‌డం ఖాయం. అదేవిధంగా తూగోలో కూడా దాడిశెట్టి రాజా, జ‌క్కంపూడి రాజా ఇద్ద‌రూ పోటీ ప‌డుతున్నారు. మ‌రి! వీరిలో ఎవ‌రికి వ‌రం ఎవ‌రికి శాపం? అన్న‌ది తేలాల్సి ఉంది. విడుద‌ల ర‌జ‌నీ కూడా ఎక్కువ‌గానే ఆత్ర పడుతున్నారు. అదే ప‌ల్నాటి సీమ‌కు చెందిన అంబ‌టి రాంబాబు ఆమెకు పోటీ వ‌స్తున్నారు. ఈ విధంగా ఎక్క‌డిక్క‌డ అసంతృప్తులు, ఆశావాహులు ఉంటూ రిసార్టు రాజ‌కీయాలు, లాబీయింగ్ లు వీలున్నంత మేర న‌డుపుతూ ఉంటే జ‌గ‌న్ మాత్రం చాలా కూల్ గా త‌న ప‌నేదో తాను చేసుకుంటూ విప‌క్షాల‌పై వాగ్బాణాలు సంధిస్తున్నారు. ఈ ద‌శ‌లో ఢిల్లీ కేంద్రంగా రెబ‌ల్ ఎంపీ స్పందించారు.

ఆయ‌న లెక్క ప్ర‌కారం కొడాలి నానిని మ‌రో మారు తీసుకుంటార‌ని చెప్పారు. పెద్దిరెడ్డి, బొత్స, కొడాలి లేని మంత్రివ‌ర్గాన్ని తాను ఊహించ‌లేన‌ని, వారు ముగ్గురూ లేకుంటే మా పార్టీ మ‌నుగ‌డే లేద‌ని తేల్చేశారు. వాస్త‌వానికి ఆయ‌న వైసీపీ రెబ‌ల్ ఎంపీ.. ఆ పార్టీ నుంచి ఎప్పుడో బ‌య‌ట‌కు వ‌చ్చినా మా పార్టీ మా పార్టీ అంటూ దెప్పిపొడుస్తారు. ఒక‌వేళ ర‌ఘురామ లెక్క నిజ‌మ‌యితే, జోస్యం ఫ‌లిస్తే దేవుడి కృప అన్న‌ది బొత్స పై పుష్క‌లంగా ఉంద‌నే అనుకోవాలి. అదేవిధంగా బూతుల మంత్రికి మ‌రో ఛాన్స్ ఇచ్చి చంద్ర‌బాబు ను ఇంకాస్త ఎక్కువే తిట్టిస్తార‌ని కూడా అనుకోవాలి. వీటితో పాటు పెద్దిరెడ్డి అనే బ‌డా పొలిటీషియ‌న్ కు మ‌రోమారు ఎదురు లేనేలేద‌ని కూడా రుజువు అయింద‌ని, రాజ‌కీయాల్లో నోట్ల క‌ట్ట‌లే శాసిస్తాయని కూడా త‌ప్ప‌క అనుకోవాలి.