ఏపీ క్యాబినెట్: జగనన్నకు కొత్త తలనొప్పులు

మంత్రి ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేయాల్సిన వారంతా ఏడుస్తున్నారు. కానీ వారి ఏడుపు జ‌గ‌న్ కు అన‌వ‌సరం అని తేలిపోయింది. వ‌స్తున్న వారంతా న‌వ్వుతున్నారు. ఈ ఇన్ అండ్ ఔట్ డ్రామాలో గెలుపు జ‌గ‌న్ దే! కానీ బొత్స లాంటి వారు తిరుగుబాటు చేస్తే కొత్త త‌ల‌నొప్పులు త‌ప్ప‌వు వైసీపీ అధినాయ‌క‌త్వానికి! ఏదేమ‌యినా ఎప్ప‌టి నుంచో వేచి చూస్తున్న ఉద‌యం మ‌రికొద్ది రోజుల్లో ప‌ల‌క‌రించ‌నుంది. అందుకు ముహూర్తం కూడా ఖ‌రారు కావ‌డం ఒకందుకు మంచిదే కానీ జిల్లాల‌లో  పార్టీ బ‌లోపేతం కావ‌డం అన్న‌ది ఇప్పుడు రాజీనామాలు చేసిన మంత్రుల‌తోనే సాధ్యం అనుకోవ‌డం ఓ విధంగా అంత మంచిది కాదు. ఇంకా చెప్పాలంటే అంత‌కుమించిన అవివేకం కూడా మ‌రొక‌టి లేదు.

ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అంతా అనుకున్న విధంగానే మంత్రుల రాజీనామా అన్న‌ది షురూ కానుంది. ఇప్ప‌టికే ఇందుకు సంబంధించిన ఫార్మెట్ ను అదేవిధంగా ప్రాసెస్ ను అన్నింటినీ సాధార‌ణ ప‌రిపాల‌న విభాగం (జీఏడీ) సంబంధిత వ్య‌క్తుల‌కు పంపి వివ‌రించింది. మంత్రుల ప‌ర్స‌న‌ల్ సెక్ర‌ట‌రీల‌కు కాల్ చేసి మ‌రీ! సంబంధిత వివ‌రాలు అన్నీ తీసుకుంది. మంత్రులు రాజీనామా చేయ‌గానే మ‌రు నిమిషంలోనే ప్రొటొకాల్ కాన్సిలేష‌న్ అన్న‌ది త‌ప్ప‌ని స‌రి అని కూడా చెప్పింది. ఈ మేరకు సంబంధిత మంత్రుల‌కు వివ‌రాలు కూడా అందించింది.

నిబంధ‌న‌ల మేర‌కే అంతా న‌డుచుకోవాల‌ని సీఎం ఆదేశాలు కూడా ఉన్నాయి. నిబంధ‌న‌లు అతిక్ర‌మిస్తే క్ర‌మ‌శిక్ష‌ణా చ‌ర్య‌ల‌న్న‌వి త‌ప్ప‌వ‌ని కూడా సీఎం ఇదివ‌ర‌కే తేల్చేశారు. దీంతో ఎక్క‌డిక్క‌డ ప‌నులు నిలిపివేసి, పునరాలోచ‌న‌లో ప‌డి ఉన్నారు మంత్రులు. కొందరైతే తీవ్ర అసంతృప్తిలో మునిగి ఉన్నారు. కొంద‌రు తీవ్ర భావోద్వేగంలో ఉన్నారు. జిల్లాల అధ్య‌క్షులుగా త‌మ‌ను నియమిస్తే పార్టీని గాడిన పెట్ట‌డం అన్న‌ది ఇప్ప‌టికిప్పుడు జ‌ర‌గ‌ని ప‌ని అని కూడా అంటున్నారు. మంత్రుల‌కూ జిల్లా పార్టీ అధ్య‌క్షుల‌కూ మ‌ధ్య వైరం నెల‌కొనే అవ‌కాశాలున్నాయ‌ని కూడా అంటున్నారు.

ఇవ‌న్నీ మీడియాలో వెలుగు చూస్తున్న విష‌యాలే.. కానీ కొత్త విష‌యం ఏంటంటే…మంత్రి బొత్స‌తో స‌హా ప‌లువురు జ‌గ‌న్ పై తిరుగుబాటు చేసే ఛాన్స్ ఉంద‌ని తెలుస్తోంది. రాజీనామా చేసే మంత్రుల‌తో పాటు ప‌దవులు ఆశించ‌ని వారు, గ‌తంలో ఏ ప్ర‌తిఫ‌లాపేక్షా లేకుండా ప‌నిచేసిన వారు వీరంతా ఇప్పుడు జ‌గ‌న్ శిబిరం నుంచి దూరం అయ్యే ఛాన్స్ ఉంది. త‌మ్ముడికి ప‌ద‌వి వ‌చ్చినా స‌రే దాస‌న్న మాత్రం అసంతృప్తిలోనే ఉన్నారు. ఒక‌వేళ ఆయ‌న పార్టీ మారినా మార‌వచ్చు. చెప్ప‌లేం. తీవ్ర ఆరోప‌ణ‌లున్న పెద్దిరెడ్డి లాంటి వారిని కొన‌సాగించ‌డం భావ్యం కాదని కొంద‌రు అంటున్నా అవేవీ సీఎం ప‌ట్టించుకోవ‌డం లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పెద్దిరెడ్డి మ‌రియు మేక‌పాటి లాంటి వారే
పార్టీకి ఫైనాన్షియ‌ల్ సపోర్ట‌ర్స్. క‌నుక పెద్దిరెడ్డిని కొన‌సాగించి, మంత్రి వ‌ర్గంలో మ‌రోసారి అవ‌కాశం ఇచ్చి ఆయ‌న రుణం తీర్చుకోవాల‌ని భావిస్తున్నారు. మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డిని మాత్రం రాజ్య‌స‌భ‌కు పంపాల‌ని భావిస్తున్నారు. ఈ విధంగా డ‌బ్బులు పెట్టే వారికి, బుగ్గ‌న లాంటి అప్పులు తెచ్చేవారికే కాస్తో కూస్తో ఛాన్స్. ఇక ఆదిమూలంను కూడా కొన‌సాగించేందుకు
జ‌గ‌న్ ఇష్ట‌ప‌డుతున్నారు.

వీరంతా సౌమ్యులు క‌నుక పెద్ద‌గా త‌ల‌నొప్పులు ఉండ‌వు. కార్మిక శాఖ మంత్రి గుమ్మ‌నూరు జ‌యరాం కూడా కొన‌సాగుతారు. ఆ లెక్క‌న చూసుకుంటే క‌ర్నూలు నుంచి బుగ్గ‌న, గుమ్మ‌నూరు ఇద్ద‌రికీ ఛాన్స్ ఉంది. వీళ్ల‌ను రిపీట్ చేయ‌డంలో ఎటువంటి ప్రాబ్లం ఉండ‌దు అందుకే జ‌గ‌న్ కాస్త రిలీఫ్ గానే ఉన్నారు. ఇక ఇత‌రులలో చాలా మంది ఇంటి బాట ప‌ట్ట‌నున్నారు క‌నుక పాముల పుష్ప శ్రీ‌వాణి, సుచరిత, వ‌నిత లాంటి వారికి అసంతృప్తి త‌ప్ప‌దు. కానీ వీళ్లేం తిరుగుబాటు చేయ‌రు. తిరుగుబాటు చేసే నాయ‌కుల వ‌ర్గంలోనూ ఉండరు. స‌మ‌యం వ‌స్తే మాత్రం ప్ర‌త్య‌ర్థి శిబిరంలో చేర‌ర‌ని మాత్రం చెప్పలేం.