ఏపీ పాలిటిక్స్.. రంగంలోకి గాలి జ‌నార్ద‌న్ రెడ్డి?

మైనింగ్ కింగ్, క‌ర్ణాట‌క మాజీ మంత్రి, ఏపీ సీఎం జ‌గ‌న్ కు స‌న్నిహితుడుగా పేరున్న గాలి జ‌నార్ద‌న్ రెడ్డి ఏపీ రాజ‌కీయాల్లో వేలు పెట్టార‌ని తెలిసింది. ప్ర‌స్తుతం ఏపీలో మంత్రి వ‌ర్గ మార్పుకు రంగం సిద్ధ‌మైన నేప‌థ్యంలో ఆయ‌న అనుచ‌రులు లేదా.. ఆయ‌న మిత్రులుగా ఉన్న కొంద‌రు మంత్రుల‌ను కొన‌సాగించేలా.. సీఎం జ‌గ‌న్‌ను ఒప్పించేందుకు .. గాలి ప్ర‌య‌త్నాలు ప్రారంబించిన‌ట్టు వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. క‌ర్నూలు జిల్లాకు చెందిన మంత్రి గుమ్మనూరు జయరాం  గాలి జనార్దనరెడ్డికి మంచి ఫ్రెండ్‌. ఈ క్ర‌మంలో త‌న ప‌ద‌విని కాపాడుకునేందుకు ఆయ‌న గాలి ద్వారా చ‌క్రం తిప్పుతున్నార‌ని తెలుస్తోంది.

ఆయ‌న మాదిరిగానే అనంత‌పురం జిల్లాకు చెందిన ఒక మంత్రి కూడా ఇదే త‌ర‌హా ప్ర‌యత్నాలు చేస్తున్న‌ట్టు వైసీపీలోనే చ‌ర్చ సాగుతోంది. ఇదిలావుంటే, మంత్రి వ‌ర్గ కూర్పున‌కు ముహూర్తం ఖ‌రారైన నేప‌థ్యంలో ఏపీ మంత్రులు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఇంకా రాజీనామాలు చేయ‌కుండానే.. విజయవాడ నుంచి మంత్రులు త‌ట్టా బుట్టా సర్దుకుంటున్నారు. ఈ నెల 11న కొత్త కేబినెట్‌ కొలువుతీరనుండడంతో.. పదవులు ఊడతాయని మంత్రులకు ముందే సిగ్నల్స్‌ వచ్చాయి. క్యాంపు కార్యాలయాలను మంత్రులు ఖాళీ చేస్తున్నారు. పేషీలోని సిబ్బందికి కోరిన చోట బదిలీలకు సిఫార్సులు చేశారు. ఇప్పటికే కొంతమంది మంత్రులు తమ కార్యాలయాలను ఖాళీ చేశారు.

మరోవైపు మంత్రివర్గం నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిని సీఎం జగన్ తొలగించడం ఖాయమని పాలకపక్షంలో జోరుగా ప్రచారం సాగుతోంది. వీరికి ఉద్వాసన మాటెలా ఉన్నా.. ప్రస్తుతం పార్టీలో సీనియర్లుగా ఉన్న మాజీ మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, ధర్మాన ప్రసాదరావుతో పాటు, అనంత వెంకట్రామిరెడ్డి, సీనియర్‌ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డికి కేబినెట్‌లో స్థానం దక్కుతుందా లేదా అనే ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.

ఇంకోవైపు.. 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకునే కేబినెట్‌ కూర్పు ఉంటుందని జగన్‌ విస్పష్టంగా చెప్పినా.. కొందరు మంత్రులు దింపుడు కళ్లం ఆశలతో ఉన్నట్లు తెలుస్తోంది. తమను కొనసాగించాలంటూ సిఫారసులు చేయిస్తున్నారని సమాచారం. వాస్తవానికి తొలి మంత్రివర్గ విస్తరణ సమయంలోనే అనుభవజ్ఞులైన ధర్మాన, ఆనం పేర్లు వినిపించాయి. కానీ కార్యరూపం దాల్చలేదు. ఈ నెల 11న జరిగే పునర్వ్యవస్థీకరణలోనైనా అవకాశం ఉంటుందా అని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. వైసీపీ అధికారంలోకి వస్తే.. నగరి ఎమ్మెల్యే రోజాకు మంత్రివర్గంలో చోటు ఖాయమని అప్పట్లోనే అందరూ భావించారు. ఇప్పుడుకూడా ఆమె ఆశ‌గానే ఎదురు చూస్తున్నారు. కానీ.. ఆశ‌లు నెర‌వేర‌డం క‌ష్ట‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.