కొత్త జిల్లా కొత్త వివాదం?

కొత్త జిల్లాల ఏర్పాటుకు జ‌గ‌న్ ఆమోదం ఇవ్వ‌డం త‌రువాత అనుకున్న వెంట‌నే వాటికో కార్య‌రూపం ద‌క్క‌డం నిన్న‌టి వేళ లాంఛ‌న ప్రాయం అయిన అమ‌లు సూత్రం. ఇదంతా బాగుంది అని అనుకునేందుకు ఒక్క రోజు హంగామాతో ప‌రి స‌మాప్తి కాదు కనుక వీటి వెనుక ఉన్న వాస్త‌వాలు ఏంటి ఉద్దేశాలు ఏంటి తెలుసుకోవాలి? వాస్త‌వం అయితే జిల్లాల ఏర్పాటు అన్న‌ది త‌ల‌కు మించిన భారం అని ఒప్పుకోవాలి. మ‌రో వాస్త‌వం అయితే జ‌గ‌న్ కానీ ఆయ‌న మ‌నుషులు కానీ ప‌ద‌హారు వేల‌కు పైగా ఉన్న అభ్యంత‌రాల‌ను విన‌లేదు. చ‌ద‌వ‌లేదు. క‌నీసం వాటి గురించి మాట్లాడేందుకు కూడా ఇష్ట‌ప‌డ‌లేదు.

మొద‌ట ఇచ్చిన గెజిట్ లో వంద త‌ప్పులున్నాయి. అవ‌న్నీ కూడా స్పెల్లింగ్ మిస్టేక్స్. వాటిని కూడా టేక్ ఇట్ ఈజీ అన్న విధంగానే చూడ‌మ‌న్నారు. ఆ త‌రువాత అధికారులు కూర్చొని  స్థానిక వ్య‌వ‌హారానికి అనుగుణంగా పేర్ల‌ను దిద్దారు. మ‌ళ్లీ గెజిట్ నోటిఫికేష‌న్ ఇచ్చారు. రివైజ్డ్ ఇచ్చాక కూడా కొన్ని త‌ప్పులున్నా ఏదో స‌ర్దుకుపోయారు ప్ర‌జ‌లు.  ఇక త‌రువాత జిల్లాల వారీగా వ‌చ్చిన అభ్యంత‌రాలు ఏవీ ప‌రిగ‌ణించ‌లేదు.

ప‌శ్చిమ‌లో ఉన్న కొవ్వూరును తూర్పులో ఉన్న రాజ‌మ‌హేంద్ర‌వ‌రం జిల్లాలో క‌ల‌ప‌డం ఏంటి అని అడిగారు. రాజ‌మ‌హేంద్ర‌వ‌రం జిల్లాలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉండ‌నున్నాయని తేల్చారు. అన‌ప‌ర్తి, రాజాన‌గ‌రం, రాజ‌మండ్రి సిటీ, రాజ‌మండ్రి రూర‌ల్‌, కొవ్వూరు, నిడ‌ద‌వోలు, గోపాల‌పురం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉంటాయని పేర్కొన్నారు. ఇవ‌న్నీ బాగానే ఉన్నా కొవ్వూరు నుంచి అభ్యంత‌రాలు వ‌చ్చినా జ‌గ‌న్ విన‌లేదు. వినిపించుకోలేదు అన్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

గోదావ‌రి జిల్లాల నుంచి ఎక్కువ అభ్యంత‌రాలు వ‌చ్చాయి అని అనుకునేందుకు వీల్లేదు. సీమ‌కు సంబంధించి కూడా చాలా అభ్యంత‌రాలు ఉన్నాయి. ఆయ‌న సొంత ప్రాంతం అయినా కూడా వాటిని కూడా వినిపించుకోలేదు అన్న అభిప్రాయం మ‌రియు ఆవేద‌న జ‌గ‌న్ కు సంబంధించి వినిపించింది. ఎలా చూసుకున్నా చిత్తూరు వ‌ర‌కూ రోజా, హిందూపురం వ‌ర‌కూ బాల‌కృష్ణ త‌మ మాట నెగ్గించుకోలేక‌పోయారు. బాల‌య్య రాజ‌కీయ భ‌విష్య‌త్ కు వ‌చ్చిన ఇబ్బందేం లేక‌పోయినా రోజా కు మాత్రం ప్రాణ సంకట‌మే అని తెలుస్తోంది. ఇవి కాకుండా జెడ్పీల విభ‌జ‌న అన్న‌ది చేయ‌కుండానే ఆయ‌న జిల్లాల విభ‌జ‌న‌కు పూనుకున్నారు.

ఉదాహ‌ర‌ణ శ్రీ‌కాకుళం జిల్లానే తీసుకుంటే మూడు జిల్లాలుగా ఈ ప్రాంతాన్ని విడ‌గొట్టారు. అంటే రేప‌టి వేళ మూడు జిల్లాల జిల్లా ప‌రిషత్ లూ ఒకే ద‌గ్గ‌ర స‌మావేశం అవుతాయా ? అన్న సందేహాలూ ఉన్నాయి. లేదా ఇప్ప‌టికింతే స‌ర్దుకుపోండి అని చెప్పేస్తారా ? ఇవి కాకుండా ఆదాయం వ‌చ్చే ప్రాంతాలు పోయి శ్రీ‌కాకుళం మొండి గోడ‌ల‌కు ప‌రిమితం అయింది.

పారిశ్రామికంగా విద్య రంగ ప‌రంగా వృద్ధిలో ఉన్న రాజాం ను విజ‌య న‌గ‌రంలో  క‌లిపేశారు. పాల కొండ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధి సీతంపేట ఐటీడీఏ ను తీసుకుని వెళ్లి పార్వ‌తీపురం మ‌న్యంలో క‌లిపేశారు. క‌లిపితే క‌లిపారు మ‌రి కొత్త ఐటీడీఏ మాటేంటి? ఇవే కాదు ఇంకా చాలా స‌మ‌స్య‌లు రానున్నాయి. ముఖ్యంగా ప్ర‌భుత్వం జిల్లాల హ‌ద్దులు తేల్చ‌లేదు. అదొక పెద్ద త‌ల‌నొప్పి. ఇంకా శాఖ‌ల ఏర్పాటు మార్పు కూర్పు ఏమీ కాలేదు కానీ ఆయ‌న మాత్రం ఆయ‌న అంటే సీఎం మాత్రం త‌న ప్రక‌ట‌న‌లో చాలా విష‌యాలు గొప్ప‌గానే చెప్పుకుని రావ‌డంలో సిస‌లు వింత ఒక‌టి దాగి ఉంద‌ని అంటున్నాయి విప‌క్ష వర్గాలు.