జ‌గ‌న్ హీరో.. ఓ ఎంపీ సినిమా ముచ్చ‌ట‌

వైసీపీ అధినేత జ‌గ‌న్ పాల‌న ఇప్ప‌టికి మూడేళ్లు పూర్త‌వుతోంది. ఆయ‌న అనుచ‌రులు.. ఆయ‌న సానుకూల నేత‌లు… పాల‌న‌పై స‌ద‌భిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. ఇదే ఊపుతో మ‌ళ్లీ మ‌ళ్లీ అధికారంలోకి రావాల‌ని.. వారంతా ముచ్చ‌ట‌ప‌డుతున్నారు. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను ప‌రిశీలిస్తే.. అంత ఈజీగా అనిపించ‌డం లేదు. దీంతో ఉత్త‌రాంధ్ర జిల్లాల‌కు చెందిన ఒక ఎంపీ చ‌క్క‌ని ఐడియా వేశార‌ట‌. ఆయ‌న గ‌తంలో రెండు మూడు సినిమాలు కూడా తీసి ఉండ‌డం గ‌మ‌నార్హం. ఇంత‌కీ ఆయ‌న వేసిన ఐడియా ఏంటంటే.. జ‌గ‌న్ పాల‌న‌పై సినిమా తీయాల‌ని! ఆశ్చ‌ర్యంగా ఉన్న‌ప్ప‌టికీ.. వైసీపీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

విష‌యంలోకి వెళ్తే.. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు అధికారంలో ఉన్న టీడీపీ.. ప్ర‌తిప‌క్షంలో ఉన్న వైసీపీలు… సినిమాల‌ను న‌మ్ముకున్న విష‌యం గుర్తింది క‌దా! అన్న‌గారు ఎన్టీఆర్ చ‌రిత్ర‌ను బాల‌య్య తెర‌కెక్కించి.. త‌ద్వారా.. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని.. తెర‌మీదచూపించి ఇతోధికంగా.. టీడీపీకి సాయం చేశారు. స‌రే ఇది వ‌ర్క‌వుట్ అయిందా లేదా.. అన్న‌డి వేరే విష‌యం. ఇక‌, వైసీపీ మాత్రం త‌క్కువ తిన‌లేదు. కేర‌ళ సూప‌ర్ స్టార్  మమ్ముట్టిని వైఎస్ పాత్ర‌లో పెట్టి.. సినిమా తీశారు. వైఎస్ పాద‌యాత్ర కోణంలోనూ.. ప్ర‌జ‌ల‌కు చేరువైన కోణంలోనూ ఈ సినిమా తీసుకున్నారు.. ఇది కూడా సేమ్ టు సేమ్‌.. ప్ర‌జ‌ల్లో ఉన్న సెంటిమెంటును రెచ్చ‌గొట్ట‌డ‌మే!

ఇక‌, ఆ రెండు సంగ‌తులు అలా ఉంచితే.. ఇప్పుడు జ‌గ‌న్ ముచ్చ‌ట‌ను కూడా తెర‌మీద‌కి ఎక్కించాల‌ని.. ప్ర‌య‌త్నిస్తున్నారు. ఆయ‌న పాల‌నపై సినిమా తీయాల‌ని.. పార్టీలో ఓ ఎంపీ తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు.  దీనికి సంబంధించి తాజాగా.. జ‌గన్  మీడియాలో ఆది నుంచి కీల‌క రోల్ పోషిస్తున్న ఒకాయ‌న‌తో క‌లిసి.. క‌థ‌పై చ‌ర్చ‌లు కూడా జరుగుతున్నాయ‌ని.. వైసీపీ వ‌ర్గాల్లో జోరుగా గుస‌గుస వినిపిస్తోంది. జ‌గ‌న్ పాల‌న‌లో ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కాలు… సంక్షేమం.. ప్ర‌జ‌ల కోసం తీసుకువ‌చ్చిన వ‌లంటీర్ వ్య‌వ‌స్థ ఇలాంటి వాటిని హైలెట్ చేసి.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ముందు.. రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నార‌ని.. సీనియ‌ర్ వైసీపీ నాయ‌కుడు ఒక‌రు ఆఫ్ ది రికార్డుగా.. ఒక‌రిద్ద‌రు పాత్రికేయ మిత్రుల‌తో పంచుకున్నారు.

వాస్త‌వానికి.. వ‌చ్చే ఎన్నిక‌లు వైసీపీ చాలా ప్ర‌తిస్టాత్మ‌కం కానున్నాయి. దాదాపు అన్ని పార్టీలు ఒక‌వైపు.. నిల‌బ‌డే అవ‌కాశం ఉన్న  నేప‌థ్యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ ఒంట‌రిగానే బ‌రిలో దిగుతున్నారు. ఇది బ‌ల‌మైన పోటీ, పైగా.. రాజ‌న్న రాజ్యాన్ని స్థాపించాన‌న‌ని చెబుతున్న జ‌గ‌న్‌కు ఒక‌రకంగా అగ్నిప‌రీక్ష‌. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్‌కు అత్యంత విశ్వాస‌పాత్రుడిగా ఉన్న స‌ద‌రు ఎంపీ.. త‌న వంతు ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని.. ఏదో `రుణం` తీర్చుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ని.. ఆ సీనియ‌ర్ నేత క‌డుపులో దాచుకోకుండా చెప్పేయ‌డం గ‌మ‌నార్హం.

బ‌ల‌మైన క‌థ‌తో అది కూడా.. వైఎస్ జ‌గ‌న్ న‌వ్యాంధ్ర‌లో అందిస్తున్న పాల‌న‌పై.. సినిమా తీయాల‌ని.. నిర్మాత నిర్ణ‌యించుకున్నారట‌. దీనికి సినిమాటోగ్ర‌ఫీ శాఖ నుంచి కూడా స‌హ‌కారం ల‌భిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ కార్పొరేష‌న్‌కు చైర్మ‌న్‌గా ఉన్న వైసీపీ నాయ‌కుడు.. విజ‌య‌చంద‌ర్ దీనికంత‌టికీ.. కీల‌క పాత్ర పోషిస్తున్నార‌ని.. అంటున్నారు. ఈ ఏడాది మ‌ధ్య‌లోనే పాత్ర‌ల ఎంపిక‌.. క‌థ ప్రిప‌రేష‌న్ వంటివాటిని పూర్తి చేసి.. వ‌చ్చే ఏడాది మొద‌ట్లోనే సెట్స్ ఎక్కించే ఆలోచ‌న‌లో ఉన్నారని తెలుస్తోంది. మ‌రి ఏమ‌వుతుందో.. ప్ర‌జ‌లు ఎలా దీనిని స్వీక‌రిస్తారో చూడాలి. మ‌రోవైపు.. టీడీపీలో ఉన్న ప్ర‌ముఖ నిర్మాత‌.. గ‌తంలో ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన అగ్ర నిర్మాత‌ కూడా జ‌గ‌న్‌కు యాంటీ సినిమా తీసే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు పార్టీలో గుస‌గుస వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.