సీనియ‌ర్ల‌కు ఎంపీ.. జూనియ‌ర్ల‌కు ఎమ్మెల్యే.. ఇదే బాబు లెక్క‌!

యువ‌త రాజ‌కీయాల్లోకి రావాలి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున యువ‌త‌కు అవ‌కాశం ఇస్తాం.. 40 శాతం టికెట్లు కేటాయిస్తాం.. ఇవీ తాజాగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు చేసిన వ్యాఖ్య‌లు. వీటిని బ‌ట్టి చూస్తుంటే వ‌చ్చే ఏపీ ఎన్నిక‌ల్లో యువ‌త‌కు బాబు అధిక ప్రాధాన్య‌త ఇచ్చేందుకు సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. పార్టీ బ‌లోపేతంపై సీనియ‌ర్లు దృష్టి పెట్ట‌క‌పోవ‌డం.. పార్టీ కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా పాల్గొన‌లేక‌పోవ‌డం లాంటి కార‌ణాల వ‌ల్ల ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో యువ‌త‌ను బ‌రిలో దించాల‌ని ఆయ‌న అనుకుంటున్నారు. అయితే యువ‌త‌కు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి.. సీనియ‌ర్ల‌ను ఎంపీ స్థానాల్లో బ‌రిలో దింపాల‌న్న‌ది బాబు ఆలోచ‌న‌గా తెలుస్తోంది.

జాతీయ రాజ‌కీయాల్లో..
వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ, జ‌న‌సేన క‌లిసి పోటీ చేయ‌డం ఖాయ‌మైంద‌ని వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఈ పార్టీల‌తో బీజేపీ కూడా పొత్తు కుదుర్చుకునే అవ‌కాశం ఉంది. ఒక‌వేళ పొత్తులో కొన్ని స్థానాలు పోయినా మిగ‌తా వాటిపై బాబు దృష్టి పెట్టేందుకు సిద్ధ‌మ‌య్యారు. మ‌రోవైపు జాతీయ రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర పోషించాలంటే వీలైనంత ఎక్కువ మందిని ఎంపీలుగా గెలిపించుకోవ‌డం అవ‌స‌రం.

అందుకే ఎంపీ అభ్య‌ర్థుల విష‌యంలో బాబు ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఒక‌వేళ బీజేపీ, జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకున్నా.. ఆ పార్టీలో లోక్‌స‌భ స్థానాల‌పై ప‌ట్టు ప‌ట్టే అవ‌కాశం లేదు. అందుకే త‌మ పార్టీ త‌ర‌పున ఎక్కువ స్థానాల్లో అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్టి గెలిపించుకోవాల‌ని బాబు చూస్తున్నారు.

వాళ్ల‌పై క‌న్ను..
లోక్‌స‌భ స్థానాలు వీలైన‌న్ని ఎక్కువ గెలుచుకోవాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్న బాబు అందుకోసం ఇత‌ర పార్టీ సీనియ‌ర్ నేత‌ల‌పైనా దృష్టి సారించార‌ని టాక్‌. ముఖ్యంగా కాంగ్రెస్‌లోని సీనియ‌ర్ నేత‌లను పార్టీలోకి ఆహ్వానించేందుకు సిద్ధ‌మైన‌ట్లు స‌మాచారం. కాకినాడ‌, అర‌కు, విశాఖ‌ప‌ట్నం, అన‌కాప‌ల్లి, రాజ‌మండ్రి, అమ‌లాపురం, ఏలూరు, ఒంగోలు, నెల్లూరు లాంటి లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇప్ప‌టికే సీనియ‌ర్ల పేరును బాబు ఖరారు చేసిన‌ట్లు తెలుస్తోంది. రాజ‌మండ్రి నుంచి గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రిని పోటీ చేయిస్తే కాకినాడ నుంచి మాజీ మంత్రి ప‌ల్లం రాజుని బ‌రిలో దించాల‌ని చూస్తున్నారు. మొత్తంగా ఢిల్లీలో ప‌ట్టు కోసం ప్ర‌య‌త్నిస్తున్న బాబు అందుకు త‌గిన వ్యూహ ర‌చ‌న‌ల్లో మునిగిపోయారు.