అఖిల ప్రియ‌ను దూరం పెట్టిన కుటుంబం!

దివంగ‌త రాజ‌కీయ నాయ‌కులు భూమా శోభ‌, నాగిరెడ్డి దంప‌తుల త‌న‌య‌గా రాజ‌కీయాల్లో ముద్ర వేసిన భూమా అఖిల ప్రియ ఇప్పుడు ఒంట‌రిగా మిగిలిపోయార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. గ‌త కొంత‌కాలంగా కోర్టు కేసులు, వివాదాలు ఇలా ఆమె ఏదో ఒక స‌మ‌స్య‌లో చిక్కుకుంటూనే ఉన్నారు. మ‌రోవైపు భూమా కుటుంబంతోనే విభేదాలు కొన‌సాగిస్తున్నారు. దీంతో భూమా కుటుంబం, వారి బంధువ‌ర్గం ఇప్పుడు అఖిల ప్రియ‌ను పూర్తిగా ప‌క్క‌న‌పెట్టార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది.

ఇటీవ‌ల ప‌రిణామాలు చూస్తుంటే అది నిజమ‌నే అభిప్రాయాలు క‌లుగుతున్నాయి. ఆళ్ల‌గ‌డ్డ‌లో భూమా శోభ‌, నాగిరెడ్డి దంప‌తుల విగ్ర‌హాల‌ను ఇటీవ‌ల ఏర్పాటు చేశారు. భూమా కుటుంబ స‌భ్యుడు, ఆ నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జీ భూమా కిషోర్‌రెడ్డి త‌న సొంత స్థలంలో ఆ విగ్ర‌హాలు ఏర్పాటు చేశారు. వీటి ఆవిష్క‌ర‌ణ‌కు మాజీ మంత్రి అఖిల ప్రియ‌కు త‌ప్ప భూమా కుటుంబంలో అంద‌రికీ ఆహ్వానాలు వెళ్లాయి.

కానీ దీన్ని జీర్ణించుకోలేక పోయిన అఖిల ప్రియ పిల‌వ‌క‌పోయిన ఆ కార్య‌క్ర‌మానికి వెళ్లారు. కిషోర్‌రెడ్డి కంటే ముందే వెళ్లి విగ్ర‌హాల‌ను ఆవిష్కరించారని తెలిసింది. దీంతో అఖిల‌ప్రియ‌ను భూమా కుటుంబం పూర్తిగా బ‌హిష్క‌రించార‌ని స‌మాచారం. హైదరాబాద్‌లో ఇటీవ‌ల బ‌న‌గాన‌ప‌ల్లె ఎమ్మెల్యే కాట‌సాని రామిరెడ్డి కుమారుడి నిశ్చితార్థం జ‌రిగింది. ఈ వేడుకకు అఖిల ప్రియ, ఆమె త‌మ్ముడు జ‌గత్‌విఖ్యాత్ల‌కు త‌ప్ప మిగ‌తా వాళ్లంద‌రికీ ఆహ్వానాలు వెళ్లాయి.

భూమా కుటుంబానికి అత్యంత స‌మీప బంధువు కాట‌సాని రామిరెడ్డి అఖిల ప్రియ‌ను పిల‌వ‌క‌పోవ‌డం తీవ్ర చర్చ‌నీయాంశంగా మారింది. కాట‌సాని రామిరెడ్డి కుమార్తెకు నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డితో వివాహం జ‌రిగింది. భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డికి అఖిల ప్రియ చెల్లెల‌య్యే విష‌యం తెలిసిందే. మ‌రోవైపు భూమా నాగిరెడ్డి ఆత్మీయుడైన ఏవీ సుబ్బారెడ్డి కుమార్తె జ‌స్విత‌రెడ్డి నిశ్చితార్థ వేడుక కూడా అఖిల ప్రియ‌కు ఆహ్వానం అంద‌లేదు. దీంతో ఆమెను కుటుంబం, ఆత్మీయులు పూర్తిగా దూరం పెట్టారనే విష‌యం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది.