తెలంగాణ ఐఏఎస్ అధికారి.. 450 కోట్ల మ‌ల్టీఫ్లెక్స్?

సాధార‌ణ ఉద్యోగులే.. భారీ ఎత్తున స్థిరాస్తులు సంపాయించుకుంటున్న రోజులు ఇవి. అయిన దానికీ.. కాని దానికీ.. చేతులు చాపుతూ.. ప్ర‌జ‌ల నుంచి లంచాలు పీడించి మ‌రీ వ‌సూలు చేస్తున్న అధికారులు పెరిగి పోతున్నార‌ని.. దేశ‌వ్యాప్తంగా స‌ర్వే చేసిన‌..ఏడీఆర్‌.. ఇటీవ‌ల సంచ‌ల‌న నివేదిక నివేదిక వెల్ల‌డించింది. ఎక్క‌డ ఏ అధికారిపై ఏసీబీ కానీ, సీబీఐ కానీ, ఈడీ కానీ..ఎలా ఎవ‌రు దాడులు చేసినా.. వంద‌ల కోట్ల రూపాయ‌ల అక్ర‌మ సంపాద‌న వెలుగు చూస్తోంది. ఏపీ, తెలంగాణ‌లో మాత్ర‌మే కాదు.. దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే ప‌రిస్థితి నెల‌కొంది.

ఇక‌, ఈ కోవ‌లోనే.. ఇటీవ‌ల కాలంలో ఐఏఎస్‌, ఐపీఎస్‌లు కూడా చేరుతున్నారని కేంద్ర‌మే చెబుతోంది. ఇటీవ‌ల పార్ల‌మెంటులో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ కు చెందిన ఒక సీనియ‌ర్ ఐపీఎస్ అదికారి విష‌యంపై అడిగిన ప్ర‌శ్న‌కు కేంద్రం చెప్పిన స‌మాధానం ఆశ్చ‌ర్యం క‌లిగించింది. స‌ద‌రు ఐపీఎస్ అధికారి త‌న 30 ఏళ్ల స‌ర్వీసులో రూ.250 కోట్ల మేర‌కు.. అవినీతికి పాల్ప‌డిన విష‌యం ఈడీ గుర్తించింద‌ని.. ఆయ‌న నుంచి ఆ మొత్తాన్ని రిక‌వ‌రీ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని.. పేర్కొంది.

రాజ‌కీయాల్లోనేకాదు.. అధికారుల్లోనూ.. హంగు ఆర్భాటం.. ఆస్తులు కూడ‌గ‌ట్టుకోవ‌డం.. త‌ర‌త‌రాల‌కు అందించ‌డం.. ఇటీవ‌ల కాలంలో ఆన‌వాయితీగా మారిపోయింది. తాజాగా తెలంగాణలో పనిచేస్తున్న బీహార్ కు చెందిన ఓ IAS అధికారి గురుగావ్ లో మల్టీఫ్లెక్స్ కడుతున్నార‌నే సంచ‌ల‌న ఆరోప‌ణ‌.. రాష్ట్ర రాజ‌కీయ వ‌ర్గాల‌ను.. అధికార వ‌ర్గాల‌ను కూడా కుదిపేస్తోంది. కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఈ విష‌యాన్ని త‌న ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు.

రూ.450 కోట్లతో మల్టిప్లెక్స్ కడుతోన్న బీహార్ కు చెందిన ఆ IAS అధికారి ఎవరో తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని దాసోజు శ్రవణ్ వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం శ్ర‌వ‌ణ్  చేసిన ట్వీట్  సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మ‌రోవైపు.. రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ.. సంచ‌ల‌నంగా మారింది. నిజానికి బిహార్ నుంచి వ‌చ్చే అధికారులు నిజాయితీగా ప‌నిచేస్తార‌నే పేరుంది. ఎందుకంటే.. వారికి డ‌బ్బు విలువ బాగా తెలుసు. కానీ.. ఇప్పుడు ఈ ఐఏఎస్ అధికారి విష‌యం మాత్రంసంచ‌ల‌నంగా మారింది. మ‌రి అంత డ‌బ్బు ఎక్క‌డ నుంచి వ‌చ్చిందో.. ఆయ‌న ఎలా సంపాయించారో.. మున్ముందు.. దీనిపై స‌ర్కారు ఎలా  రియాక్ట్ అవుతుందో చూడాలి.