ఏపీలో న‌కిలీ మ‌ద్యంపై టీడీపీ డిజిట‌ల్ యుద్దం

ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న జే బ్రాండ్ల క‌ట్ట‌డి.. క‌ల్తీ సారా మ‌ర‌ణాల‌పై టీడీపీ నేత‌లు మ‌రింత తీవ్రంగా పోరాడాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇప్ప‌టికే అటు అసెంబ్లీలోనూ.. ఇటు శాసన మండ‌లిలోనూ తీవ్ర‌స్తాయిలో యుద్ధం చేస్తున్న నాయ‌కులు.. మ‌రింత‌గా ప్ర‌జ‌ల్లో చైత‌న్యం క‌లిగించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దీనిలో భాగంగా.. తాజాగా.. మ‌ద్యం మాఫియాపై ప్రత్యేక వెబ్‌సైట్ను రూపొందించినట్లు తెలుగుదేశం పార్టీ వెల్లడించింది.

మద్యం పేరుతో దోపిడీ, మరణాల వివరాలు వెబ్‌సైట్‌లో ఉంచుతామని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. ఈ డిజిటల్ క్యాంపెయిన్‌లో ప్రజలు భాగస్వాములు కావాలని నేతలు కోరారు. ముఖ్యమంత్రి జగన్ నడిపిస్తున్న మద్యం మాఫియాపై జరిపే పోరాటంలో ప్రజలను భాగస్వామ్యం చేస్తామంటూ.. తెలుగుదేశం ప్రత్యేక వెబ్ సైట్ రూపొందించింది. ఏపీలో నాసిరకం మద్యం బ్రాండ్లు ప్రాణాలు తీస్తున్నాయంటూ.. టీడీపీ డిజిటల్ క్యాంపెయినింగ్ మొదలు పెట్టింది.

ప్రభుత్వ మద్యం పాలసీ, మద్యం పేరుతో జరుగుతోన్న దోపిడీ, మద్యం వల్ల సంభవిస్తున్న మరణాలు వంటి వివరాలను www.killerjbrands.com వెబ్సైట్లో పొందుపరుస్తామని టీడీపీ సీనియ‌ర్ నేతలు ఆనంద్‌బాబు, అశోక్‌బాబు, ఆచంట సునీత వెల్లడించారు. దశల వారీ మద్య నిషేధం హామీని జగన్ గాల్లో కలిపేశారని టీడీపీ నేతలు దుయ్యబట్టారు. మద్యం తయారీ మొదలుకుని అమ్మకాల వరకు ప్రభుత్వమే నడుపుతోందని ఆరోపించారు. జే-బ్రాండ్ల ద్వారా సరఫరా అయ్యే మద్యం ప్రాణాంతకంగా ఉందని మండిపడ్డారు. నాసిరకం మద్యంతో పేద మహిళల తాళిబొట్లు తెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిజిటల్ క్యాంపెయినింగ్లో భాగస్వాములు కావాలని ప్రజలను కోరారు. మధ్యం మాఫియాపై ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని నేతలు స్పష్టం చేశారు.

మ‌రోవైపు.. ఇంటింటికీ కూడా టీడీపీ యాత్ర చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు నాయ‌కులు తెలిపారు. ప్ర‌భుత్వ మ‌ద్య విధానానికి వ్య‌తిరేకంగా.. ఉద్య‌మించాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు. ప్ర‌తి ఇంటికి వెళ్లి.. ఏడాది కాలంలో మ‌ద్యంపై జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఎంత సంపాయిస్తోందో.. ఎంత న‌కిలీ మ‌ద్యాన్ని ప్ర‌జ‌ల‌కు విక్ర‌యించి సొమ్ము చేసుకుంటోందో వివ‌రించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలిపారు. ప్ర‌తి ఒక్క‌రూ ఈ న‌కిలీ మ‌ద్యం ఉద్య‌మంలో భాగ‌స్వాములు కావాల‌ని.. ప్ర‌భుత్వం ద‌మన నీతిని ఎండ‌గ‌ట్టాల‌ని.. నాయ‌కులు పిలుపునిచ్చారు.