పెగాస‌స్ అంతు తేల్చాల్సిందే..

అంద‌రూ చెబుతున్నా.. ప్ర‌తిప‌క్షం నెత్తీ నోరూ.. మొత్తుకుంటున్నా.. ఏపీ ప్ర‌భుత్వం మాత్రం త‌న పంథాలో త‌ను ప‌య‌నిస్తోంది. ఏపీలో పెగాస‌స్ విష‌యంపై ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ చేసిన వ్యాఖ్య‌ల పై వెన‌క్కి త‌గ్గేది లేద‌న్న‌ట్టుగా.. వ్య‌వ‌హ‌రిస్తోంద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే దీనిపై ఒక రోజు రోజంతా.. టీడీపీ స‌భ్యుల‌ను స‌స్పెండ్ చేసి.. స‌భ‌లో పెగాస‌స్‌పై చ‌ర్చలు జ‌రిగిన ప్ర‌భుత్వం.. తాజాగా దీనిపై హౌస్ క‌మిటీని నియ‌మించింది.

వాస్త‌వానికి పెగాస‌స్‌పై చ‌ర్చ సంద‌ర్భంగా.. గ‌త చంద్ర‌బాబు హ‌యాంలో దీనిని కొనుగోలు చేయలేద‌ని.. ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డిస్ప‌ష్టం చేశారు. అయితే.. ప్రైవేటుగా దీనిని కొనుగోలు చేసి ఉంటార‌ని.. ఆయ‌న అనుమానం వ్య‌క్తం చేశారు. అయితే.. తాము అదికూడా కొన‌లేద‌ని.. దీనికి కూడా కేంద్రం అనుమ‌తి ఉండాల‌ని.. అయినా.. ప్రైవేటు వ్య‌క్తుల‌కు పెగాస‌స్‌ను విక్ర‌యించే సంప్ర‌దాయం లేద‌ని.. పెగాస‌స్ కంపెనీనే త‌న వెబ్‌సైట్‌లో వివ‌ర‌ణ ఇచ్చింది. అయినా కూడా ప్ర‌భుత్వం ఏమాత్రం జంకు లేకుండా.. క‌మిటీని వేసింది.

టీడీపీ పెగాసెస్‌ వ్యవహారంపై శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారం హౌస్ శుక్ర‌వారం స‌భ సాక్షిగా కమిటీ వేశారు. ఈ కమిటీ చైర్మన్‌గా ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డిని నియమించారు. అదే విధంగా కమిటీ సభ్యులుగా ఎమ్మెల్యేలు కొట్టిగుళ్ల‌ భాగ్యలక్ష్మి(పాడేరు), అబ్బయ్య చౌదరి(దెందులూరు), కొలుసు పార్థసారధి(పెన‌మ‌లూరు), అమర్నాథ్‌, మేరుగు నాగార్జున(గుంటూరు), మద్దాల గిరిధర్‌(గుంటూరు వెస్ట్‌)ను నియమించారు.

కాగా రాష్ట్రంలో పెగసస్‌ స్పైవేర్‌ బాగోతం గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతోంది. టీడీపీ హయాంలో పెగసస్‌ స్పైవేర్‌ను కొనుగోలు చేశారని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఆ రాష్ట్ర అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాల్లో దీనిపై పెద్దఎత్తున చర్చ మొదలైంది. రాష్ట్ర శాసనసభలోనూ సోమవారం తీవ్ర దుమారం రేపింది.

అప్పటి ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నేతల ఫోన్ల ట్యాపింగ్‌ వ్యవహారం కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. దీంతో స్పైవేర్‌ ఉదంతంపై హౌస్‌ కమిటీ ఏర్పాటుచేయాలని సోమవారమే అసెంబ్లీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజైన శుక్రవారం నాడు టీడీపీ పెగాసెస్‌ వ్యవహారంపై స్పీకర్‌ హౌస్‌ కమిటీ వేశారు. ఈ క‌మిటీ ఖ‌ర్చుల నిమిత్తం రూ.20 ల‌క్ష‌లు కేటాయించాల‌ని.. స్పీక‌ర్ త‌న ఆదేశాల్లో పేర్కొన్నారు. అదేవిధంగా క‌మిటీకి ప‌టిష్ట భ‌ద్ర‌త‌ను సైతం క‌ల్పించాల‌ని సూచించారు. మ‌రి ఈ క‌మిటీ ఏం తేలుస్తుందో చూడాలి. ఆధారాలే లేవ‌ని స‌భ‌లో చెప్పిన ప్ర‌భుత్వం ఏ ఆధారాల‌తో ఈ క‌మిటీని నియ‌మించిందో .. తెలియాల‌ని మేధావులు సైతం విస్తు పోతున్నారు.