సంతోష్ కుటుంబానికి రూ.5 కోట్లు: కేసీఆర్

భారత్, చైనా సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబుతో సహా 20 మంది భారత సైనికులు అమరలయ్యారు. తెలంగాణకు చెందిన సంతోష్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలోనే సంతోష్ కుటుంబానికి అండగా ఉంటామని సీఎం కేసీఆర్ అన్నారు. సంతోష్ బాబు కుటుంబానికి రూ.5 కోట్ల నగదు, నివాస స్థలం, ఆయన భార్యకు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం ఇస్తున్నామని కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. అంతేకాదు, తానే స్వయంగా సంతోష్ బాబు ఇంటికి వెళ్లి సాయం అందిస్తానని కేసీఆర్ వెల్లడించారు. అంతేకాకుండా, ఆ ఘర్షణల్లో వీర మరణం పొందిన మిగతా 19 మంది వీర జవాన్ల కుటుంబసభ్యులకు కూడా ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున అందిస్తామన్నారు.

సరిహద్దుల్లో ప్రాణాలను లెక్కచేయకుండా పహారా కాస్తున్న సైనికులకు యావత్ దేశం అండగా నిలవాలని కేసీఆర్ అన్నారు. మన కోసం పోరాడుతూ అమరులైన సైనికుల కుటుంబాలకు అండగా ఉండాలని, తద్వారా సైనికుల్లో ఆత్మ విశ్వాసం, వారి కుటుంబాల్లో భరోసా నింపాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. అమరులైన సైనికులకు కేంద్ర ప్రభుత్వం సాయంతోపాటు రాష్ట్రాలు కూడా సహాయ సహకారాలు అందించాలని, సింబల్ ఆఫ్ యూనిటీ ప్రదర్శించాలని కేసీఆర్ అన్నారు. కరోనాతో ఆర్థిక ఇబ్బుందులున్నాయని, అయితే, మిగతా ఖర్చులు తగ్గించుకునైనా సైనికుల సంక్షేమానికి పాటు పడాలని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడి నిర్వహించిన అఖిలపక్ష సమావేశం సందర్భంగా కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, సంతోష్ పార్థివ దేహాన్ని కేసీఆర్ సందర్శించలేదని, సంతోష్ కుటుంబాన్నికేసీఆర్ పరామర్శించలేదని విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేసీఆర్ చేసిన ప్రకటన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.