జ‌గ్గారెడ్డికి అధిష్ఠానం షాక్‌.. వాట్ నెక్ట్స్‌?

అంతా అనుకున్న‌ట్లే అయింది. టీ కాంగ్రెస్ లో వ‌ర్గ పోరు ముదిరి పాకాన ప‌డింది. విమ‌ర్శ‌లు.. ప్ర‌తి విమ‌ర్శ‌ల‌తో పార్టీ ప‌రువు బ‌జారున ప‌డింది. రేవంతుపై ఆది నుంచీ అసంతృప్తిగా ఉన్న సీనియ‌ర్ల‌కు పార్టీ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ముఖ్యంగా రేవంత్ అంటే అగ్గిమీద గుగ్గిలం అవుతున్న సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జ‌య‌ప్ర‌కాష్ రెడ్డికి అధిష్ఠానం జ‌ల‌క్ ఇచ్చింది. పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌వి.. పార్ల‌మెంటు ఇన్చార్జి బాధ్య‌త‌ల నుంచి తొల‌గించింది.

2014, 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడిపోయి చ‌తికిల‌పడ్డ తెలంగాణ కాంగ్రెస్ కు రేవంత్ బూస్ట్ ఇచ్చారు. వ‌రుస ఓట‌ముల‌తో నీరుగారిన శ్రేణుల‌కు రేవంత్ త‌న దూకుడుతో ఉత్సాహం ఇచ్చారు. క్ర‌మ‌క్ర‌మంగా పార్టీని బ‌లోపేతం చేస్తూ వ‌స్తున్నారు. ప‌ట్టాలు త‌ప్పిన బండిని ఇప్పుడిప్పుడే ఒక దారిలో పెడుతున్నారు. ఈ క్ర‌మంలో పార్టీలోని ఒక వ‌ర్గం.. ముఖ్యంగా సీనియ‌ర్లు వేరు కుంప‌టి న‌డిపిస్తూ రేవంత్ కాళ్ల‌లో క‌ట్టెలు పెడుతూ వ‌స్తున్నారు. అయినా, అధిష్ఠానానికి ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి రేవంత్ ఇవ‌న్నీ మౌనంగా భ‌రిస్తున్నారు.

శిశుపాలుడు కూడా వంద త‌ప్పులు చేసే వ‌ర‌కు ఎదురు చూసిన క్ర‌మంగా.. జ‌గ్గారెడ్డి వ్య‌వ‌హార శైలిని కూడా ఇన్నాళ్లూ గ‌మ‌నించిన అధిష్ఠానం నిన్న‌టి ఎపిసోడ్ తో ఆయ‌న‌పై వేటు వేసింది. పార్టీ ప‌ద‌వుల‌ను ఊడ‌బీకింది. పార్టీకి సంబంధించిన ముఖ్య‌మైన ప‌ద‌వుల్లో ఉండి.. పార్టీ బ‌లోపేతానికి కృషి చేయ‌క‌పోగా అధిష్ఠానం నిర్ణ‌యాన్నే వ్య‌తిరేకిస్తూ వ‌స్తున్నారు. పార్టీ కార్య‌క్ర‌మాల్లో అంటీముట్ట‌న‌ట్లు ఉంటున్నారు. త‌న నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో కేవ‌లం 2వేల స‌భ్య‌త్వాలే న‌మోదు చేయించడ‌మే ఇందుకు ఉదాహ‌ర‌ణ‌.

ప్ర‌త్యేక తెలంగాణ ఏర్ప‌డిన నాటి నుంచీ క్ర‌మంగా హ‌స్తం పార్టీని మింగుతూ వ‌స్తున్న కేసీఆర్ మొత్తానికే భూస్థాపితం చేయాల‌ని నిశ్చ‌యించుకున్నారు. పీసీసీ చీఫ్‌గా ఉన్న ఉత్త‌మ్ మెత‌క వైఖ‌రే దీనికి కార‌ణ‌మ‌ని ఆల‌స్యంగా గుర్తించిన అధిష్ఠానం వెంట‌నే న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఉత్త‌మ్ స్థానంలో యువ‌కుడు, టీడీపీ నుంచి వ‌చ్చిన‌ రేవంతుకు ప‌గ్గాలు అప్ప‌గించింది. అధిష్ఠానం నిర్ణ‌యాన్ని శిర‌సా వ‌హించిన రేవంత్ ప‌ది నెల‌ల నుంచీ పార్టీని ప‌రుగులు పెట్టిస్తున్నారు. వ‌రుస స‌భ‌ల‌తో యువ‌త‌లో ఉత్సాహం నింపుతున్నారు. ఒక్క హుజూరాబాద్ ఉప ఎన్నిక మిన‌హాయిస్తే రేవంత్ నియామ‌కం స‌బ‌బే అనే అధిష్ఠానానికి నివేదిక‌లు అందాయి.

రేవంత్ ప‌నితీరుపై అధిష్ఠానం సంతృప్తిగా ఉంది క‌నుక‌నే సీనియ‌ర్లు ఎంత అసంతృప్తి చేస్తున్నా.. పెద్ద‌ల‌కు ఫిర్యాదులు చేస్తున్నా లైట్ తీసుకుంటోంది. అయితే సీనియ‌ర్ల వ్య‌వ‌హార శైలి శృతి మించుతుండ‌డంతో స్వ‌యంగా అధిష్టాన‌మే రంగంలోకి దిగింది. ఓటుకు నోటు కేసులా పీసీసీ ప‌ద‌విని రేవంత్ కొనుక్కున్నాడ‌ని కోమ‌టి రెడ్డి ఆరోప‌ణ‌లు చేసిన ద‌గ్గ‌ర నుంచి అధిష్ఠానం అన్ని వివ‌రాలూ సేక‌రిస్తోంది.

కోమ‌టి రెడ్డి సోద‌రుడు రాజ‌గోపాల రెడ్డి, సీనియ‌ర్ నేతలు వీహెచ్‌, జ‌గ్గారెడ్డి త‌దిత‌రుల‌పై నిఘా వేసింది. ఎవ‌రు పార్టీకి న‌ష్టం చేస్తున్నారో గ‌మ‌నిస్తోంది. తొలుత జ‌గ్గారెడ్డి నుంచి మొద‌లు పెట్టింది. ఆయ‌న ప‌ద‌వుల‌ను తొల‌గించింది.  దీని ద్వారా మిగ‌తా అసంతృప్తుల‌కు గ‌ట్టి హెచ్చ‌రిక‌లు జారీ చేసిన‌ట్లైంది. ఇపుడు జ‌గ్గారెడ్డి పార్టీలోనే ఉంటారా.. ఎమ్మెల్యే ప‌ద‌వికి కూడా రాజీనామా చేసి ఇత‌ర పార్టీలో చేర‌తారా అనేది వేచి చూడాలి.