పోల‌వ‌రం లెక్క‌లు తీయండి.. కేంద్రం ఆదేశం: ఏపీకి మ‌రో ఇర‌కాటం

పోలవ‌రం ప్రాజెక్టు. అవునా..కాదా.. అన్న‌ట్టుగా ప‌నులు జ‌రుగుతున్న ఈ ప్రాజెక్టులో అంతో ఇంతో కొంత ప‌నులు పుంజుకుంటున్నాయ‌ని.. అంద‌రూ సంబ‌ర ప‌డుతున్న స‌మ‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం.. ఏపీని మ‌రో ఇర‌కాటంలోకి నెట్టేసింది. 2004లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు ప‌నుల‌కు సంబంధించి అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అంటే.. తొలిద‌శ వ‌ర‌కు ఎంత ఖ‌ర్చు చేశారు?  ఏం చేశారు? వంటి వివ‌రాల‌ను ఇవ్వాల‌ని… ఏపీ ప్ర‌భుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. దీంతో ఇప్పుడు ఈ విష‌యంపై స‌ర్వ‌త్రా అనేక సందేహాలు అలుముకున్నాయి.

విష‌యం.. ఇదీ..

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు వెచ్చించే విషయంలో కేంద్ర ప్రభుత్వం మ‌రో మెలిక పెట్టింది. ప్రాజెక్టు తొలిదశలో +41.15 మీటర్ల స్థాయిలో నీళ్లు నిల్వచేసి కుడి, ఎడమ కాలువలకు, ఆయకట్టుకు ఇవ్వాలంటే ఆ స్థాయి నిర్మాణానికి, పునరావాసానికి ఎంత ఖర్చవుతుందని మళ్లీ లెక్కలు అడుగుతోంది. అక్కడివరకు నీళ్లు ఇస్తే ఏ స్థాయి ప్రయోజనాలు కలుగుతాయో చెప్పాల‌ని కేంద్ర జలసంఘం గతంలోనే ఒక సమావేశం ఏర్పాటుచేసి వివరాలు కోరింది.

పోలవరం డ్యాంను +45.72 మీటర్ల స్థాయిలో నీటిని నిల్వ చేసేందుకు అనుగుణంగా ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జలసంఘం లెక్కలు కట్టించాయి. 2013-14 లెక్కల్లో కేంద్ర జలసంఘం అంచనాల ప్రకారం ఎంత? రివైజ్డు కాస్ట్‌ కమిటీ ప్రకారం ఎంతో కూడా లెక్క కట్టించారు. 2017-18 ధరల ప్రకారం ఆర్‌సీసీ రూ.47,725.74 కోట్లకు సిఫార్సు చేసింది. ఇది జరిగి రెండేళ్లు దాటింది. ఈ మొత్తానికి కేంద్రం పెట్టుబడి అనుమతి ఇచ్చి పనులను తొలిదశ, రెండో దశగా విడగొట్టి ఆ మేరకు నిధులు విడుదల చేస్తే సరిపోయేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అయితే.. ఇవ‌న్నీ ప‌క్క‌న పెట్టి.. ఇప్పుడు ప్రత్యేకంగా తొలిదశ పేరుతో మళ్లీ లెక్కలు కట్టాలని కోరుతోంది. 2014లో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకూ ఎప్పటికప్పుడు లెక్కలు కడుతున్నారు. అయిన‌ప్ప‌టికీ కేంద్రం దీన్ని కొలిక్కి తెచ్చి పెట్టుబడి అనుమతి ఇచ్చేందుకు అడుగు ముందుకు వేయలేదు. ఇప్పటికే ప్రాజెక్టులో అన్ని విభాగాలకు సంబంధించిన ఖర్చుల లెక్కలన్నీ పక్కాగా ఉన్నాయి.

పైగా పునరావాసంలో +41.15 మీటర్ల స్థాయికి నీళ్లు నిలిపితే ఎంత? ఆ తర్వాత +45.72 మీటర్ల స్థాయికి నీరు నిలిపితే ఎంత ఖర్చవుతుందో కూడా లెక్కలేశారు. ఆర్‌సీసీ ఆమోదించిన 2017-18 లెక్కల ఖర్చుకు పెట్టుబడి అనుమతి ఇచ్చి, నిధులు విడుదల చేస్తూ తొలిదశ, మలి దశగా విడగొట్టే అవకాశం ఉంది.  మ‌రి ఏం చేస్తారో చూడాలి.