వైసీపీ ప్ర‌భుత్వంలో ఆర్థిక అరాచ‌కం.. కేంద్రం వెల్ల‌డి

ఏపీలోని వైసీపీ ప్రభుత్వం ఆర్థిక అరాచ‌కానికి, అవకతవకలకు పాల్పడినట్లు కేంద్రం పేర్కొంది. ఆర్థిక నిబంధనలు, పద్ధతులను ఏపీ ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడినట్లుగా కాగ్‌ నిర్ధారించిందని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. ‘వైఎస్ఆర్‌ గృహవసతి’ ఖర్చును మూలధన వ్యయం కింద తప్పుగా చూపించారని పేర్కొంది.

2020 మార్చితో ముగిసిన ఏడాదికి సంబంధించి కాగ్ నివేదిక వెల్లడించింది. రాష్ట్ర విపత్తు నిధికి కేంద్ర వాటా కింద రూ.324.15 కోట్లు ఇచ్చినట్లు తెలిపింది. జాతీయ విపత్తు నిధి కింద రూ.570.91 కోట్లు ఏపీకి ఇచ్చామని కేంద్రం పేర్కొంది. ఏపీ ప్రభుత్వం రూ.1,100 కోట్ల విపత్తు నిధులను… రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ అగ్రికల్చర్ ఖాతాకు మళ్లించినట్లు కేంద్రం స్పష్టం చేసింది.

ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు మళ్లించారని తెలిపింది. అయితే ఆ రూ.1,100 కోట్లు పంట నష్టపోయిన రైతులకు అందకుండా… అగ్రికల్చరల్ డైరెక్టరేట్ కమిషనర్ ఖాతాకు బదిలీ అయ్యాయని వెల్లడించింది.

విపత్తు సాయానికి ఖర్చు చేసినట్లుగా ఏపీ ప్రభుత్వం చూపించి ద్రవ్య వినిమయ చట్టం ఉల్లంఘనకు పాల్పడినట్లు తెలిపింది. ఈ వ్యవహారం విపత్తు నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. అయితే రాష్ట్రం ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకున్నట్లు తెలిపిందని కేంద్రం పేర్కొంది. బడ్జెట్‌ మొదటి విడత సమావేశాల్లో 377 నిబంధన కింద తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు లేవనెత్తిన అంశాలకు కేంద్ర ఆర్థిక శాఖ రాతపూర్వకంగా తెలియజేసింది.