జ‌గ‌న్‌కు పూర్తి వ్య‌తిరేకంగా కేసీఆర్‌!

ఏపీ, తెలంగాణ ముఖ్య‌మంత్రులు జ‌గ‌న్‌, కేసీఆర్‌కు వ్య‌క్తిగ‌తంగా మంచి సంబంధాలే ఉన్నా రాజ‌కీయాలు, పాల‌న పరంగా అభిప్రాయ భేదాలున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే కొన్ని విష‌యాల్లో రెండు రాష్ట్రల ప్ర‌భుత్వాల మ‌ధ్య విభేదాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఇక పాల‌న విష‌యానికి వ‌స్తే కూడా ఇరు సీఎంల‌ది వేర్వేరు దారులు. తెలంగాణ‌కు అన్యాయం చేస్తున్న బీజేపీపై కేసీఆర్ పోరాటం చేస్తుంటే.. ఏపీకి ఏమీ ఇవ్వ‌ని కేంద్ర ప్ర‌భుత్వంపై జ‌గ‌న్ మాత్రం మౌనంగా ఉంటున్నారు. దీని వెన‌క ఎవ‌రి రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు వాళ్ల‌కున్నాయ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కానీ తాజాగా ఓ విష‌యంలో జ‌గ‌న్‌కూ పూర్తి వ్య‌తిరేకంగా కేసీఆర్ వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇక్క‌డ ఓకే..
ఏపీలో ఇప్పుడు కేబినేట్ విస్త‌ర‌ణ హాట్ టాపిక్‌గా మారింది. కేవ‌లం న‌లుగురు మంత్రుల‌ను మాత్ర‌మే కొన‌సాగించాల‌నుకుంటున్న జ‌గ‌న్‌.. మిగ‌తా వాళ్ల‌పై వేటు వేసేందుకు సిద్ధ‌మ‌య్యార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఉద్వాస‌న ప‌లికిన మంత్రుల స్థానంలో కొత్త‌వాళ్ల‌కు అవ‌కాశం ఇచ్చేదుకు జ‌గ‌న్ సిద్ధ‌మ‌య్యారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు వైసీపీ నేత‌ల మ‌ధ్య మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు సంబంధించిన చ‌ర్చ‌లే జోరుగా న‌డుస్తున్నాయి. కొత్త కేబినేట్‌తో వ‌చ్చే ఎన్నిక‌ల‌కు వెళ్ల‌నున్న‌ట్లు జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు.

అక్క‌డ నో..
ఇక తెలంగాణ‌లో మాత్రం మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు కేసీఆర్ నో అంటున్నార‌ని స‌మాచారం. ఏడాదికి ముందు మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఉంటుంద‌నేలా మాట్లాడిన కేసీఆర్ ఇప్పుడు దాని జోలికి వెళ్లాల‌నుకోవ‌డం లేద‌ని తెలిసింది. షెడ్యూల్ ప్ర‌కారం వ‌చ్చే ఏడాది చివ‌ర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. అయితే ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు మ‌రోసారి వెళ్లే అవ‌కాశం ఉండ‌డంతో ఇప్పుడు మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ చేయ‌కూడ‌ద‌ని కేసీఆర్ నిర్ణ‌యించిన‌ట్లు టాక్‌.

ఈ స‌మ‌యంలో విస్త‌ర‌ణ చేపడితే అసంతృప్తులు మ‌రింత పెరిగే అవ‌కాశ‌ముంది. అందుకే ఈ స‌మ‌యంలో ప్ర‌యోగాలు చేయ‌డం మంచిది కాద‌ని కేసీఆర్ భావిస్తున్నార‌ని గులాబి వ‌ర్గాలు చెబుతున్నాయి. ప్ర‌స్తుతం ఉన్న కేబినేట్‌తోనే ఆయ‌న ఎన్నిక‌లు వెళ్లే అవ‌కాశాలున్నాయి. మ‌రోవైపు మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ చేస్తే గ‌వ‌ర్న‌ర్‌ను ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఆ కార‌ణంతోనూ కేసీఆర్ వెన‌క్కి త‌గ్గార‌ని చెబుతున్నారు. అందుకే మంత్రిగా చేస్తార‌ని భావించిన ఎమ్మెల్సీ బండ ప్ర‌కాష్‌ను మండ‌లి డిప్యూటీ ఛైర్మ‌న్‌గా నియ‌మించేందుకు కేసీఆర్ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిసింది.