యాంటీ చైనా.. ఉద్యమం ఊపందుకుంటోంది

మన దేశం ఇప్పుడు కరోనాతో ఇలా అల్లాడుతుండటానికి కారణం చైనా. పాకిస్థాన్ ఉగ్రవాదులు సరిహద్దుల్లో ఎప్పటికప్పుడు చెలరేగిపోతూ ఉండటానికి పరోక్ష కారణమూ చైనానే. ఇవి చాలవన్నట్లు ఇప్పుడు భారత భూభాగంలో అక్రమంగా అడుగుపెట్టి దాన్ని ఆక్రమించే దుస్సాహసానికి దిగుతోంది చైనా. సంబంధిత ఘర్షణల్లో భాగంగానే 20 మంది భారత సైనికులు హతమయ్యారు.

మన దేశానికి ఇంత పెద్ద శత్రువుగా మారిన చైనాకు ఆ దేశం అవతల అత్యధిక ఆదాయం అందించే దేశం ఇండియానే అన్నది బహిరంగ రహస్యం. మనం వాడే ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో మెజారిటీ చైనా సంస్థలవే. మన యాప్స్‌లో దాదాపు అన్నీ అక్కడ తయారైనవే. ఇంకా మన దేశంలో కార్పొరేట్ రంగాన్ని ఏలుతున్న అనేక సంస్థల్లో చైనా భాగస్వామ్యం ఉంది. ఇంకా అనేక దిగుమతుల్లో చైనాపై ఆధారపడి ఉన్నాం.

చైనా ఉత్పత్తులు కొని మన కంటిని మనమే పొడుచుకుంటున్నామనే విశ్లేషణను నిపుణులు ఎప్పట్నుంచో చేస్తున్నారు. దీన్ని తగ్గించుకోవాలని సూచిస్తున్నా మనం వినిపించుకోలేదు. కానీ ఇప్పుడు సరిహద్దుల్లో పరిస్థితులు చూశాక అయినా మనం మారక తప్పదు. చైనాతో దౌత్య సంబంధాలకు తోడు అనేక రకాలుగా ఆధారపడి ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి ప్రకటన చేయదు.

జనాలే అవగాహన తెచ్చుకుని చైనా ఉత్పత్తుల వాడకం తగ్గించాలి. యాప్ప్ ద్వారా మన సమాచారం వాళ్లకు వెళ్లకుండా చూడాలి. ఇంతకుముందు ఈ విషయాన్ని లైట్ తీసుకున్న జనాలు.. ఈ మధ్య అప్రమత్తం అవుతున్నారు. రిమూవ్ చైనా యాప్ప్ పేరుతో ఒక యాప్‌ను భారతీయులే తయారు చేయగా.. దాని ద్వారా చాలామంది చైనా యాప్స్‌ను డెలీట్ చేశారు. కానీ గూగుల్ ఆ యాప్‌ను తొలగించింది. అయినప్పటికీ స్వచ్ఛందంగా జనాలు చైనా యాప్స్‌ను వెతికి వెతికి తీసేస్తున్నారు.

ఏకంగా కేంద్ర మంత్రులే చైనా ఉత్పత్తులు కొనకండి, వాళ్ల యాప్స్ వాడకండి అంటున్న నేపథ్యంలో మీడియా సంస్థలు కూడా దీనిపై ఉద్యమం మొదలుపెట్టాయి. సోషల్ మీడియాలోనూ ఉద్యమం చురుగ్గానే సాగుతోంది. ఈ నేపథ్యంలో చైనాకు ఈసారి సెగ గట్టిగానే తాకేలా కనిపిస్తోంది.