PK : గాయాలు.. దాడులు.. హ‌త్య కుట్ర‌లు

2019 ఎన్నిక‌ల‌కు ముందు ఏపీలో జ‌గ‌న్‌పై కోడి క‌త్తితో ఎటాక్‌.. గ‌తేడాది ప‌శ్చిమ బెంగాల్‌లో ఎన్నిక‌ల‌కు ముందు సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ కాలికి క‌ట్టు.. ఇప్పుడు తెలంగాణ‌లో ఎన్నిక‌ల వేడి రాజుకుంటున్న స‌మ‌యంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై హ‌త్య కుట్ర కేసు.. ఈ మూడు విష‌యాలు వేరు. వేర్వేరు రాష్ట్రాల్లో ఇవి జ‌రిగాయి. కానీ వీటి వెన‌క ఓ వ్య‌క్తి ఉన్నార‌నే ఊహాగానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

త‌న‌ను న‌మ్ముకున్న పార్టీల‌ను గెలిపించ‌డం కోసం ఎంత‌కైనా తెగించే ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ కుతంత్రాలే ఇవ‌న్నీ అని కాంగ్రెస్, బీజేపీ నాయ‌కులు విమ‌ర్శిస్తున్నారు. ప్ర‌శాంత్ కిషోర్ ఎంట్రీ ఇచ్చారంటే చాలు ఇక పార్టీ గెలిచిన‌ట్లే అనేలా ప‌రిస్థితులు మారిపోయాయి. ఆయ‌న ప్ర‌భావం అలా పెరిగిపోయింది. అప్ప‌టివ‌ర‌కూ ప్ర‌జ‌ల్లో పార్టీపై వ్య‌తిరేక‌త ఉన్నా త‌న వ్యూహాల‌తో ఆయ‌న అదంతా మార్చేస్తార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

కులాల‌ను రెచ్చ‌గొట్ట‌డం, ప్రాంతీయ భావాల‌ను ప్రేరేపించ‌డం, త‌ను స‌పోర్ట్ చేసే పార్టీ నేత‌ల‌పై దాడుల నాట‌కం ఆడ‌డం.. ఇవే పీకే కుతంత్రాలు అనే విమ‌ర్శ‌లూ వినిపిస్తున్నాయి. తాజాగా తెలంగాణ‌లో టీఆర్ఎస్ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై హ‌త్య కుట్ర కేసే అందుకు నిద‌ర్శ‌న‌మ‌ని ప్ర‌త్య‌ర్థి పార్టీలు ఆరోపిస్తున్నాయి. దీన్ని అడ్డుపెట్టుకుని ప్ర‌జ‌ల సానుభూతి పొందాల‌ని టీఆర్ఎస్ భావిస్తుంద‌ని అందుకే ఇందులోకి బీజేపీ నేత‌ల‌ను లాగుతుంద‌ని  కాషాయ ద‌ళం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది.

పీకేను న‌మ్ముకున్న టీఆర్ఎస్ ఆయ‌న్ని రంగంలోకి దించ‌డంతోనే ఈ ప‌రిస్థితులు ఏర్ప‌డుతున్నాయ‌ని కాంగ్రెస్‌, బీజేపీ మండిప‌డుతున్నాయి. ఓట‌మి భ‌యంతోనే పీకేను కేసీఆర్ తెచ్చుకున్నార‌ని ధ్వ‌జ‌మెత్తుతున్నాయి. మ‌రోవైపు 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీని గెలిపించే బాధ్య‌త తీసుకున్న పీకే దాన్ని స‌మ‌ర్థంగా పూర్తి చేశాడు. అయితే ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్‌పై విమానాశ్ర‌యంలో కోడి క‌త్తి దాడి అనేది పీకే స్కెచ్‌లో భాగ‌మేన‌న్న ఆరోప‌ణ‌లు జోరుగా వినిపించాయి. ఇక ప‌శ్చిమ బెంగాల్‌లో గ‌తేడాది ఎన్నిక‌ల‌కు ముందు మ‌మ‌తా బెన‌ర్జీకి కాలికి గాయ‌మైంది. కొంత‌మంది త‌న‌పై దాడి చేశార‌ని అందుకే గాయ‌మైంద‌ని ఆమె పేర్కొన్నారు. వీల్‌చెయిర్‌లో కూర్చునే ఎన్నిక‌ల ప్ర‌చారం చేశారు. అప్పుడు కూడా దీదీకి పీకే స‌పోర్ట్ చేశారు. ఇలా పీకే రంగంలోకి దిగితే ఏదో ఒక‌టి జ‌రుగుతుంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.