జగన్ కు ఆర్ ఆర్ ఆర్ ప్లస్సా? మైనస్సా?

రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సర్వ సాధారణం. అధికారంలో ఉన్న పార్టీకి చెందిన నేతలను విపక్ష పార్టీకి చెందిన నేతలు విమర్శించడం సహజం. వాటికి కౌంటర్ గా అధికార పక్షం నుంచి ప్రతి విమర్శలు….సవాళ్లు కామన్. ఇక, అధికారంలో ఉన్నా…ప్రతిపక్షంలో ఉన్నా….సొంతపార్టీపైనే సునిశిత విమర్శలు చేసే నేతలను సస్పెండ్ చేయడం ఏ పార్టీలోనైనా జరిగే తంతే.

అయితే, ఓ వైపు సొంత పార్టీని విమర్శిస్తూ…మరో వైపు పొగడ్తలు గుప్పిస్తూ…పార్టీ అధిష్టానానికి కొరకరాని కొయ్యగా మారాడో నేత. ఓ వైపు సీఎం జగన్ పై విమర్శలు గుప్పిస్తూనే…మరో వైపు 30 ఏళ్లు ఆయనే సీఎం అంటూ పొగడ్తలు గుప్పిస్తున్నాడా నేత. దీంతో, సొంతపార్టీపైనే ఈ తరహా ధోరణి అవలంబిస్తోన్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం ఇపుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.

జగన్ పై రఘురామకృష్ణంరాజు కురిపిస్తోన్న ప్రశంసలు వినసొంపుగా ఉన్నా….జగన్ ఇమేజ్, పార్టీ ఇమేజ్ కు డ్యామేజ్ కలిగేలా చేస్తోన్న విమర్శలు కర్ణ కఠోరంగా ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పేదలందరికీ ఇళ్లు కట్టించి ఇవ్వాలని సీఎం జగనన్న ఇళ్ల పథకం పెడితే ఫ్లాట్లకు రేటు ఫిక్స్ చేసి సొంతపార్టీ నేతలే వసూళ్లు చేస్తున్నారని రఘురామకృష్ణంరాజు విమర్శించారు. ఇసుక విధానానికి నిరసనగా వైసీపీ ఎమ్మెల్యేలెవరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేదని, సీఎంకు చెప్పే అవకాశం లేకే మీడియా ద్వారా తమ అభిప్రాయాలు వెల్లడించాల్సి వచ్చిందని చెప్పారు.

వైసీపీ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడినా జగన్ సహించరని, తోలు తీస్తారని అన్నారు. వైఎస్ అంటే తనకు అత్యంత అభిమానమన్న రఘురాముడు…జగన్ అంటే కూడా ఇష్టమని…రాబోయే మూడు టర్మ్ లు ఆయనే సీఎం అని ఆకాశానికెత్తేశారు. ఇవన్నీ జగన్ పై ఆయన కురిపించిన ప్రశంసల జల్లు తాలూకు జాబితా.

వైసీపీ వాళ్లు కాళ్లావేళ్లాపడి బతిమిలాడితేనే నరసాపురం నుంచి పోటీ చేశా…అది టీడీపీ కంచుకోట…. అక్కడ జగన్ బొమ్మతో గెలవలేదు…నా ఇమేజ్ తో గెలిచా…అంతేకాదు …చాలా మంది ఎమ్మెల్యేల గెలుపునకు నేనే కారణం…జగన్ దయతో పార్లమెంటు స్టాండింగ్ చైర్మన్ కాలేదు…. మోడీ దయతో స్పీకర్ గారు ప్రత్యేక కోటా కింద ఇచ్చారు..అంటూ వైసీపీపై ఘాటు విమర్శలు చేసింది కూడా ఇదే రఘురామకృష్ణం రాజు.

అంతేకాదు, తనను రాజీనామా చేయాలంటున్న వైసీపీ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తే, ఎవరు ఎవరి బొమ్మతో గెలుస్తారో చూద్దాం అంటూ సవాల్ విసిరారు రఘురాముడు. ఇసుక పంపిణీ, ఇళ్ల స్థలాల పంపిణీలో అవినీతి జరుగుతోందని, సీఎం చుట్టూ ఉన్న కోటరీ ఎవరికీ అపాయింట్‌మెంట్లు ఇవ్వడం లేదని షాకింగ్ కామెంట్స్ చేశారు.

జగన్ పై రఘురామకృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయని ఇట్టే తెలిసిపోతుంది. ఓ వైపు జగన్ ను పొగుడుతూనే…మరో వైపు జగన్ కు, పార్టీ ఇమేజ్ కు డ్యామేజ్ అయ్యేలా కామెంట్స్ చేస్తున్నారు రఘురాముడు. 30 ఏళ్లు జగన్ సీఎంగా ఉండాలని కోరుకుంటున్న వ్యక్తి….తన కామెంట్స్ వల్ల పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతోందని గుర్తించలేకపోతున్నారు. తన వ్యవహార శైలి వల్ల జగన్ 30 ఏళ్లపాటు ముఖ్యమంత్రి కావాలనే కల నెరవేరదని ఆయన గమనించలేకున్నారు.

జగన్ వల్ల తాను గెలవలేదని చెప్పే రఘురామకృష్ణం రాజు…తన బలంతోనే గెలిచానంటారు. మరో 30 ఏళ్లు సీఎం అయ్యే కెపాసిటీ జగన్ కు ఉందని చెబుతూనే…..జగన్ వల్ల తాను గెలవలేదంటే ఎలా? తన సొంతపార్టీపైనే విమర్శలు గుప్పిస్తూ…తన పార్టీనే మరో 3దఫాలు అధికారంలో ఉండాలని ఎలా కోరుకుంటున్నారు? ఇటువంటి ద్వంద్వ ప్రమాణాలతో కూడిన విమర్శల వల్ల రఘురామకృష్ణం రాజు ఏం చెప్పదలుచుకున్నారు? 30 ఏళ్లు జగన్ సీఎంగా ఉండాలని కోరుకునే రఘురామకృష్ణం రాజు…ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ఆ కల నెరవేరదని గమనించకపోవడం ఏమిటని రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ రోజు వైసీపీపై ఈ తరహాలో విమర్శలు చేసిన ఈ ఎంపీ…మరో పార్టీలో చేరినా….ఇదే తరహాలో విమర్శలు గుప్పిస్తారనే ముద్ర పడుతుందని అంటున్నారు. ఏది ఏమైనా…పార్టీలో కొనసాగుతూ ఇటువంటి విమర్శలు చేయడం వల్ల ఇటు పార్టీ ఇమేజ్, అటు జగన్ ఇమేజ్, రఘు రామ కృష్ణం రాజు ఇమేజ్ డ్యామేజ్ అవుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.