రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికలో కీలకం ఈ లెక్కలేనా?

అనూహ్యమైన ఎత్తులు వేయడం మోడీకి అలవాటే. మరో ఏడాదిలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో మోడీ పరివారం డిసైడ్ చేసే రాష్ట్రపతి అభ్యర్థి కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ గా ప్రకటిస్తారన్న మాట వినిపిస్తోంది. ఎందుకిలా? అన్నప్పుడు మోడీకి ముస్లిం మైనార్టీలంటే మంట.. ఆయన వారిని ద్వేషిస్తారన్న బ్రాండ్ ఇమేజ్ ఉంది. దాన్ని పోగొట్టుకునే క్రమంలోనే ఈ నిర్ణయమని చెబుతున్నా.. అసలు కారణం మాత్రం ‘లెక్కలే’ అని చెప్పాలి. ఎందుకంటే.. మిగిలిన మాటలు ఎలా ఉన్నా.. ఎన్నికల్లో విజేత ఎవరన్నది తేల్చేది అంకెలే. ఈ అంకెల విషయంలో మోడీ పరివారం వెనుకబడి ఉండటంతో.. సేఫ్ గేమ్ లో భాగంగా ఈ సర్ ప్రైజ్ అభ్యర్థిని తెర మీదకు తీసుకురావాలన్న వ్యూహంలో ఉన్నట్లు చెబుతున్నారు. అదెలాగో చూద్దాం…

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎమ్మెల్యే.. ఎంపీలు వేసే ఓట్లను లెక్క వేయటం ద్వారా రాష్ట్రపతిగా ఎవరు ఎన్నికయ్యారన్నది తేలుస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రపతి అభ్యర్థిగా ఏకాభిప్రాయంతో ఏకగ్రీవంగా ఎంపిక చేసే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో పోటీ ఖాయమనుకుంటే.. బీజేపీ దాని మిత్రపక్షాలకు ఉన్న ఓట్లు.. విపక్షాలకు ఉన్న ఓట్లను లెక్కను చూస్తే.. విషయం ఇట్టే అర్థమైపోతుందని చెబుతారు. గత ఎన్నికల్లో రాంనాథ్ కోవింద్ కు 7.02 లక్షల ఓట్లు వచ్చాయి. అప్పట్లో విపక్షాల అభ్యర్థిగా బరిలోకి దిగిన మీరా కుమార్ కు 3.67లక్షల ఓట్లు వచ్చాయి.

నాడు కోవింద్ ను బలపరిచిన పార్టీల్లో బీజేపీతో పాటు అన్నాడీఎంకే.. జేడీయూ.. బీజేడీ.. టీఆర్ఎస్.. టీడీపీ.. వైసీపీ.. శివసేన.. అకాలీదళ్ తో పాటు పలు ప్రాంతీయ పార్టీలు కోవింద్ కు మద్దతు ఇవ్వటం తెలిసిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి ఉన్న మిత్రపక్షాలు చాలా తక్కువ. వాటికున్న ఓట్లు మొత్తాన్ని లెక్కిస్తే 4.74 లక్షల ఓట్లు మాత్రమే కనిపిస్తాయి. రాష్ట్రపతిగా ఎంపిక కావాలంటే మినిమం 5.49 లక్షల ఓట్లు కావాలి. అంటే.. దాదాపు 80 వేల ఓట్లు తక్కువ కానున్నాయి. గతంలో మాదిరి బీజేపీకి మిత్రుల అండ లేదు.
గతంలో టీడీపీ.. శివసేన తదితర పార్టీలు ఉండేవి. ఇప్పుడు అలాంటిదేమీ లేదు. మరో కీలక విషయం ఏమంటే.. యూపీ ఎన్నికల్లో గతంలో మాదిరి బీజేపీకి మెజార్టీ వచ్చేది లేదు.

తేడా వస్తే ఓడిపోయినా ఆశ్చర్యం లేదంటున్నారు. మొత్తంగా గతంలో ఉన్నంత మంది ఎమ్మెల్యేల బలమైతే కచ్చితంగా ఉండదని ఖాయంగా చెబుతున్నారు. అదే జరిగితే.. యూపీలో బీజేపీ ఓట్లు తగ్గుతాయి. అంటే.. తాము బరిలోకి దింపే రాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించుకోవటానికి మరిన్ని ఓట్లు అవసరమవుతాయి. ఈ లెక్కల్ని పరిగణలోకి తీసుకొని.. విపక్షాలు విస్తుపోయేలా.. మైనార్టీల మనసుల్ని అంతో ఇంతో దోచుకునేలా చేయటానికి గులాం నబీ ఆజాద్ కు మించిన అభ్యర్థి మరొకరు ఉండరని చెప్పాలి.

రాష్ట్రపతి ఎన్నికల్లో కీలకమైన ఎలక్టోరల్ కాలేజీ కింద ఎమ్మెల్యే ఓటు విలువ 208 అయితే.. ఎంపీ ఓటు విలువ 708గా లెక్కిస్తారు. ఈ లెక్కన చూసినప్పుడు బీజేపీకి ఇప్పుడున్న ఎమ్మెల్యేలు.. ఎంపీల లెక్కతో పోలిస్తే.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత తగ్గే అవకాశం ఉందంటున్నారు. ఈ కోణంలో చూసినప్పుడు గులాం నబీ ఆజాద్ కు మించిన మంచి ఆప్షన్ మరొకటి ఉండదు. అజాద్ కు వివిధ పార్టీలతో మంచి అనుబంధం ఉంది. ఉదాహరణకు టీఆర్ఎస్ ను తీసుకుంటే.. అజాద్ కు కేసీఆర్ తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయనే రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దిగితే.. ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న శివసేన కానీ ఎన్సీపీ కానీ.. ఆఖరకు వైసీపీ, టీడీపీకి కానీ కిమ్మనలేవు. అందుకే.. అందరికి ఆమోదయోగ్యమైన అభ్యర్థిగా ఉండే అజాద్ ను బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దించితే.. మరో ఆలోచన లేకుండా ఆయన ఎన్నికల్లో గెలవడం.. రాష్ట్రపతి టాస్కును విజయవంతంగా ముగించిన క్రెడిట్ మోడీకి దక్కుతుంది. అందుకే.. ఆయన్ను అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.