సినిమాల‌పై ఆధిప‌త్యమా?: ప్ర‌కాశ్ రాజ్ ఫైర్‌

సినీ రంగంపై ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరునుబ‌హుభాషా నటుడు ప్రకాశ్‌రాజ్ ఎండ‌గ‌ట్టారు. దీనిపై ఆయ‌న ఘాటుగా స్పందించారు. సృజన.. సాంకేతికత మేళవించిన రంగం సినిమా అన్నారు. సినీరంగంపై అధికార దుర్వినియోగం, ఆధిపత్య ధోరణి ఏంటి? అని ప్రశ్నించారు. చిత్ర పరిశ్రమను క్షోభపెడుతూ ప్రోత్సహిస్తున్నామంటే నమ్మాలా? అని నిలదీశారు. ఏవైనా ఉంటే రాజకీయ క్షేత్రంలో చూసుకోవాలి.. కానీ కక్ష సాధింపులు బాక్సాఫీస్‌ వద్ద ఎందుకు..? అని ట్వీట్ చేశారు. ఎంత ఇబ్బందిపెట్టినా ప్రేక్షకుల ఆదరాభిమానాలకు అడ్డుకట్ట వేయలేరని హితవు పలికారు.

మ‌రోవైపు.. వైసీపీ నాయ‌కుడు, న‌టుడు పృథ్వీరాజ్ కూడా భీమ్లాపై స్పందించారు. ఈ సంద‌ర్భంగా పృథ్వీరాజ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ సినిమాను వీక్షించిన ఆయన ఓ ఛానల్‌తో మాట్లాడారు. సినిమా తనకు ఎంతో బాగా నచ్చిందని.. ప‌వన్‌కల్యాణ్‌కు దిష్టి తగలకూడదని అన్నారు. “రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు, పవన్‌కల్యాణ్‌ అభిమానులకు నా అభినందనలు.

ఇటీవలే నేను ‘భీమ్లానాయక్‌’ చిత్రాన్ని చూశాను. నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా ‘అడవి రాముడు’. ఆ సినిమా విడుదలైనప్పుడు మా తాడేపల్లిగూడెంలోని విజయాటాకీస్‌కు వెళ్తే.. భారీగా తరలివచ్చిన అభిమానుల్ని కంట్రోల్‌ చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు“ అన్నారు.

 ఎన్టీఆర్‌ తర్వాత ఆ క్రేజ్‌ పవర్‌స్టార్‌కే చూశాన‌న్నారు. “క్లైమాక్స్‌, పవర్‌స్టార్‌, రానా కాంబోలో వచ్చిన సన్నివేశాలు గొప్పగా ఉన్నాయి. ఒక ప్రేక్షకుడిలా ఈ చిత్రాన్ని ఫుల్‌ ఎంజాయ్‌ చేశా. ఈ సినిమా చూస్తున్నంతసేపు, ఒక రకమైన బాధలో ఉండిపోయాను. ఇంత అద్భుతమైన చిత్రంలో నేను నటించలేకపోయానే అని విచారంగా ఉంది. చాలా రోజుల తర్వాత పవన్‌కల్యాణ్‌ని ఇలాంటి పాత్రలో చూసి అందరి దిష్టి తగిలి ఉంటుంది. ఆయనకు అది తగలకూడదని కోరుకుంటున్నా” అని పృథ్వీరాజ్‌ అన్నారు.