టీఆర్ఎస్ ఖాళీ.. వాళ్లంతా బీజేపీలోకి!

తెలంగాణ‌లో టీఆర్ఎస్ వ‌ర్సెస్ బీజేపీ అన్న‌ట్లుగా రాజ‌కీయం మారిపోయిన సంగతి ప్ర‌త్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు. తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల గురించి ప్ర‌వ‌చించ‌డం ఓ వైపు, రాష్ట్రంలో బ‌ల‌ప‌డాల‌ని బీజేపీ ప్ర‌య‌త్నిస్తుండ‌టంతో పొలిటిక‌ల్ హీట్ తారాస్థాయికి చేరిపోయింది. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ ప‌రిస్థితి ఏంట‌నే టాక్ వినిపిస్తోంది. అయితే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర  వ్య‌వ‌హారాల ఇంచార్జీ మ‌ణిక్కం ఠాగూర్ తాజాగా చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌కు తెర‌లేపాయి. త్వ‌ర‌లో టీఆర్ఎస్ పార్టీ ఖాళీ కానుంద‌ని చెప్పిన ఠాగూర్ ఆ నేత‌లంతా బీజేపీ వైపు చూస్తున్నార‌ని కామెంట్ చేయ‌డం గ‌మ‌నార్హం.

తెలంగాణలోని ప‌రిణామాల‌పై కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బంగారు తెలంగాణ ఫలాలు ఎక్కడా కనిపించడం లేదన్నారు. కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారం అయిందని ఆయన విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం కరోనాతో సహా అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. వచ్చే ఎన్నికలలో టీఆర్ఎస్ ఘోరపరాజయం పొందుతుందని కేసీఆర్ కి కూడా తెలుసని కాంగ్రెస్ ఇంచార్జీ కామెంట్ చేశారు.

రాష్ట్రంలో పడిపోతున్న తన గ్రాఫ్ ను రక్షించుకునేందుకే కేసీఆర్ ఫ్రంట్ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ కలలుగంటున్న  ఫ్రంట్ ఎప్పటికీ కార్యరూపం దాల్చదని ఠాగూర్ జోస్యం చెప్పారు. కేసీఆర్ దేశవ్యాప్తంగా ఎవరెవర్ని కలుస్తున్నారో ఆ నేతలందరూ తమ జాతీయనేత రాహుల్ గాంధీ తో టచ్ లో ఉన్నారని కీల‌క కామెంట్లు చేశారు. జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కొనే సత్తా కేవలం కాంగ్రేస్ కు మాత్రమే ఉందన్నారు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా ప్రజలు కాంగ్రేస్ ను కోరుకుంటున్నారన్నారు.

కేసీఆర్ అవినీతి, అక్రమాల చిట్టా మొత్తం కేంద్రం వద్ద ఉందని మ‌ణిక్కం ఠాగూర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తన పార్టీనే రక్షించుకోలేని పరిస్థితుల్లో కేసీఆర్ ఉన్నారని ఠాగూర్ ఆరోపించారు. త్వరలో టీఆర్ఎస్ ఖాళీ కాబోతోందని తెలిపిన ఠాగూర్‌ టీఆర్ఎస్‌కు చెందిన చాలామంది తొందర్లోనే బీజేపీలో చేరనున్నట్లు సమాచారముందని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమ‌ర్శ‌లు బాగానే ఉంది కానీ ఆ పార్టీ బ‌ల‌హీన‌ప‌డితే తాము బ‌ల‌ప‌డ‌తామ‌ని చెప్పాల్సింది పోయి ప్ర‌తిప‌క్ష పార్టీకి మేలు జ‌రుగుతుంద‌ని కామెంట్ చేయ‌డం ఏంట‌నే టాక్ వినిపిస్తోంది.