ఎవ‌రేమ‌న్నా.. రేవంత్ త‌గ్గేదేలే!

ఓ వైపు పార్టీలోని సీనియ‌ర్ నేత‌ల నుంచి అసంతృప్తి.. మ‌రోవైపు బీజేపీ దూకుడుతో రేసులో వెన‌క‌బ‌డిపోతున్నామ‌నే వ్యాఖ్య‌లు.. ఇక ఆ పార్టీ పుంజుకోవ‌డం క‌ష్ట‌మేన‌న్న అంచ‌నాలు.. ఇలా అన్ని వైపుల నుంచి స‌మ‌స్య‌లు చుట్టుముడుతున్నా తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి మాత్ర‌మే త‌గ్గేదేలే అన్న‌ట్లు ముందుకు సాగుతున్నారు. పార్టీలో అంత‌ర్గ‌త విభేదాలు పెరుగుతున్నా.. రాజీనామా చేస్తామంటూ సీనియ‌ర్ నేత‌లు చెబుతున్నా.. వాటిని ప‌క్క‌కు పెట్టి పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డం కోసం రేవంత్ కార్య‌చ‌ర‌ణ సిద్ధం చేశారు.

తెలంగాణ గ్రామాల్లోని స్థానిక స‌మ‌స్య‌ల‌పై పోరాటం కోసం మ‌న ఊరు- మ‌న పోరు పేరుతో బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హించాల‌ని కాంగ్రెస్ నిర్ణ‌యించింది. ఈ నెల 26 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్య‌క్ర‌మాన్ని మొద‌లెట్ట‌నున్నారు. దీనిపై చ‌ర్చించేందుకు రేవంత్‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న పీసీసీ కార్య‌వ‌ర్గ స‌మావేశం జ‌రిగింది. మ‌న ఊరు- మ‌న పోరులో భాగంగా ప‌రిగి, వేముల‌వాడ, కొల్లాపూర్‌ల‌లో స‌భ‌ల ఏర్పాటుపై చ‌ర్చించారు. త్వ‌ర‌లో ప్రారంభం కానున్న అసెంబ్లీ, పార్ల‌మెంట్ స‌మావేశాల్లో ప్ర‌భుత్వాల ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై పోరాటాల రూప‌క‌ల్పన గురించి కూడా ఈ కార్య‌వ‌ర్గ స‌మావేశంలో మాట్లాడారు.  కేసీఆర్ కుటుంబ అవినీతిని సామాజిక మాధ్య‌మాల ద్వారా ఎండ‌గ‌ట్టాల‌ని పిలుపునిచ్చారు.

ప్ర‌స్తుతం రాష్ట్రంలో టీఆర్ఎస్ కాకుండా అధికారంలోకి వ‌చ్చేందుకు కాంగ్రెస్ అవ‌స‌ర‌మైన ప‌రిస్థితులు ఉన్నాయ‌ని విశ్లేష‌కులు అంటున్నారు. కానీ వాటిని కాంగ్రెస్ పార్టీ స‌ద్వినియోగం చేసుకోవ‌డం లేద‌న్న వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. అందుకే మ‌రోవైపు బీజేపీ రేసులో దూసుకుపోతుంద‌ని అంటున్నారు. కేసీఆర్ కూడా కాంగ్రెస్‌ను దెబ్బ కొట్టేందుకు బీజేపీపై విమ‌ర్శ‌లు చేస్తూ ఆ పార్టీకి హైప్ క‌లిగిస్తున్నార‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో క్షేత్ర‌స్థాయిలో బ‌ల‌మైన క్యాడ‌ర్ క‌లిగి ఉన్న కాంగ్రెస్ తిరిగి పుంజుకునే దిశ‌గా సాగాల్సి ఉంది. దానిపైనే రేవంత్ దృష్టి పెట్టిన‌ట్లు తెలుస్తోంది.

టీపీసీసీ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేపట్టిన‌ప్ప‌టి నుంచి పార్టీలోని కొంత‌మంది సీనియ‌ర్ల నుంచి అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతున్నా రేవంత్ త‌న‌దైన దూకుడుతో ముందుకు సాగుతున్నారు. పైగా ఆయ‌న‌కు అధిష్ఠానం అండ కూడా ఉంది. ఇప్పుడు పార్టీకి రాజీనామా చేస్తాన‌ని ప్ర‌క‌టించిన జ‌గ్గారెడ్డి కూడా రేవంత్‌పైనే విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు మ‌రింత జోరు ప్ర‌ద‌ర్శించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని భావించిన రేవంత్ పార్టీ ప‌ర‌మైన కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచాల‌ని నిర్ణ‌యించారు.