ప్రశాంత్ కిశోర్ ఉచ్చులో చిక్కుకోనిది జగన్ ఒక్కడే

ఒకప్పుడు మోదీ కోసం పనిచేసి, ఆ తరువాత మోదీకి బద్ధ విరోధిగా మారిపోయిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మాయలో పడుతున్న ప్రాంతీయ పార్టీల నేతల లిస్టులో తాజాగా కేసీఆర్ కూడా చేరిపోయారు. తనకున్న మోదీ, బీజేపీ వ్యతిరేక భావజాలాన్ని తన క్లయింట్ పార్టీలకు ఎక్కిస్తారని ప్రశాంత్ కిశోర్‌కు పేరు. దీంతో ఎంతోకొంత మోదీ, బీజేపీ వ్యతిరేకత ఉన్న నేతలు ప్రశాంత్ కిశోర్ ప్రభావంలో పడి మోదీతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. నేతలెవరైనా తన ప్రభావానికి లోనుకాకుంటే ప్రశాంత్ కిశోర్ వారికి దూరమవుతున్నారు. అయితే…. అలా ప్రశాంత్ కిశోర్ ప్రభావంలో పడకుండా, అలా అని ఆయనకు దూరం కాకుండా రెండు పడవల మీద కాళ్లేసి ఎంచక్కా సాగిపోతున్న రాజకీయ నావికుడు మాత్రం ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ అనే చెప్పొచ్చు.

మోదీ టీంకి దూరమైన తరువాత ప్రశాంత్ కిశోర్ 2015లో బిహార్ ఎన్నికల్లో జనతాదళ్(యు)కి పనిచేశారు. ఆ పార్టీలో కూడా చేరారు. అయితే, ఎన్నికల అనంతర సమీకరణాలతో నితీశ్ పార్టీ మళ్లీ బీజేపీతో కలిసి ప్రభుత్వం నడిపిస్తోంది. ఇది నచ్చని ప్రశాంత్ కిశోర్ నితీశ్‌కు దూరంగా జరిగారు. ఆ తరువాత 2017 పంజాబ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి పనిచేసి కెప్టెన్ అమరీందర్ సింగ్ సీఎం కావడానికి సాయపడ్డారు. ఆ తరువాత 2021 ప్రారంభంలో అమరీందర్‌కు ప్రధాన సలహాదారుగా కూడా నియమితులయ్యారు. కానీ, అక్కడికి కొన్ని నెలల్లోనే అక్కడ భారీ రాజకీయ మార్పులు జరిగి అమరీందర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టి బీజేపీకి చేరువయ్యారు. ఇది జరగడానికి ముందే అమరీందర్, భాజపాల మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యాన్ని గమనించిన ప్రశాంత్ కిశోర్ అమరీందర్ వద్ద సలహాదారు పదవికి రాజీనామా చేసేశారు.

2020లో దిల్లీ అసెంబ్లీ ఎణ్నికలకు ఆప్ కోసం పనిచేసిన ప్రశాంత్ కిశోర్ మాయలో కేజ్రీవాల్ కూడా పడ్డారు. కానీ, ఆయన తొందరగానే తేరుకుని ఆచితూచి కేంద్రంతో వ్యవహరిస్తున్నారు. కేజ్రీవాల్ మోదీ విషయంలో ఒక్కోసారి మెతకగా ఉండడాన్ని సహించని ప్రశాంత్ కిశోర్ ఆప్ కోసం పనిచేయడం మానేశారు. 2021 పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు ముందు నుంచి తృణమూల్ కాంగ్రెస్ కోసం పనిచేస్తున్న ప్రశాంత్ కిశోర్.. మమతా బెనర్జీని ఆ ఎన్నికలలో గెలిపించారు. అదేసమయంలో మోదీతో సందర్భాన్ని బట్టి మాత్రమే కయ్యమాడే మమతను దేశంలోనే మోదీకి ప్రధాన శత్రువుగా మార్చగలిగారు. అయితే…. ఇప్పుడు ప్రశాంత్ కిశోర్ జోక్యం పెరిగిపోవడంతో తృణమూల్ నేతలకు, ప్రశాంత్ కిశోర్‌కు చెందిన ఐప్యాక్ట్ టీం మధ్య గొడవలు జరుగుతున్నాయి. తాజాగా గోవాలో తృణమూల్ పార్టీ అధ్యక్షుడు ఎన్నికల అనంతరం ప్రశాంత్ కిశోర్‌పై విరుచుకుపడ్డారు. ఇక 2021లో తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే తరఫున ప్రశాంత్ కిశోర్ పనిచేశారు. డీఎంకేది మొదటి నుంచి కాంగ్రెస్ పక్షం… బీజేపీకి వ్యతిరేకమైన విధానమే అయినప్పటికీ హిందీ భాష, మరికొన్ని విషయాలలో కేంద్రం, బీజేపీతో ఘర్షణ వాతావరణం నెలకొనేలా చేయడం వెనుక ఉన్నది మాత్రం ప్రశాంత్ కిశోర్ అనే చెబుతారు.

ఇక ప్రస్తుతం తెలంగాణలో కేసీఆర్ కోసం ప్రశాంత్ కిశోర్ పనిచేస్తున్నారు. 2018 ఎన్నికలకు ముందు కూడా కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అంటూ హడావుడి చేసినా తరువాత చల్లబడ్డారు. కానీ, ఇప్పుడు మాత్రం కేసీఆర్ భారీ స్థాయిలో బీజేపీ, మోదీలను ఢీకొట్టేందుకు సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తున్నారు. ఇదంతా ప్రశాంత్ కిశోర్ ప్రభావమేనంటున్నారు రాజకీయ పరిశీలకులు.
ఇలా నేతలందరినీ తన ప్రభావంలో పడేలా చేసి మోదీ, బీజేపీలతో కయ్యానికి ఉసిగొల్పుతున్న ప్రశాంత్ కిశోర్ మాత్రం వైసీపీ అధినేత జగన్ ముందు మాత్రం ఓడిపోయారనే చెప్పుకోవాలి. తన బిహార్ మార్క్ ఎత్తుగడలతో 2019 ఎన్నికలలో వైసీపీని గెలిపించి 151 సీట్లతో జగన్‌ను ఏపీ సీఎం చేసిన ప్రశాంత్ కిశోర్ రానున్న ఎన్నికల కోసం కూడా జగన్ పార్టీకి పనిచేస్తున్నారు.

ప్రస్తుతం ఏపీలో మంత్రులు, 80 శాతం మంది ఎమ్మెల్యేలు, ఎంపీల సోషల్ మీడియా వ్యవహారాలు చూస్తున్నది ప్రశాంత్ టీమే. ఆ రేంజ్‌లో వైసీపీకి సర్వీస్ అందిస్తున్న ప్రశాంత్ కిశోర్.. జగన్ ను మాత్రం మోదీపై యుద్ధానికి పంపలేకపోయారు. పోలవరం, ప్రత్యేక హోదా, విభజన హామీలు వంటి ఎన్నో అంశాలను అడ్డం పెట్టుకుని కేంద్రంతో తలపడే అవకాశం ఉన్నా ప్రశాంత్ ప్రభావంలో మాత్రం జగన్ పడలేదు. మోదీ, అమిత్ షాల ముందు చేతులు కట్టుకునే జగన్ నిల్చుంటున్నారు కానీ ప్రశాంత్ మాటల ప్రభావానికి లొంగలేదు. అదే సమయంలో తన మాట విననప్పటికీ జగన్‌ను వదిలిపోలేదు ప్రశాంత్ కిశోర్. మరి, ఆ రహస్యమేంటో జగన్, ప్రశాంత్ కిశోర్‌లకే తెలియాలి.