సజ్జల స్పీక్స్ : హోదా బాధ్యత బీజేపీదేనట

ప్ర‌త్యేక హోదా గురించి బీజేపీ నే మాట్లాడాలి. వైసీపీ కూడా మాట్లాడాలి. మాట్లాడాల్సినంత మాట్లాడితేనే ఏ హ‌క్కు అయినా సొంతం అయ్యేది.ఏ హ‌క్కు అయినా సొంతం అయి స్థిర‌మ‌య్యేది.కానీ ఇక్క‌డ మాట్లాడాల్సినంత వైసీపీ మాట్లాడ‌డం లేదు అన్న‌ది వాస్త‌వం. లోక్ స‌భ‌లో కానీ రాజ్య స‌భ‌లో కానీ మెత్త‌గా మాట్లాడితే ప‌నులు కావు. హోదా మీకే కాదు మాక్కూడా కావాలి అని  అంటోంది తెలంగాణ. హోదా మీకే కాదు మాక్కూడా అని అంటోంది బీహార్. ఇంకా ఒడిశా కూడా ఇదే క్యూ లైన్ లో ఉంది. కానీ మ‌న క‌న్నా నిబ్బరంగా ఉంటూ హోదా మీద గొంతెత్తిన తెలంగాణ‌కు నిజంగానే హ్యాట్సాఫ్ చెప్పాలి.

 మ‌న‌తో పాటే వాళ్లు కూడా హోదా విష‌య‌మే కాదు కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వ‌మ‌ని అడుగుతున్నారు. మ‌నలానే వాళ్లు కూడా రేప‌టి వేళ సింగ‌రేణి బొగ్గుగ‌నులు ప్ర‌యివేటీక‌ర‌ణ అయిపోతే ఏం చేయాలో తోచ‌క త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. మ‌న‌లానే వాళ్లు కూడా విద్యుత్ క‌ష్టాలు లేని వేస‌విని కోరుకుంటున్నారు.ఇవ‌న్నీ కూడా ఆంధ్రాతో పాటే తెలంగాణ‌లోనూ చోటుచేసుకుంటున్న ప‌రిణామాలు.విచిత్రం ఏంటంటే హోదా గురించి వైసీపీ ప‌ట్టుబ‌ట్ట‌క‌పోయినా క‌నీసం తెలంగాణ నాయ‌కుల‌ను అయినా క‌లుపుకుని పోతే ఫ‌లితాలు ఉంటాయి అని ఉండ‌వ‌ల్లి లాంటి పొలిటిక‌ల్ ఎన‌లిస్టులు కోరుతున్నారు.కానీ వైసీపీ మాత్రం అస్స‌లు ప‌ట్టించుకోవ‌డం లేదు.

ఇదే స‌మ‌యంలో వైసీపీ త‌ర‌ఫున స‌భ‌లో నోటీసు ఇచ్చేందుకు కూడా స‌భ్యులెవ్వ‌రూ ముందుకు రావ‌డం లేద‌ని ఆందోళ‌న చెందుతున్నారు ఉండ‌వ‌ల్లి.ఇప్పుడు మాత్రం బాధ్య‌త అంతా కేంద్రానిదే అని స‌జ్జ‌ల కానీ మ‌రొక‌రు కానీ చెప్పినా అడిగే నోళ్లు స్పందించ‌కుండా ఉంటే కేంద్రం ఎలా హోదా ఇస్తుంద‌ని..? క‌నీసం ఆలోచ‌న కూడా చేయ‌కుండా ఎంపీలు ఎలా నోళ్లు కుట్టేసుకుని కూర్చొంటున్నార‌ని ? అని యువ ఎంపీ కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు నిల‌దీస్తున్నారు.గ‌తంలో హోదా కోసం పార్ల‌మెంట్ ప్రాంగణాన నిర‌స‌న దీక్ష‌లు చేశామ‌ని కానీ ఇప్పుడు వైసీపీ క‌నీసం ఆ విష‌యాన్నే ప్ర‌స్తావించకుండా బాధ్య‌త లేదా బ‌రువు అన్నీ కూడా కేంద్రానివే అని వైసీపీ చెప్ప‌డం త‌ప్పు అని టీడీపీ అంటోంది.

ఈ నేప‌థ్యంలో హోదా అన్న‌ది ఓ ముగిసిన అధ్యాయం అని మ‌రోసారి కేంద్రం  చెప్పినా చెప్ప‌వ‌చ్చు..అప్పుడు దేవుడిపైనే ఆంధ్రోళ్లంతా భారం వేయాల్సిందే! ఇప్పుడు మ‌న నాయ‌కులు కేంద్రం పై భారం వేశారు. రేపు మ‌నం దేవుడిపైనే భారం వేద్దాం. కానీ హోదా అన్న‌ది హ‌క్కు అది సాధించాల్సిందే అని మాత్రం ఆంధ్రులెవ్వ‌రూ అనుకోవ‌డం లేదు. అదే విచార‌క‌రం.  నాయ‌కులే కాదు ప్ర‌జ‌లు కూడా అనుకోవ‌డం లేదు అన్న‌దే శోచ‌నీయం. బాధాకరం కూడా!