మందు బాబులకు మరో షాక్ ఇచ్చిన జగన్

రాష్ట్రంలో రహదారి ప్రమాదాలు తగ్గించేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన సమావేశమైన రోడ్డు సెఫ్టీ కౌన్సిల్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు. రోడ్డు భద్రత కోసం చర్యలు తీసుకునేందుకు లీడ్ ఏజెన్సీని ఏర్పాటు చేయటంతో పాటు.. ప్రస్తుతం ఇస్తున్న డ్రైవింగ్ లైసెన్సుల జారీ విధానంలో మార్పులు తీసుకురావాలని నిర్ణయించారు. రోడ్ల పక్కన మద్యం అమ్మకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

ముఖ్యంగా జాతీయ, రాష్ట్ర ర‌హ‌దారుల ప‌క్క‌న ఉండే.. దాబా హోట‌ళ్ల‌లో మ‌ద్యం వినియోగాన్ని, అమ్మ‌కాన్ని కూడా నిషేధించారు. పోలీసు, ట్రాన్స్‌పోర్ట్, హెల్త్‌, రోడ్‌ ఇంజినీరింగ్‌ విభాగాల నుంచి నిపుణులతో లీడ్ ఏజెన్సీ ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. రోడ్‌ సేఫ్టీ ఫండ్‌ ఏర్పాటునకు సీఎం జగన్ ఆమోదముద్ర వేశారు. ప్రమాద బాధితులకు చికిత్స కోసం క్యాష్‌లెస్‌ ట్రీట్‌ మెంట్‌ అందే లా చర్యలు తీసుకోవాలన్నారు. క్యాష్ లెస్ ట్రీట్మెంట్ ఇచ్చే నెట్‌వర్క్‌ ఆస్పత్రుల జాబితా తయారు చేసి ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పారు. ఐరాడ్‌ యాప్‌ వినియోగించుకుని ప్రమాదాలపై లైవ్‌ అప్‌డేట్‌ పొందేలా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

పీపీపీ పద్ధతిలో రవాణాశాఖ ద్వారా ఆటోమేటెడ్‌ ఎఫ్‌సీ టెస్టింగ్‌ ఏర్పాటుపై కార్యాచరణ రూపొందించాలని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాద బాధితులకు బీమా పరిహారం దక్కేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 1190 బ్లాక్‌ స్పాట్స్‌ గుర్తించామని తెలిపారు. 520 స్పాట్స్‌ను రెక్టిఫై చేశామని చెప్పారు. ఆర్‌అండ్‌బీ నిర్వహిస్తున్న నేషనల్ హైవేల్లోనూ 78 బ్లాక్‌ స్పాట్స్‌ను రెక్టిఫై చేశామన్నారు. రోడ్డుపై లైన్ మార్కింగ్‌ చాలా స్పష్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. బైక్‌లకు, నాలుగు చక్రాల వాహనాలకు ప్రత్యేకంగా లైన్లు ఏర్పాటు చేయడంపై ఆలోచించాలన్నారు.

రోడ్లపై ఎంత వేగంతో వెళ్లాలో సూచిస్తూ సైన్‌ బోర్డులు తప్పకపెట్టాలని, ఫలితంగా చాలా వరకు ప్రమాదాలు తగ్గే ఆస్కారం ఉంటుందని అభిప్రాయపడ్డారు. రోడ్లు పక్కన దాబాల్లో మద్యం అమ్మకుండా చూడాలని, దీనివల్ల చాలా వరకు ప్రమాదాలు తగ్గుతాయన్నారు. ముఖ్యమైన రోడ్ల పక్కన యాక్సెస్‌ బారియర్స్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాల వారీగా ఏర్పాటవుతున్న కమిటీలు.. రోడ్డు ప్రమాదాలపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ తగిన నివారణ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ విధానాన్ని పునఃసమీక్షించాలని సీఎం ఆదేశించారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఆర్టీసీ, ప్రభుత్వం సహకారంతో కలిపి ఒక డ్రైవింగ్‌ స్కూలు ఏర్పాటు చేయాలని సూచించారు.