అర్ధ‌రాత్రి టీడీపీ ఎమ్మెల్సీ అరెస్టు.. కార‌ణం ఇదే

ప్ర‌జలంతా  గాఢ నిద్ర‌లో ఉన్న స‌మ‌యంలో.. రాష్ట్రం మొత్తం.. త‌లుపులు మూసుకున్న నిశిరాత్రి వేళ‌.. అధికారం.. క‌న్ను తెరిచింది. పోలీసుల బూట్లు ప‌రుగులు పెట్టాయి. ప్ర‌తిప‌క్ష నేత‌ అరెస్టు జ‌రిగింది. ఇంత రాత్రివేళ‌.. అంత అరెస్టు ఎందుకు? ఆయ‌నేమ‌న్నా.. దేశ‌ద్రోహం చేశారా?  రాష్ట్ర ఖ‌జానాకు న‌ష్టంక‌లిగిం చాడా?  కుల మ‌తాల మ‌ధ్య చిచ్చు పెట్టాడా? అంటే.. డామిట్‌.. ధిక్కార‌మున్ సైతువా!! అంటున్నారు పోలీసులు…

ఇంత‌కీ టీడీపీ ఎమ్మెల్సీ.. ప‌రుచూరు అశోక్ బాబును అరెస్టు చేయ‌డం వెనుక‌.. ప్రభుత్వ సర్వీస్‌లో ఉన్నప్పుడు పదోన్నతి కోసం విద్యార్హతను తప్పుగా చూపించారన్న ఆరోపణలనే అధికారులు మ‌రోసారి చెప్పారు. ఈ నెపంతోనే  ఎమ్మెల్సీ అశోక్ బాబును సీఐడీ పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. వాణిజ్య పన్నుల శాఖలో పని చేసినప్పుడు బీకాం చదవకపోయినా చదివినట్లు తప్పుడు ధృవపత్రం సమర్పించారని విజయవాడకు చెందిన మెహర్ కుమార్ గతంలో లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు.

దీనిపై వాణిజ్య పన్నుల శాఖ నుంచి నివేదిక తెప్పించుకున్న లోకాయుక్త… సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశించింది. ఇందులో భాగంగా వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కమిషనర్ ఇటీవల అశోక బాబుపై సీఐడీకి ఫిర్యాదు చేయగా.. గత నెల 25న వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసులోనే అశోక్ బాబును గురువారం అర్ధరాత్రి అరెస్టు చేసినట్లు నోటీసుల్లో సీఐడీ అధికారులు పేర్కొన్నారు. అశోక్ బాబు అరెస్టు పట్ల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.

అశోక్ బాబును సీఐడీ అధికారులు గుంటూరులోని కార్యాలయానికి తీసుకువచ్చారు. అర్థరాత్రి సమయంలో విజయవాడలోని ఆయన నివాసంలో అశోక్బాబును అదుపులోకి తీసుకున్న సీఐడీ అధికారులు.. ఈరోజు తెల్లవారుజామున గుంటూరు తీసుకువచ్చారు. సీఐడీ కార్యాలయానికి వెళ్లే మార్గాల్లో పోలీసులు మోహరించారు. మెడికల్ కాలేజి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరూ అటువైపు వెళ్లకుండా ఆంక్షలు విధించారు.

తాను ఏ తప్పు చేయలేదని రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే కేసు నమోదైందని అశోక్ బాబు జనవరి 26న విలేఖరుల సమావేశంలో వివరణ ఇచ్చారు. తాను ఎమ్మెల్సీ కావడం ఇష్టం లేక, అసూయ వల్ల శాఖలో ఇష్టం లేని వారు చేసిన పనని ఆరోపించారు. ఉద్యోగుల ఆందోళన సమయంలో తన విద్యార్హతను తెరపైకి తీసుకురావడంలోనే రాజకీయం ఉందని ఆయన విమర్శించారు.

ఖండించిన చంద్ర‌బాబు

ఎమ్మెల్సీ ఆశోక్ బాబు అరెస్టును టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లు తీవ్రంగా ఖండించారు. ఎపీ ప్రభుత్వ తీరుపై చంద్రబాబు మండిపడ్డారు. సర్వీస్ మేటర్స్లో తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్థ రాత్రి అరెస్టు చెయ్యాల్సిన అవసరం ఏమోచ్చిందని నిలదీశారు. ఉద్యోగుల సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీసినందునే అశోక్ బాబుపై ప్రభుత్వం కక్షగట్టిందని చంద్రబాబు దుయ్యబట్టారు. జ‌గన్ ప్రభుత్వం చేస్తున్న ప్రతి తప్పుకు మూల్యం చెల్లిం చుకుంటుందని హెచ్చరించారు.