బీజేపీని వెన‌కేసుకు రావాలంటే జీవీఎల్ త‌ర్వాతే ఎవ‌రైనా!

జీవీఎల్ న‌ర‌సింహారావు… బీజేపీ ఏపీ నేత‌. పార్టీ త‌ర‌ఫున బ‌లంగా గ‌లం వినిపించ‌డంలో ఆయ‌న ముందుంటారు. కొన్ని సార్లు జీవీఎల్ తీరు చ‌ర్చ‌నీయాంశంగా మారుతుంది. ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఇదే రీతిలో వైర‌ల్ అయ్యాయి. ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్‌గా ఎంపీ జీవీఎల్ స్పందిస్తూ ఏపీకి ప్ర‌త్యేక హోదా స‌రైన ప‌రిష్కారం కాద‌ని తెలిపారు.

స్పెష‌ల్ స్టేట‌స్ వ‌ల్ల లాభం కంటే న‌ష్ట‌మే ఎక్కువ అని జీవీఎల్ విశ్లేషించారు. ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని తేల్చిచెప్పిన జీవీఎల్ ప్రత్యేక హోదాతో ఏపీకి ఎలాంటి ప్రయోజనం లేదని తేల్చి చెప్పారు. ప్రత్యేక హోదాకు పారిశ్రామిక రాయితీలకు ఎలాంటి సంబంధం లేదన్న జీవీఎల్.. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అవాస్తవాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. స్పెషల్ స్టేటస్ అనేది టీడీపీ, వైసీపీ పార్టీలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడానికి ఉపయోగించే రాజకీయ అంశం అని అన్నారు.

ప్రత్యేక హోదాకు మించిన ప్రయోజనాలు కలిగించే ప్రత్యేక ప్యాకేజీ మోడి ప్రభుత్వం ఇచ్చిందని ఆయన వెల్లడించారు. ప్రత్యేక హోదా అనే పేరుతో వచ్చేదేమీ లేదని, అంతకు మించి రాష్ట్రానికి నిధులు అందుతున్నాయని వివరించారు. ప్రత్యేక హోదాకు బదులుగా రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ వచ్చిందని చెప్పారు.  

కేంద్ర పాలిత ప్రాంతమైన పాండిచ్చేరికి ఇస్తామన్న ప్రత్యేక హోదాయే కావాలంటే ఆంధ్ర ప్రదేశ్ ను కూడా కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని, దయచేసి ఏపీని అలా చేయవద్దని మనవి అని ఆయన అన్నారు. ముందు ఒప్పుకున్న చంద్రబాబు తర్వాత ఏమైందో తిరస్కరించారని ఆయన విమర్శించారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేక హోదా అంశం లేదన్న జీవీఎల్ 14వ ఆర్ధిక సంఘం ప్రత్యేక హోదా లేదని చెప్పిందని గుర్తు చేశారు.